ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

హగ్గయి

1. దర్యావేషు పారశీకమునకు చక్రవర్తిగానున్న కాలము రెండవయేట, ఆరవనెల మొదటిదినమున ప్రభువు హగ్గయి ప్రవక్త ద్వారా సందేశమును వినిపించెను. ఆ సందేశము షయల్తీయేలు కుమారుడును, యూదా దేశ పాలకుడునైన సెరుబ్బాబెలు కొరకును, యెహోసాదాకు కుమారుడును, ప్రధానయాజకుడునైన యెహోషువ కొరకును ఉద్దేశింపబడినది.

2. సైన్యములకధిపతియైన ప్రభువు హగ్గయితో “ఈ ప్రజలు దేవాలయమును నిర్మించుటకిది అదను కాదనియు, సమయము ఆసన్నము కాలేదనియు పలుకుచున్నారే” అని చెప్పెను.

3. అంతట ప్రభువు హగ్గయిద్వారా ఈ సందేశము చెప్పెను:

4. “నా ప్రజలారా! నా మందిరము శిథిలమైయుండగా మీరు నగిషీ చెక్క పలకలతో, తెరలతో చక్కగా కట్టుకొనిన గృహములలో వసింపనేల?

5. మీకేమి జరుగుచున్నదో పరిశీలించి చూడుడు.

6. మీరు చాల విత్తనములు చల్లినను కొద్దిపాటి పంటయే చేతికి వచ్చినది. మీరు భుజించుచున్నారు గాని, ఆకలి తీరకయేయున్నది. మీరు ద్రాక్షారసము సేవించుచున్నారు గాని, దాహము తీరకయేయున్నది. బట్టలు తాల్చుచున్నారు గాని, అవి మిమ్కు వెచ్చగానుంచ జాలకున్నవి. కూలివారి కష్టార్జితము కంతగల సంచిలో వేసినట్లున్నది.

7. కావున సైన్యములకధిపతియైన ప్రభువు సెలవిచ్చునది ఏమనగా, “ఈ కార్యములు ఇట్లేందుకు జరుగుచున్నవో బాగుగా పరిశీలించి చూడుడు.

8. మీరిపుడు కొండల లోనికిపోయి కలపను తెచ్చి దేవళమును పునర్నిర్మింపుడు. అప్పుడు నేను సంతసింతును. కీర్తిని బడయుదును.

9. మీరు పంట విస్తారముగా పండునను కొంటిరిగాని అతికొద్దిగానే పండెను. మీరు ఆ పంటను ఇంటికి కొనివచ్చినపుడు నేను దానిని ఊదివేసితిని. ఎందులకు? నామందిరము శిథిలమై ఉండగా మీలో ప్రతివాడును తన ఇంటిని చక్కజేసికొన వేగిరి పడుచున్నాడు.

10. కావున మీ చెయిదములను బట్టి ఆకాశము నుండి వానలుపడుటలేదు, భూమిపై పైరులు పండ లేదు.

11. నేను నేలపై బెట్టను కొనివచ్చితిని. కొండలు, పొలములు, ఓలివుతోటలు, ద్రాక్షతోటలు, నేలపై ఎదుగు ప్రతి పైరు, నరులు, పశువులు, మీరు పెంచగోరు ప్రతి పైరు క్షామమునకు గురియయ్యెను.”

12.అపుడు యూదాదేశ పాలకుడైన సెరుబ్బాబెలు, ప్రధాన యాజకుడైన యెహోషువ, ప్రవాసమునుండి తిరిగివచ్చిన వారు ప్రభువైన దేవునిమాటను పాటించిరి. వారు ప్రభువునకు భయపడి ఆయన దూతయైన హగ్గయి ప్రవక్త పలుకులు ఆలించిరి.

13. అపుడు హగ్గయి ప్రభువు సందేశమును ప్రజలకు ఇట్లు వినిపించెను: “నేను మీకు తోడుగా నుందును. ఇది ప్రభుడనైన నా వాక్కు”

14. ప్రభువు యూదాదేశ పాలకుడైన సెరుబ్బాబెలు యొక్క మనస్సును, ప్రధాన యాజకుడగు యెహోషువ మనస్సును, ప్రవాసము నుండి తిరిగివచ్చిన ప్రజలందరి మనస్సులను ప్రేరే పించెను. కావున వారెల్లరును సైన్యములకధిపతియు ప్రభువునైన దేవుని మందిరము మీద పనిచేయ నారంభించిరి.

15. దర్యావేషు చక్రవర్తి పరిపాలనాకాలము రెండవయేట ఆరవనెల ఇరువది నాలుగవ దినమున ఈ కార్యమును మొదలిడిరి. 

1. అదే సంవత్సరము ఏడవనెల ఇరువది ఒకటవ దినమున ప్రభువు హగ్గయిద్వారా తన సందేశమును వినిపించెను.

2. ప్రభువు అతనిని యూదాదేశ పాలకుడగు సెరుబ్బాబెలుకును, ప్రధానయాజకుడగు యెహోషువకును, శేషించిన ప్రజలకును ఇట్లు చెప్పుమనెను:

3. "మీలో ఈ దేవాలయపు పూర్వ వైభవమును జ్ఞప్తియందుంచుకొనిన వాడెవడైనా నున్నాడా? ఇదిప్పుడు మీకు ఎట్లు కాన్పించుచున్నది? శూన్యమువలె చూపట్టుటలేదా?

4. అయినను సెరుబ్బాబెలూ! యెహోషువా! ప్రజలారా! మీరు ధైర్యము తెచ్చుకొనుడు. పనికి పూనుకొనుడు. నేను మీకు తోడుగానుందును.

5. మీరు ఐగుప్తునుండి వెడలివచ్చినపుడు నేను నిత్యము మీకు అండగా నుందునని బాసచేసితిని. కావున ఇప్పుడు మీకు తోడుగా నుందును. కనుక మీరు భయపడవలదు. ఇదియే సైన్యములకధిపతియైన ప్రభువు వాక్కు.

6. సైన్యములకధిపతియగు ప్రభువు సెలవిచ్చునది ఏమనగా నేను త్వరలోనే ఇంకొకసారి భూమిని, ఆకాశమును, నేలను, కడలిని అతలాకుతలము చేయుదును.

7. జాతులనన్నిటిని కూలద్రోయుదును. వానిసంపదలు ఇచటికి వచ్చును. ఈ దేవళము ప్రభువుతేజస్సుతో నిండును. ఇది సైన్యములకు అధిపతియైన ప్రభువు వాక్కు.

8. వెండి నాదే! బంగారమును నాదే!  ఇదే సైన్యములకధిపతియైన ప్రభువు వాక్కు.

9. నూత్నదేవాలయము పూర్వ దేవాలయము కంటె వైభవముగానుండును. ఈ తావున నేను నా ప్రజలకు శుభములను ఒసగుదును. సైన్యములకధిపతియైన ప్రభువు వాక్కిది.”

10. దర్యావేషు పరిపాలనాకాలము రెండవ యేట తొమ్మిదవనెల యిరువదినాలుగవ దినమున సైన్యములకధిపతియైన ప్రభువు మరల హగ్గయి ద్వారా సందేశము వినిపించెను.

11. సైన్యములకు అధిపతియైన ప్రభువు ఇట్లు ఆజ్ఞాపించెను: “నీవు ఈ ప్రశ్నను గూర్చి యాజకుల అభిప్రాయము నడుగుము.

12. ఎవడైనా దేవునికి బలిగా అర్పింపబడిన పశువు మాంసమును తన అంగీచెంగున ముడుచుకొనిపోయెననుకొందము. ఆ చెంగు రొట్టెనుగాని, పులుసును గాని, ద్రాక్షారసమునుగాని, ఓలివుతైలమునుగాని, ఏదైన భోజనపదార్థమునుగాని తాకినచో ఆ వస్తువు పవిత్రమగునా?” ఆ ప్రశ్నకు యాజకులు 'పవిత్రముకాదు' అని చెప్పిరి.

13. అపుడు హగ్గయి 'ఎవడైన శవమును తాకి మైలపడెననుకొందము. అతడు పై వస్తువులలో దేనినైన తాకినచో అది అపవిత్రమగునా?' అని యాజకులను అడిగెను. వారు 'అవును' అనిరి.

14. అందులకు హగ్గయి వారికి ఇట్లు బదులు ఇచ్చెను: “ప్రభువు పలుకిది. ఈ ప్రజలకును వారి క్రియలకును, వీరు పండించు పంటలకును ఈ నియమమే వర్తించును. కావున వీరు బలిపీఠముపై అర్పించు వస్తువులెల్ల అపవిత్రమగును.

15. ప్రభువిట్లనుచున్నాడు: “మీకేమి జరిగినదో పరిశీలించి చూడుడు. మీరు దేవాలయ పునర్నిర్మాణమునకు పూనుకొనకముందు

16. ధాన్యపు ప్రోగువద్దకు పోయి అది ఇరువది తూములగునని ఆశించినచో పది తూములే అయ్యెడిది. ద్రాక్షల గానుగ యొద్దకు పోయి అచట ఏబది కూజాల రసము లభించునని ఆశించినచో ఇరువది కూజాల రసము మాత్రమే లభించెడిది.

17. నేను వేడిగాలులను, వడగండ్లను పంపి మీరు సేద్యముచేయు పంటలనెల్ల నాశనము చేసితిని. అయినను మీరు పశ్చాత్తాపపడరైతిరి.

18. నేడు తొమ్మిదవనెల ఇరువదినాలుగవ దినముకదా! దేవాలయము పునాది వేసినది ఈ దినముననే. కనుక నేటినుండి మీకేమి జరుగనున్నదో ఆలోచింపుడు.

19. మీకు ధాన్యము నిల్వలేదు. మీ ద్రాక్షలు, అంజూరములు, దానిమ్మలు, ఓలివులు కాపు పట్టలేదు. అయినను ఇకమీదట నేను మిమ్ము దీవింతును.”

20. ఆ ఇరువది నాలుగవ రోజుననే ప్రభువు హగ్గయి ద్వారా మరియొక సందేశము వినిపించెను.

21. అతనిని యూదాదేశ పాలకుడైన సెరుబ్బాబెలుతో ఇట్లు చెప్పుమనెను: “నేను భూమ్యాకాశములను అతలాకుతలము చేయుదును.

22. రాజ్యములను కూలద్రోసి వాని అధికారమును అంతమొందింతును. రథములను, సారథులను తలక్రిందులుగా పడవేయు దును. యుద్ధాశ్వములు చచ్చును. రౌతులొకరినొకరు చంపుకొందురు.

23. నా సేవకుడవును, షయల్తీయేలు కుమారుడవునైన సెరుబ్బాబెలూ! ఆ దినమున నేను నిన్ను స్వీకరింతును. నేను నిన్ను ఎన్నుకొంటిని. నిన్ను నా అంగుళీయక ముద్రగా చేసికొంటిని. ఇది సైన్యముల కధిపతియైన ప్రభువు వాక్కు”