ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

న్యాయాధిపతులు 11

 1. గిలాదీయుడగు యెఫ్తా మహాశూరుడు. అతడు గిలాదునకు వేశ్యవలన పుట్టినవాడు.

2. గిలాదు భార్యకు పుట్టిన బిడ్డలు పెరిగి పెద్దవారైన పిదప యెఫ్తాను వెళ్ళగొట్టిరి. “నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడవు కనుక మా తండ్రి స్వాస్థ్యములో నీకు భాగము లేదు పొమ్ము" అనిరి.

3. యెఫ్తా సోదరులనుండి పారిపోయి టోబు మండలమున తలదాచుకొనెను. అచట దుండగులు కొందరు అతనితో చేరిరి. వారందరు కలిసి పట్టణముల పైబడి దోచుకొనెడివారు.

4. యెఫ్తా యీ రీతిగా దోపిడి జరుపుచున్న కాలముననే అమ్మోనీయులు యిస్రాయేలీయుల మీదికి దండెత్తివచ్చిరి.

5. కనుక గిలాదు పెద్దలు బోబు మండలము నుండి యెఫ్తాను తీసికొనివచ్చుటకు వెళ్ళిరి.

6. వారు యెఫ్తాతో “నీవు మాతో రమ్ము. నీవు మాకు నాయకుడవయ్యెదవేని అమ్మోనీయులతో పోరాడవచ్చును” అనిరి.

7. కాని యెఫ్తా వారితో “నన్ను ద్వేషభావముతో నాడు నా తండ్రి ఇంటినుండి వెళ్ళగొట్టినది మీరుకారా? ఇప్పుడు మీకు కష్టములు వచ్చి నా కాళ్ళు పట్టుకొనవచ్చితిరా?” అనెను.

8. వారు “నిజమే! మాకు కష్టములు వచ్చినవి కనుకనే నిన్నాశ్రయింపవచ్చితిమి. నీవు వచ్చి అమ్మోనీయులతో పోరాడవలయును. ఇక గిలాదునంతటికి నీవే నాయకుడవు కావలయును” అనిరి.

9. యెఫ్తా “నేను మీ వెంటవచ్చి అమ్మోనీయులతో పోరాడగా ప్రభువు శత్రువులను నా వశము చేసినచో నేను మీకందరకు నాయకుడనయ్యెదనుగదా?” అని ప్రశ్నించెను.

10. వారతనితో “నీ మాట చొప్పుననే నడచెదము. యావే మనకు సాక్ష్యముగానుండుగాక!” అనిరి.

11. కనుక యెఫ్తా గిలాదు నాయకులతో బయలుదేరి వచ్చెను. వారతనిని గిలాదునకు నాయకునిగా, సేనాధిపతినిగా నియమించిరి. మిస్పా వద్ద యావే యెదుట యెఫ్తా తన షరతును పునరుద్ఘాటించెను.

12. యెఫ్తా, అమ్మోనురాజు వద్దకు దూతలనంపి “నీవు మా దేశము మీదికి యుద్ధమునకు వచ్చుటకు కారణమేమి? అని అడిగించెను.

13. అమ్మోనురాజు “యిస్రాయేలీయులు ఐగుప్తునుండి వెడలి వచ్చినపుడు అర్నోను నుండి ఇటు యబ్బోకు వరకును, అటు యోర్డాను వరకును నా దేశమును ఆక్రమించుకొనిరి. కావున ఐగుప్తునుండి యిస్రాయేలీయులు వచ్చినపుడు మీరు ఆక్రమించుకొనినభాగము ఇపుడు శాంతియుతముగా మాకు ఇచ్చివేయుడు” అని జవాబు పంపెను.

14-15. యెఫ్తా “యిస్రాయేలీయులు మోవాబీయుల దేశమునుగాని, అమ్మోనీయుల దేశమునుగాని ఆక్రమించుకోలేదు.

16. యిస్రాయేలీయులు ఐగుప్తునుండి వెడలివచ్చినపుడు ఎడారి మార్గమున నడచి రెల్లు సముద్రమునకు వచ్చి కాదేషు చేరిరి.

17. అచటినుండి ఎదోమురాజు వద్దకు దూతలనంపి 'మమ్ము నీ రాజ్యముగుండా వెడలిపోనిమ్ము' అని అడిగించిరి. కాని ఆ రాజు అంగీకరింపలేదు. అదే విన్నపమును మోవాబు రాజునకును పంపిరి. అతడును వారి కోరికను నిరాకరించెను. కనుక యిస్రాయేలీయులు కాదేషుననే నిలిచిపోయిరి.

18. తరువాత వారు ఎడారియందు ప్రయాణముచేసి ఎదోము మోవాబు దేశములను చుట్టివచ్చి మోవాబునకు తూర్పు దిక్కున కనాను దేశమందు ప్రవేశించి, అర్నోను నదికి ఆవలి దరిని శిబిరము పన్నిరి. ఆ నదియే మోవాబు దేశమునకు ఎల్ల గనుక మా వారు మోవాబు దేశమున అడుగిడనేలేదు.

19. అంతట యిస్రాయేలీయులు హెష్బోనున వసించు అమోరీయరాజు సీహోను నొద్దకు దూతలనంపి 'నీ దేశముగుండ మమ్ము వెడలిపోనిమ్ము' అని అడిగించిరి.

20. కాని సీహోను అందుకు అంగీకరింపక తన సైన్యములను ప్రోగుచేసికొని వచ్చి యాహాసువద్ద శిబిరముపన్ని యిస్రాయేలీయులతో పోరాడెను.

21. కాని యిస్రాయేలు దేవుడైన యావే సీహోనును సైన్యములతోపాటు యిస్రాయేలీయుల వశముచేసెను. కనుక యిస్రాయేలీయులు వారిని లొంగదీసిరి. ఆ ప్రాంతమున వసించు అమోరీయుల దేశమునంతటిని ఆక్రమించుకొనిరి.

22. ఈ రీతిగా యిస్రాయేలీయులు అర్నోను నుండి యబ్బోకు వరకు, ఎడారినుండి యోర్ధాను వరకు గల అమోరీయుల దేశమునంతటిని స్వాధీనము చేసికొనుట సంభవించినది.

23. మా దేవుడైన యావే అమోరీయులను మా యెదుటినుండి వెళ్ళగొట్టెననగా నేడు నీబోటివారు మేము ఆక్రమించుకొన్న దేశమును స్వాధీనము చేసి కొనగలరా?

24. మీ దేవుడైన కెమోషు ఏ రాజుల రాజ్యములను మీకు వశపరచెనో ఆ రాజ్యములను నేడు మీరు అనుభవించుట లేదా? ఆ రీతిగనే మా దేవుడైన యావే ఏ రాజులను మా ఎదుటినుండి వెళ్ళ గొట్టెనో వారి రాజ్యములను మేము అనుభవించుచున్నాము.

25. సిప్పోరు కుమారుడైన మోవాబీయుల రాజగు బాలాకు కంటెను నీవేమి మొనగాడవుకావు. అతడు ఎన్నడైన యిస్రాయేలీయులపై సవాలుచేసి యుద్ధమునకు వచ్చెనా?

26. యిస్రాయేలీయులు మూడువందల ఏండ్లనుండి హెష్బోనుమండల గ్రామములందును, అరోయేరుమండల గ్రామములందును, అర్నోను మండల గ్రామములందును వసించుచుండిరి గదా? ఇంతకాలమునుండి వారిని వెళ్ళగొట్టక ఊర కుంటిరేల?

27. మేము మీకు ఏ అపరాధమును చేయలేదు. మీరే యుద్ధము ప్రారంభించి మాకు అపరాధము చేయుచున్నారు. న్యాయాధిపతియైన దేవుడు నేడు యిస్రాయేలీయులకు అమ్మోనీయులకు తీర్పు తీర్పకపోడు” అని ప్రత్యుత్తరమంపెను.

28. కాని అమ్మోనీయుల రాజు, యెఫ్తా పంపిన ప్రత్యుత్తరమును లెక్కచేయలేదు.

29. అంతట యావే ఆత్మ యెఫ్తాను ఆవేశింపగా అతడు గిలాదు, మనష్షే మండలములు దాటిపోయెను. గిలాదునందలి మిస్ఫానుండి బయలువెడలి అమ్మోనీయుల దాపునకు వచ్చెను.

30-31. అతడు యావే ఎదుట ఒక ప్రతిజ్ఞ చేసెను. “నీవు అమ్మోనీయులను నా చేతికి చిక్కింతువేని నేను శత్రువులను ఓడించి విజయసిద్దితో తిరిగివచ్చునపుడు స్వాగతము చెప్పు టకు నా ఇంటిద్వారమునుండి ఎదురువచ్చిన వ్యక్తిని నీకు బలియిచ్చెదను. ఆ వ్యక్తిని నీకు దహనబలిగా అర్పించెదను" అని పలికెను.

32. యెఫ్తా అమ్మోనీయులను ఎదుర్కొనగా యావే వారిని అతని చేతికి చిక్కించెను.

33. అరోయేరు నుండి మిన్నీతు వరకును, ఆబేల్కెరామిము వరకును వారిని ఊచముట్టుగ తునుమాడెను. ఆ రీతిగా అమ్మోనీయులు యెఫ్తాకు లొంగిపోయిరి.

34. యెఫ్తా మిస్పా నగరమునందలి తన ఇంటికి తిరిగిరాగా గృహమునుండి సితారాగానముతో నాట్యమాడుచు తన కూతురు ఎదురువచ్చెను. ఆమె అతనికి ఏకైక పుత్రిక. ఆ బాలిక తప్ప అతనికి కొడుకులుగాని కుమార్తెలుగాని లేరు.

35. యెఫ్తా ఆమెను చూచి శోకముతో బట్టలుచించుకొని “తల్లీ! నీవు నా గుండెలు బ్రద్దలు చేసితివి. నా కడుపున చిచ్చు పెట్టితివి. నేను యావేకు మాట ఇచ్చితిని. నా మాట నిలబెట్టుకోక తప్పదు” అనెను.

36. ఆమె అతనితో “నాయనా! నీవు యావేకు మాట ఇచ్చితినంటివి గదా! ప్రభువు శత్రువుమీద విజయమును ప్రసాదించెను. కనుక నీవు ప్రభువు సమ్ముఖమున చేసిన ప్రతిజ్ఞ నిలబెట్టుకొనుము.

37. నా మనవి ఒక్కటి మాత్రము వినుము. నన్ను రెండు నెలలపాటు ఒంటరిగా విడిచి పెట్టుము. నేను నా చెలికత్తెలతోపోయి కొండలలో తిరుగాడి నిష్ఫలమైన నా కన్యాత్వమును గూర్చి శోకించి వచ్చెదను” అనెను'.

38. యెఫ్తా అట్లే వెళ్ళుమని చెప్పి కుమార్తెను రెండు నెలలపాటు పంపివేసెను. ఆమె చెలికత్తెలతో వెడలిపోయి నిష్పలమైన తన కన్నెరికమును గూర్చి కొండలలో పెద్దపెట్టున దుఃఖించెను.

39. గడువు ముగియగానే బాలిక తిరిగిరాగా యెఫ్తా తాను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడి ప్రకారము ఆమెకు చేసెను. ఆ బాలిక మగపోడిమి ఎరుగని కన్నె.

40. అటుతరువాత యిస్రాయేలు వనితలు ఏటేట ఇల్లు వెడలి గిలాదీయుడగు యెఫ్తా కుమార్తెను గూర్చి నాలుగుదినములు శోకించుట ఆచారమయ్యెను.