ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

లేవీయకాండము చాప్టర్ 8

1. ప్రభువు మోషేతో ఇట్లనెను:

2. అహరోనును, అతని కుమారులను సమావేశపు గుడారము చెంతకు పిలువుము. యాజకులు ధరించువస్త్రములను, అభిషేక తైలమును, పాపపరిహారబలికి ఒక కోడెను, రెండు పొట్టేళ్ళను, గంపెడు పొంగనిరొట్టెలను అచటికి కొనిపొమ్ము.

3. ప్రజలనందరిని అచట ప్రోగుజేయుము.”

4. మోషే ప్రభువు ఆజ్ఞాపించినట్లుగా ప్రజలను సమావేశపుగుడారము వద్ద ప్రోగుచేసెను.

5. అతడు వారితో “నేను ప్రభువు ఆజ్ఞాపించినట్లే ఈ కార్యము చేయుచున్నాను” అని పలికెను.

6. మోషే అహరోనును అతని కుమారులను ముందుకు రండని పిలిచి వారిని జలముతో శుద్ధి చేయించెను.

7. అతడు అహరోనునకు చొక్కాయిని తొడిగించి, దట్టీని కట్టి, నిలువుటంగీని తొడిగించెను. అతనిని యాజకవస్త్రముతో (ఎఫోదు) కప్పి దాని కుచ్చులను ఎఫోదు నడికట్టునకు బిగించెను.

8. అతని రొమ్మున వక్షఃఫలకము నిలిపి దానిలో యాజకత్వ సంబంధిత ఊరీము, తుమ్మీములను ఉంచెను.

9. అతని శిరస్సుమీద తలపాగా పెట్టెను. సువర్ణ ఫలకమును అహరోను నొసటిభాగమున ఉంచెను. ఆ ఫలకమును పెట్టుమని ప్రభువు మోషేను ముందుగనే ఆజ్ఞాపించియుండెను.

10. అంతట మోషే తైలముతో మందిరమును, దానిలోని ప్రతిభాగమును అభిషేకించి వానిని ప్రభువునకు నివేదించెను.

11. అతడు దానిలో కొంచేము డుపర్యాయములు బలిపీఠముమీద చిలుకరించి, బలిపీఠమును దాని ఉపకరణములన్నింటిని, గంగాళము దాని పీటను ప్రభువునకు నివేదించెను.

12. అటుపిమ్మట అహరోను అతని శిరస్సుమీద తైలముపోసి అతనిని అభిషేకించెను.

13. పిమ్మట మోషే అహరోను కుమారులను ముందుకు రప్పించెను. ప్రభువు ఆజ్ఞాపించినట్లే వారికి చొక్కాలు తొడిగించి, దట్టీలు కట్టించి, టోపీలు పెట్టించెను.

14. అటు తరువాత పాపపరిహారబలికి కోడెను కొనివచ్చిరి. అహరోను, అతని కుమారులు దానిమీద చేతులు చాచిరి.

15. మోషే దానిని వధించెను. దాని నెత్తురును కొద్దిగా తీసికొని వేళ్ళతో బలిపీఠము కొమ్ములకు పూసి ఆ బలిపీఠమును దేవునికి నివేదించెను. మిగిలిన నెత్తురును బలిపీఠము అడుగున పోసి దానిని ప్రతిష్ఠించెను. ఆ రీతిగా అతడు బలిపీఠమునకు ప్రాయశ్చిత్తముచేసి దానిని దేవునికి నివేదించెను.

16. ఆ పిమ్మట అతడు కోడె ప్రేవులమీది క్రొవ్వును, కాలేయములోని క్రొవ్వును, రెండు మూత్ర గ్రంథులను, వానిమీది క్రొవ్వును తొలగించి పీఠముమీద కాల్చివేసెను.

17. ప్రభువు ఆజ్ఞాపించినట్లే కోడె చర్మమును, మాంసమును, పేడను శిబిరము వెలుపల కాల్చివేసెను.

18. తరువాత దహనబలిగా పొట్టేలును కొని వచ్చిరి. అహరోను, అతని కుమారులు దాని తలమీద చేతులు చాచిరి.

19. మోషే దానిని వధించెను. దాని రక్తమును బలిపీఠము చుట్టు చల్లెను.

20. పొట్టేలును ముక్కముక్కలుగా కోసెను. దాని ప్రేవులను కాళ్ళను శుభ్రముగా కడిగెను. ఆ మీదట దాని తలను, క్రొవ్వును, ఆ పొట్టేలునంతటిని పీఠము మీద దహించెను.

21. ఇది ప్రభువు మోషేను అర్పించుమనిన దహనబలి. ఆ బలి సువాసనవలన ప్రభువు సంతుష్టిచెందెను.

22. తదనంతరము యాజకాభిషేకబలికి రెండవ పొట్టేలును కొనివచ్చిరి. అహరోను, అతని కుమారులు దాని తలమీద చేతులు చాచిరి.

23. మోషే దానిని వధించెను. దాని నెత్తురును కొద్దిగా తీసికొని అహరోను కుడిచెవి అంచుమీద, కుడిచేతి బొటనవ్రేలిమీద, కుడికాలి బొటన వ్రేలి మీద పూసెను.

24. అహరోను కుమారులనుగూడ ముందుకు రప్పించి ఆ నెత్తురును వారి కుడిచెవి అంచులకు, కుడిచేతి బొటన వ్రేళ్ళకు, కుడికాలి బొటన వ్రేళ్ళకు పూసెను. మిగిలిన నెత్తురును బలిపీఠము చుట్టు చల్లెను.

25. ఆ పిమ్మట పొట్టేలు క్రొవ్వునంతటిని, అనగా దానితోకకు అంటుకొనియున్న క్రొవ్వును, ప్రేవులమీది క్రొవ్వును, కాలేయమునందలి క్రొవ్వును, మూత్రగ్రంథులను, వానిమీది క్రొవ్వును, దాని కుడితొడను తొలగించెను.

26. ప్రభువుయెదుట వుంచిన పొంగని రొట్టెల గంపనుండి ఒక పెద్ద రొట్టెను, నూనెతో కాల్చిన వేరొక రొట్టెను, ఒక పలుచని రొట్టెను గైకొనెను. ఆ రొట్టెలను పొట్టేలు క్రొవ్వు మీద, దాని కుడితొడమీద పేర్చి

27. వానినన్నిటిని అహరోను చేతులలో, అతని కుమారుల చేతులలో ఉంచెను. వారు ఆ పదార్థములన్నింటిని పైకెత్తి ప్రభువునకు అల్లాడించు అర్పణముగా అర్పించిరి.

28. మోషే ఆ పదార్థములన్నింటిని వారి చేతులలో నుండి తీసికొని దహనబలితోపాటు వానిని కూడ బలిపీఠముమీద కాల్చివేసెను. ఇది యాజక అభిషేకబలి. ఈ దహనబలి సువాసనవలన ప్రభువు సంతుష్టి చెందెను.

29. ఆ పిమ్మట మోషే పొట్టేలు రొమ్మును పైకెత్తి ప్రభువునకు అల్లాడించు అర్పణగా అర్పించెను. ప్రభువు ముందుగా ఆజ్ఞాపించినట్లే అభిషేకబలిగా అర్పించిన పొట్టేలు మాంసములో ఈ రొమ్ము మోషేకు లభించెను.

30. మోషే పీఠము మీది కొంతతైలమును, రక్తమును తీసికొని వానిని అహరోనుమీదను, అతని కుమారుల మీదను, వారి దుస్తులమీదను చిలుకరించెను. ఆ రీతిగా. అతడు వారిని, వారి దుస్తులను దేవునికి నివేదించెను.

31. మోషే అహరోనుతో అతని కుమారులతో “ప్రభువు ఆజ్ఞాపించినట్లుగనే మీరు ఈ మాంసము కొనిపోయి సమావేశపు గుడారము ప్రవేశద్వారము చెంత వండుకొనుడు. అభిషేకబలికిగా అర్పించిన రొట్టెలతో అచట దానిని భుజింపుడు.

32. మీరు భుజింపగా మిగిలిన మాంసమును, రొట్టెలను కాల్చి వేయుడు.

33. ఏడుదినములవరకు మీరు సమావేశపు గుడారప్రవేశద్వారము వీడరాదు. అప్పటికి మీ అభిషేక విధి పూర్తియగును.

34. ప్రభువు ఆజ్ఞాపించినట్లే నేడు మీకు ప్రాయశ్చిత్తము జరిపితిని.

35. మీరు ఏడు నాళ్ళపాటు రేయింబవళ్ళు సమావేశపు గుడార ప్రవేశ ద్వారమువద్దనే ఉండి ప్రభువు విధిని పాటింపుడు. ఇట్లు చేయుదురేని మీకు ప్రాణాపాయము కలుగదు. ప్రభువునుండియే నేను ఈ ఆజ్ఞను స్వీకరించితిని” అని చెప్పెను.

36. అహరోను, అతని కుమారులును ప్రభువు మోషే ముఖమున ఆజ్ఞాపించినట్లే చేసిరి.