ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఆమోసు చాప్టర్ 9

1. నేను ప్రభువు బలిపీఠముపైగా నిల్చుండి యుండుటను గాంచితిని. ఆయనిట్లు ఆజ్ఞాపించెను: దేవాలయాల స్తంభముల పైభాగమును గట్టిగా మోది, దేవాలయ పునాదులు కంపించునట్లు చేయుము. ఆ స్తంభముల పై భాగములను విరుగగొట్టి అవి ప్రజల తలలపై పడునట్లు చేయుము. ప్రజలలో మిగిలియున్నవారిని నేను పోరున చంపుదును. ఎవ్వడును తప్పించుకొని పారిపోజాలడు.

2. వారు బొరియలు త్రవ్వుకొని పాతాళలోకమునకు పోయినను నా హస్తము వారిని పట్టుకొనును. ఆకాశమునకెక్కిపోయినను, నేను వారిని క్రిందికి లాగుకొని వత్తును.

3. వారు కర్మేలు కొండకొమ్మున దాగుకొనినను నేను వారిని వెదకి పట్టుకొందును. నాకు కనిపింపకుండ సముద్రగర్భమున దాగుకొనినను, వారిని కరువమని సముద్రభూతమును ఆజ్ఞాపింతును. అది వారిని కరుచును.

4. శత్రువులు వారిని బందీలనుగా కొనిపోయినచో వారిని వధింపుడని ఆ శత్రువులను ఆజ్ఞాపింతును. నేను వారికి సాయము చేయను. వారిని నాశనము చేయుటకే తలపడితిని.

5. సర్వోన్నతుడును, ప్రభువునైన దేవుడు భూమిని తాకగానే అది కంపించును. దానిపై వసించు వారెల్లరును విలపింతురు. లోకమంతయు నైలునదివలె ఆటుపోటులకు గురియగును.

6. ప్రభువు ఆకాశమందు తన నివాసము నిర్మించుకొనెను. నేలకుపైగా ఆకాశగోళమును ఏర్పరచెను. ఆయన సముద్రజలములను రప్పించి నేలపై చల్లును. 'ప్రభువు' అని ఆయనకు పేరు.

7. ప్రభువు ఇట్లనుచున్నాడు: యిస్రాయేలీయులారా!  మీరును, కూషీయులును నాకు సరిసమానమే. నేను మిమ్ము ఐగుప్తునుండి తీసికొనివచ్చినట్లే ఫిలిస్తీయులను కఫ్తోరు నుండియు, సిరియనులను కీరు నుండియు తోడ్కొని వచ్చితిని.

8. ప్రభుడనైన నేను పాపభూయిష్టమైన ఈ యిస్రాయేలు రాజ్యమును పరీక్షించి చూచుచున్నాను. నేను దీనిని భూమిమీది నుండి తుడిచిపెట్టుదును. అయినను యాకోబు సంతతినంతటిని నాశనము చేయను.

9. నా ఆజ్ఞ ప్రకారము ఒకడు ధాన్యము జల్లెడతో జల్లించినట్లు, అన్యజాతులన్నింటిలోను యిస్రాయేలీయులను జల్లింతును. కాని ఒక్క చిన్నగింజయైనను నేలరాలదు.

10. దేవుడు మాకెట్టి కీడును కలిగింపడనెడి దుష్టులనందరిని, నా ప్రజలలోని పాపులనందరిని పోరున చంపుదును.

11. ఆ దినమున నేను కూలిపోయిన కుటీరమువలెనున్న దావీదు రాజవంశమును పునరుద్దరింతును. ఆ ఇంటిగోడలను బాగుచేసి దానిని తిరిగి కట్టి పూర్వస్థితికి కొనివత్తును.

12. కావున యిస్రాయేలీయులు ఎదోమున మిగిలియున్న భాగమును, పూర్వము నాకు చెందిన జాతులన్నింటిని తిరిగి జయింతురు.

13. ప్రభువు ఇట్లనుచున్నాడు: పొలము దున్నగనే పంటపండు కాలము వచ్చును. విత్తనములు చల్లగనే ద్రాక్షపండ్లు తొక్కించు కాలము వచ్చును. పర్వతమునుండి తీయని ద్రాక్షరసము ప్రవహించును. కొండలనుండి ద్రాక్షారసము పారును.

14. నేను నా ప్రజలను మరల తమ దేశమునకు కొనివత్తును. వారు శిథిలమైయున్న తమ నగరములను పునర్నిర్మించుకొని వానిలో వసింతురు. ద్రాక్షలునాటి ద్రాక్షారసము గ్రోలుదురు. తోటలువేసి పండ్లు భుజింతురు.

15. నా ప్రజలను నేను వారికిచ్చిన నేలపై నాటుదును. ఇకమీదట వారినెవరును పెల్లగింపజాలరు. ఇది మీ దేవుడనైన ప్రభువు వాక్కు”