ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

న్యాయాధిపతులు 10

 1. అబీమెలెకు తరువాత దోదా మనుమడును, పూవా కుమారుడైన టోలాయిస్రాయేలీయులను శత్రువుల నుండి రక్షించెను. అతడు యిస్సాఖారు తెగవాడు. ఎఫ్రాయీము పర్వతసీమలో షామీరు నగరమున వసించెడివాడు.

2. టోలా ఇరువది మూడేండ్లు యిస్రాయేలునకు న్యాయాధిపతిగా పనిచేసి మరణానంతరము షామీరుననే భూస్థాపితము చేయబడెను.

3. అటుపిమ్మట గిలాదునకు చెందిన యాయీరు న్యాయాధిపతియై ఇరువది రెండేండ్లు తీర్పుతీర్చెను.

4. అతని ముప్పదిమంది కుమారులు, ముప్పది గాడిదపిల్లలనెక్కి తిరిగెడివారు. వారికి ముప్పది పట్టణములుండెడివి. నేటికి గిలాదు సీమయందు ఆ పట్టణములకు యాయీరు పట్టణములనియే పేరు.

5. యాయీరు మృతిచెంది కామోనున పూడ్చివేయబడెను.

6. యిస్రాయేలీయులు మరల దుష్టకార్యములు చేసిరి. వారు బాలు, అష్టారోతు దేవతలను, అరాము, సీదోను, మోవాబు, అమ్మోను, ఫిలిస్తీయ దేశముల దేవతలను పూజించిరి. యావేను పూర్తిగా విస్మరించిరి.

7. ప్రభువు ఉగ్రుడై యిస్రాయేలీయులను ఫిలిస్తీయులకు, అమ్మోనీయులకు అప్పగించెను.

8. వారు నాడు మొదలుకొని పదునెనిమిది యేండ్లపాటు యోర్దానుకు ఆవలి ప్రక్క అమోరీయుల దేశమగు గిలాదున వసించు యిస్రాయేలీయులనందరిని నేలబెట్టి కాలరాచిరి.

9-10. పై పెచ్చు అమ్మోనీయులు యోర్దాను దాటివచ్చి యూదా, బెన్యామీను, ఎఫ్రాయీము మండలములపై పడజొచ్చిరి. కనుక యిస్రాయేలీయులు మిగుల ఏడ్చి యావేకు మొర పెట్టి “ప్రభూ! నీకు అపరాధము చేసితిమి. మా దేవుడవైన నిన్నువిడనాడి బాలుదేవతలను పూజించితిమి” అనిరి.

11-12. యావే వారితో “ఐగుప్తీయులు, అమోరీయులు, అమ్మోనీయులు, ఫిలిస్తీయులు, సీదోనీయులు, అమాలెకీయులు, మిద్యానీయులు మిమ్ము పీడింపగా నేను మిమ్ము కాపాడలేదా?

13. అయినను మీరు నన్ను విడనాడి అన్యదైవములను సేవించిరి. కనుక నేను మిమ్ము రక్షింపను.

14. పొండు, మీరెన్నుకొనిన ఆ దైవముల యెదుటనే మొర పెట్టుకొనుడు. వారు మిమ్ము ఈ యిడుమలనుండి కాపాడగలరేమో చూతము” అనెను.

15. కాని యిస్రాయేలీయులు ప్రభూ! మేము అపరాధము చేసినమాట నిజమే. మమ్ము నీ ఇష్టము వచ్చినట్లు శిక్షింపుము. కాని నేడు ఈ ఆపదనుండి మాత్రము కాపాడుము” అని విన్నవించుకొనిరి.

16. యావేను సేవించవలెనని యిస్రాయేలీయులు తమ మధ్యనుండి అన్యదైవములను విడనాడగా, వారికి కలిగిన ఆపదనుచూచి యావే కడుపు తరుకుకొని పోయెను."

17. అపుడు అమ్మోనీయులు ప్రోగైవచ్చి గిలాదున శిబిరము పన్నిరి. యిస్రాయేలీయులు కూడ గుమిగూడి వచ్చి మిస్పా చెంత గుర్రులెత్తిరి.

18. గిలాదు పెద్దలు “అమ్మోనీయులతో పోరాడగలవాడే గిలాదు నంతటికి నాయకుడగును” అని నిశ్చయించుకొనిరి.