ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

లేవీయకాండము చాప్టర్ 24

1. ప్రభువు మోషేతో ఇట్లు చెప్పెను:

2. “దీపములు వెలిగించుటకు శ్రేష్ఠమైన ఓలివు తైలమును కొనిరమ్మని యిస్రాయేలీయులతో చెప్పుము. అచట ఒక దీపము నిత్యము వెలుగుచుండవలయును.

3. గర్భగృహములోని నిబంధన మందసమునకు ముందట నున్న అడ్డుతెర ఎదుట అహరోను ఈ దీపమును వెలిగించుచుండవలయును. అది నిత్యము ప్రభువు ఎదుట సాయంకాలమునుండి ఉదయము వరకు వెలుగుచుండవలయును. ఇది శాశ్వతనియమము కావలయును.

4. అతడు పరిశుద్ధమైన దీపస్తంభము పైనున్న ప్రదీపములను నిత్యము ప్రభునియెదుట వెలుగునట్లు చక్కదిద్దవలయును.

5. గోధుమపిండితో పండ్రెండు రొట్టెలు చేయుడు. ఒక్కొక్క రొట్టెకు శేరుపిండి ఉండవలయును.

6. ఒక్కొక్క వరుసలో ఆరేసి రొట్టెల చొప్పున వానిని రెండువరుసలుగా ప్రభువు సన్నిధిలోనున్న బంగారు బల్లపై పేర్చుడు.

7. ఆ రెండు వరుసలమీద మేలిమి సాంబ్రాణిని పోయుడు. ఈ సాంబ్రాణి ప్రభువునకు అర్పించు నైవేద్యమునకు చిహ్నముగా నుండును. రొట్టెలకు మారుగా దానిని ప్రభువునకు దహనబలిగా అర్పింపవలయును.

8. కలకాలము ప్రతి విశ్రాంతి దినమున యిస్రాయేలీయుల సమాజమునుండి యాజకుడు ఈ రొట్టెలను తీసుకొని ప్రభువునెదుట ఉంచవలయును. యిస్రాయేలీయులు ఈ నిబంధనను శాశ్వతముగా పాటింపవలయును.

9. ఈ అహరోనునకు అతని సంతతి వారలకు చెందును. ఇవి ప్రభువునకు అర్పింపబడిన నైవేద్యములలో అతిపవిత్రములైనవి. కనుక యాజకులు వీనిని పవిత్రస్థలముననే భుజింపవలయును.”

10-11. ఒక యిస్రాయేలు వనితకు ఐగుప్తీయుని వలన పుట్టిన కుమారుడు ఒకడుండెను. ఆ వనిత పేరు షెలోమీతు, దాను వంశజుడైన దిబ్రి కుమార్తె. అతడు శిబిరమున ఎల్లరును చూచుచుండగా తోటి యిస్రాయేలీయునితో పోట్లాడెను. ఆ కలహమున అతడు దేవుని నామమును దూషించెను. కనుక అతనిని మోషే యొద్దకు కొనివచ్చిరి.

12. ప్రభువు చిత్తము తెలియువరకు అతనిని కావలిలో ఉంచిరి.

13. అప్పుడు ప్రభువు మోషేతో ఇట్లు నుడివెను.

14. 'ఆ దైవదూషకుని శిబిరము వెలుపలికి కొని పొండు. అతని దూషణమును వినినవారందరు వాని తలమీద చేతులుమోపి అతడు దోషియని నిర్ధారింపుడు. అటుపిమ్మట సమాజమంతయు వానిని రాళ్ళతో కొట్టి చంపవలయును.

15. నీవు యిస్రాయేలీయులతో ఇట్లు చెప్పుము. దేవుని దూషించువాడు తన తప్పునకు తాను బాధ్యుడగును.

16. అట్టివానిని పట్టి చంపవలయును. సమాజమంత అతనిని రాళ్ళతో కొట్టి చంపవలయును. యిస్రాయేలీయులు కాని, వారితో వసించు పరదేశులు కాని ప్రభునామమును దూషింతురేని వారిని తప్పక వధింపవలయును.

17. నరహత్యచేసిన వానిని వధింపవలయును.

18. కాని ఇతరుని పశువును చంపినవాడు, మరియొక పశువును పరిహారముగా ఈయవలయును. ప్రాణికి బదులుగా ప్రాణిని యిచ్చుట విధి.

19. ఎవడైన ఇతరునిమీద చేయిచేసికొనినచో, అతని మీదకూడ అట్లే చేయిచేసికోవలెను.

20. అతడు విరుగగొట్టినచో, అదేవిధమున అతనిని విరుగగొట్ట వలయును. ఇతరుని కంటినిగాని, పంటిని గాని పోగొట్టినచో, వాని కంటికిని, పంటికిని అదే గతి పట్టింపవలయును. అతడు చేసిన హానికి ప్రతిహాని చేయవలయును.

21. పశువును చంపినవాడు మరియొక పశువును ఈయవలయును. కాని మనుష్యుని చంపినవానిని చంపవలయును.

22. యిస్రాయేలీయులకును, వారిచెంత వసించు పరదేశులకును ఇదే నియమము చెల్లును. నేను మీ దేవుడనైన ప్రభుడను.”

23. మోషే ఈ మాటలను యిస్రాయేలీయులకు వినిపింపగా వారు దైవదూషకుని శిబిరము వెలుపలికి కొనిపోయి రాళ్ళతో కొట్టి చంపిరి. ఈ రీతిగా యిస్రాయేలీయులు ప్రభువు మోషేకు ఆజ్ఞాపించినట్లు పాటించిరి.