ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రాజులు రెండవ గ్రంధము 10

 1. అహాబు కుమారులు డెబ్బదిమంది సమరియా నగరమున నివసించుచుండిరి. యెహూ లేఖ వ్రాసి సమరియా నగరపాలకులకు పట్టణమునందలి ప్రముఖ వ్యక్తులకు, అహాబు కుమారుల సంరక్షకులకు పంపెను. ఆ లేఖయందలి వృత్తాంత మిది:

2-3. “మీరు రాజవంశస్తులకు సంరక్షకులు గదా! రథములు, గుఱ్ఱములు, ఆయుధములు, సురక్షిత పట్టణములు మీ ఆధీనమున ఉన్నవి. ఈ లేఖ మీకు చేరినవెంటనే మీ రాజపుత్రులలో యోగ్యు డైనవానిని ఒకనిని రాజును చేయవచ్చును. నా దాడి నుండి అతనిని రక్షించుటకు మీరందరు పోరాడ వచ్చును."

4. ఆ వార్త విని సమరియా పాలకులు నిలువున నీరై “ఇద్దరురాజులు యెహూను ఎదిరింపలేకపోయిరి. ఇక మనబోటివారము ఇతనితో పోరాడగలమా?” అని అనుకొనిరి.

5. కనుక ప్రాసాద రక్షకులు, నగరపాలకులు, పౌరులలో ప్రముఖులు, రాజవంశజుల సంరక్షకులు కూడబలుకుకొని "అయ్యా! మేము నీ దాసులము. నీవు చెప్పినట్లు చేయగల వారము. మేమెవరిని రాజుగా అభిషేకించుటలేదు. ఇక నీ ఇష్టము వచ్చినట్లు చేయుము” అని యెహూకు సందేశమంపిరి.

6. యెహూ “మీరు నా పక్షమునజేరి, నా ఆజ్ఞలను పాటింపగోరెదరేని రేపీపాటికి ఆహాబు కుమారుల శిరములను యెస్రెయేలునకు కొనిరండు” అని వారికి రెండవసారి ఉత్తరము వ్రాసెను. అహాబు కుమారులు డెబ్బదిమంది కదా! ప్రముఖులైన సమరియా పౌరులు వారిని పెంచి పెద్దచేయుచుండిరి.

7. యెహూ జాబు అందగనే వారు డెబ్బదిమంది రాజకుమారులను చంపి వారితలలను గంపలలో పెట్టి యెస్రెయేలున ఉన్న యెహూవద్దకు పంపిరి.

8. యెహూ రాజకుమా రుల తలలు చేరినవని విని వానిని నగరద్వారముచెంత రెండుకుప్పలుగా పేర్చి రేపు ప్రొద్దుటివరకు అచటనే ఉండనిండని ఆజ్ఞాపించెను.

9. మరునాటి ప్రొద్దుట యెహూ నగరద్వారము వద్దకు వెళ్ళి అచటి జనులతో “యెహోరాము రాజును నేనే కుట్రపన్ని వధించితిని. అతని చావునకు మీరు బాధ్యులుకారు. కాని వీరినందరిని చంపినదెవరు?

10. ప్రభువు అహాబు వంశజులను గూర్చి పలికినదంతయు నెరవేరి తీరునుగదా! అతడు ఏలియా ప్రవక్తద్వారా వచించినదంతయు సిద్దించినది” అనెను.

11. యెహూ యెస్రెయేలున వసించుచున్న అహాబు బంధువులను, ఉద్యోగులను, మిత్రులను, యాజకులను మట్టు పెట్టెను. వారిలో ఒక్కరిని కూడ ప్రాణములతో మిగులనీయలేదు.

12. యెహూ యెస్రెయేలు నుండి సమరియా వెళ్ళుచుండగా త్రోవలో బేత్తెకేదులో “కాపరుల మకాము” అనుచోట అహస్యారాజు బంధువులు కొందరు అతని కంటబడిరి.

13. అతడు మీరెవ్వరని ప్రశ్నింపగా వారు "మేము అహస్యారాజు చుట్టాలము. యెసెబెలు సంతానమును, రాజవంశజులను సందర్శించుటకు యెస్రెయేలునకు వెళ్ళుచున్నాము” అని చెప్పిరి.

14. యెహూ “వీరిని సజీవులుగా బంధింపుడు” అని ఆజ్ఞాపింపగా సేవకులు వారిని బంధించిరి. యెహూ వారినందరిని అచటి మడుగువద్ద వధించెను. వారందరు కలిసి నలువది ఇద్దరు. వారిలో ఒక్కడును తప్పించుకోలేదు.

15. యెహూ అచటి నుండి బయలుదేరి వెళ్ళు చుండగా రేకాబు కుమారుడైన యెహోనాదాబు దారిలో అతనిని కలిసికొనెను. యెహూ అతనిని కుశలమడిగి “నాకు నీపట్లవలె నీకు నాపట్ల సుహృద్భావము కలదా?” అని ప్రశ్నించెను. అతడు 'ఉన్నది' అని బదులు చెప్పెను. యెహూ “అటులయిన నా చేతిలో చేయివేయుము” అనగా యెహోనాదాబు అతని చేతిలో చేయివేసెను. యెహూ యెహోనాదాబు చేయి పట్టుకొని అతనిని రథము మీదికి ఎక్కించుకొనెను.

16. “నీవు నా వెంట రమ్ము. ప్రభువుపట్ల నాకు గల ఆసక్తిని నీవే కన్నులార చూడగలవు” అని యెహూ నుడివెను. ఆ రీతిగా వారిరువురు సమరియాకు వెళ్ళిరి.

17. ఆ నగరము చేరుకోగానే యెహూ మిగిలియున్న అహాబు బంధువులనందరిని చంపివేసెను. ప్రభువు ఏలియాప్రవక్త ద్వారా చెప్పినట్లే అంతయు జరిగెను.

18. యెహూ సమరియా పౌరులను ప్రోగుజేసి “అహాబు బాలు దేవతను కొద్దిగనే పూజించెను. నేను అతనిని అధికముగా పూజింతును.

19. కనుక బాలు ప్రవక్తలను, ఆరాధకులను, అర్చకులను అందరిని పిలి పింపుడు. ఎవ్వరును నా పిలుపును త్రోసిపుచ్చరాదు. నేను బాలునకు మహాబలి సమర్పింపగోరితిని. దీనిలో పాల్గొననివారికి చావుమూడును” అని చెప్పెను. బాలు ఆరాధకులను నాశనము చేయుటకు యెహూ పన్నిన పన్నాగమది.

20. యెహూ బాలు పేరిట ఉత్సవము జరుగునని చాటింపుడు అనగా ప్రజలట్లే ప్రకటన చేసిరి.

21. అతడు యిస్రాయేలు దేశ మందంతట వార్తపంపగా బాలు భక్తులందరు ఒక్కడు కూడ తప్పి పోకుండ పండుగకు వచ్చిరి. వారందరు బాలు దేవళము ప్రవేశించిరి. గుడి భక్తులతో క్రిక్కిరిసిపోయెను.

22. యెహూ వస్త్రశాలాధికారి యాజకుని పిలిచి వస్త్రములు తెమ్మనిచెప్పగా అతడు తెచ్చి భక్తులకు తొడిగించెను.

23. అటుపిమ్మట యెహూ రేకాబు కుమారుడు యెహోనాదాబుతో దేవాలయములోనికి పోయి “ఇక్కడ బాలు భక్తులు మాత్రమే ఉండవలయును. యావే భక్తులలో ఒక్కడుకూడ ఈ చోటికి రాకూడదు. జాగ్రత్త!” అని హెచ్చరించెను.

24. అటుపిమ్మట అతడు, యెహోనాదాబు దహనబలులు సమర్పించిరి. అంతకుముందే అతడు ఎనుబది మంది బంటులను దేవాలయము వెలుపల కాపుంచి “మీరు బాలు భక్తులను అందరిని వధింపవలయును. వారిలో ఎవరిని గాని తప్పించుకొని పోనిత్తురేని వారి ప్రాణములకు బదులుగా మీ ప్రాణములు తీయింతును” అని చెప్పెను.

25. అతడు బలి అర్పించిన పిమ్మట “మీరు వీరినందరిని పట్టి వధింపుడు. ఎవరిని తప్పించుకొని పోనీకుడు” అని తన ఉద్యోగులకును, బంటులకును ఆజ్ఞ ఇచ్చెను. వారు బాలు భక్తులనందరిని చిత్రవధ చేసి వారి శవములను బయటికి లాగివేసిరి.

26. పిమ్మట బాలు ఆలయములోనికి వొచ్చి నిలువెత్తు విగ్రహములను వెలుపలికి కొనివచ్చి కాల్చివేసిరి.

27. అటుల బాలు పీఠమును దేవళమును నాశనము చేసి దానిని మరుగుదొడ్డిని చేసిరి. నేటికి ఆ దేవళము దొడ్డిగనే ఉన్నది.

28. ఆ రీతిగా యెహూ యిస్రాయేలు రాజ్యమున బాలు ఆరాధనను తుదముట్టించెను.

29. మునుపు యరోబామురాజు బేతేలు, దాను నగరములలో బంగారు దూడలను నెలకొల్పి యిస్రాయేలు ప్రజలను వాని ఆరాధనకు పురికొల్పి పాపము కట్టుకొనెనుగదా! యెహూ కూడ ఈ పాపమున చిక్కుకొనెను.

30. ప్రభువు అతనితో “నీవు నేను కోరినట్లే అహాబు వంశమును నాశనముచేసి నాకిష్టుడవైతివి. కనుక నాలుగవతరము వరకు నీ వంశజులు యిస్రాయేలు మండలమును పరిపాలింతురు” అని చెప్పెను.

31. కాని యెహూ యిస్రాయేలు దేవుడైన యావే ప్రభువు ఆజ్ఞలను చిత్త శుద్ధితో పాటింపలేదు. అతడు యరోబామువలె చెడుత్రోవతొక్కి యిస్రాయేలీయులను కూడ పాపమునకు పురికొల్పెను.

32. కనుక ప్రభువు యిస్రాయేలు దేశమును తగ్గించి వేసెను. హసాయేలు రాజు యోర్దానునకు తూర్పున ఉన్న గాదు, రూబేను తెగలకు చెందిన గిలాదు ప్రాంతమంతటిని, అర్నోనునది దగ్గరినున్న అరోయేరు మొదలు కొని మన దేశములోను అనగా గిలాదులోను, బాషానులోను వారిని ఓడించెను.

33. గాదు, రూబేను, మనష్షే తెగవారు వసించుచుండిన గిలాదు, బాషాను మండలములు అతని వశమయ్యెను.

34. యెహూ చేసిన ఇతర కార్యములు అతని వీర కృత్యములు యిస్రాయేలు రాజుల చరితమున లిఖింప బడియేయున్నవి.

35. యెహూ తన పితరులతో నిద్రించగా, సమరియా నగరముననే సమాధి చేయబడెను. యెహూ తరువాత అతని కుమారుడు యెహోవాపసు రాజయ్యెను.

36. యెహూ యిస్రాయేలునకు రాజై ఇరువది ఎనిమిదేండ్ల పాటు సమరియా నుండి పరిపాలనచేసెను.

Copyright © 2025 Telugu Catholic Bible All Rights Reserved | Website Designed by HyderHub Web Services