ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సంఖ్యాకాండము చాప్టర్ 1

 1. యిస్రాయేలీయులు ఐగుప్తు వీడివచ్చిన రెండవ యేట రెండవనెల మొదటిరోజున సీనాయి ఎడారిసీమ యందు దేవుడైన యావే సాన్నిధ్యపు గుడారమున మోషేతో మాట్లాడుచు ఇట్లనెను.

2. “యిస్రాయేలు సమాజముయొక్క జనసంఖ్య వ్రాయింపుము. తెగల వారిగా, వంశములవారిగా మగవారినందరిని గణింపుము.

3. నీవు అహరోను కలిసి ఇరువది యేండ్లు మరియు అంతకు పైబడి యుద్ధమున పాల్గొనుటకు సమర్థులైన మగవారినందరిని లెక్కింపుడు.

4. కనుక ప్రతి తెగనుండి కుటుంబపు పెద్దనొకనిని ఎన్నుకొనుము.

5-15. అటుల ఎన్నుకొనవలసిన వారి పేర్లివి. రూబేను తెగనుండి షెదేయూరు కుమారుడు ఎలీసూరు; షిమ్యోను తెగనుండి సూరీషద్దయి కుమారుడు షెలుమీయేలు; యూదా తెగనుండి అమ్మినాదాబు కుమారుడు నహషోను; యిస్సాఖారు తెగనుండి సూవారు కుమారుడు నెతనేలు; సెబూలూను తెగనుండి హెలోను కుమారుడు ఎలీయాబు; యోసేపు కుమారులగు ఎఫ్రాయీము తెగనుండి అమ్మీహూదు కుమారుడు ఎలీషామా; మనష్షే తెగనుండి పెదాహ్సురు కుమారుడు గమలీయేలు; బెన్యామీను తెగనుండి గిద్యోని కుమారుడు అబీదాను; దాను తెగనుండి అమ్మీషద్దయి కుమారుడు అహియెజెరు; ఆషేరు తెగనుండి ఓక్రాను కుమారుడు ఫగియేలు; గాదు తెగనుండి రవూయేలు కుమారుడు ఎలియాసాపు; నఫ్తాలి తెగనుండి ఏనాను కుమారుడు అహీరా.”

16. వీరందరును యిస్రాయేలు సమాజమున పేరుమోసిన పెద్దలు. యిస్రాయేలు వంశములకు అధిపతులు, యిస్రాయేలు సైన్యములకు నాయకులు.

17-18. మోషే అహరోనులు పైన పేర్కొనిన పెద్దలను పిలిపించి, రెండవనెల మొదటిరోజున యిస్రాయేలు సమాజమును సమావేశపరచిరి. ప్రజలందరిని వంశములవారిగా, కుటుంబముల వారిగా గణించిరి. ఇరువదియేండ్లు మరియు అంతకు పైబడి యుద్ధమున పాల్గొనుటకు సమర్థులైన మగవారి పేర్లన్నియు నమోదుచేసిరి.

19. దేవుడైన యావే ఆజ్ఞాపించినట్లే మోషే సీనాయి ఎడారియందు జన సంఖ్యను నిర్ణయించెను.

20-43. యాకోబు పెద్ద కుమారుడు రూబేను తెగతో ప్రారంభించి యిరువది యేండ్లకు మరియు అంతకు పైబడి యుద్ధమున పాల్గొనుటకు సమర్థులైన మగవారి పేర్లన్నియు, వంశములవారిగా, తెగల వారిగా నమోదు చేయబడెను. అటుల నమోదు చేయబడినవారి సంఖ్య: రూబేను తెగ నుండి 46,500; షిమ్యోను తెగనుండి 59,300; గాదు తెగనుండి 45,650; యూదా తెగనుండి 74,600;  ఇస్సాఖారు తెగనుండి 54,400; సెబూలూను తెగనుండి 57,400; -ఎఫ్రాయీము తెగనుండి 40,500; మనష్షే తెగనుండి 32,200; బెన్యామీను తెగనుండి 35,400; దాను తెగనుండి 62,700; ఆషేరు తెగనుండి 41,500; నఫ్తాలి తెగనుండి 53,400;