ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

లేవీయకాండము చాప్టర్ 21

1. ప్రభువు మోషేను అహరోను కుమారులైన యాజకులతో ఇట్లు చెప్పుమనెను: “ఏ యాజకుడైన తన కుటుంబసభ్యులలో ఎవడైన చనిపోయినప్పుడు, అతని శవము చెంతకుపోయి శుచిత్వమును కోల్పో రాదు.

2-3. కాని అతడు. దగ్గరి బంధువైన తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తె, సోదరుడు, ఇంకను పెళ్ళికాక పుట్టినింటనే వసించుచున్న సోదరి శవములను మాత్రము సమీపింపవచ్చును.

4. అతడు తన ప్రజలలో ప్రధానుడు గనుక తనను అపవిత్రపరచుకొని శుచిత్వమును కోల్పోరాదు.

5. ఏ యాజకుడు శోకమును వెలిబుచ్చుచు తన తలగొరిగించుకోరాదు. గడ్డము ప్రక్కలను కత్తిరించు కోరాదు. శరీరమున కత్తితో గంట్లు పెట్టుకొనరాదు.

6. అతడు పవిత్రుడై ఉండవలయును. నా నామమును అమంగళము చేయరాదు. నైవేద్యములగు దహనబలులను నాకు అర్పించునది అతడే. కనుక అతడు పవిత్రుడై ఉండవలయును.

7. యాజకుడు కులటను గాని, విడాకులు పొందిన స్త్రీనిగాని పెండ్లియాడరాదు. అతడు దేవునికి పవిత్రమైనవాడు.

8. ప్రజలును యాజకుని పవిత్రునిగా ఎంచవలయును. ప్రభువునకు నైవేద్య ములు అర్పించునది అతడే. నేను పవిత్రుడనైన ప్రభుడను, మిమ్ము పవిత్రులను చేయువాడను.

9. ఏ యాజకుని పుత్రికయైన కులటయైనచో ఆమె తండ్రికి తలవంపులు తెచ్చును. కనుక ఆమెను నిలువున కాల్చివేయవలయును.

10. ప్రధానయాజకుని శిరస్సును అభిషేక తైలముతో అభిషేకింతురు. అతడు పవిత్రుడై నివేదిత యాజకవస్త్రములు తాల్చును. అట్టివాడు శోకసూచికముగ తల విరబోసికోరాదు. బట్టలుచించుకోరాదు.

11-12. అతడు అభిషిక్తుడై నాకు అర్పింపబడినవాడు. అట్టివాడు శుచిత్వమును కోల్పోరాదు. అతడు నా గుడారమునువీడి శవమున్న ఇంట ప్రవేశించెనేని, అది తనతండ్రి లేక తనతల్లి శవమైనను, నా గుడారమును అపవిత్రము చేసినట్లే అగును. నేను ప్రభుడను.

13. ప్రధానయాజకుడు కన్యను మాత్రమే పెండ్లి యాడవలయును.

14. వితంతువును గాని, వేశ్యను గాని, విడాకులు పొందిన స్త్రీనిగాని పెండ్లియాడరాదు. యాజక కుటుంబమునకు చెందిన కన్యను మాత్రమే చేపట్టవలయును.

15. ప్రభుడనైన నేను అతనిని పవిత్రునిగా చేయువాడను. కావున తన ప్రజలలో తన సంతతిని అపవిత్రపరచరాదు అని వారితో చెప్పుము.”

16. ఇంకను ప్రభువు మోషేకు ఈలాగు చెప్పెను.

17. నీవు అహరోనుతో ఇట్లు చెప్పుమనెను: “నీ వంశజులలో అంగవైకల్యము కలవారెవరును నాకు నైవేద్యములు అర్పింపరాదు. కలకాలము వారికి ఈ నియమము వర్తించును.

18-20. వికలాంగులు అనగా కుంటివారు, గ్రుడ్డివారు, ముఖమునందుగాని, శరీరమునందుగాని కురూపులు, చేయికాలు లేని అవిటివారు, గూనివారు, మఱుగుజ్జులు, నేత్రవ్యాధి, చర్మవ్యాధి కలవారు, నపుంసకులు నాకు నైవేద్యములు అర్పింపరాదు.

21. అహరోను వంశజులు ఎవరైనను వికలాంగులైనచో నాకు నైవేద్యములు అర్పింపదగ్గరకు రాకూడదు.

22. అట్టివారు నాకు అర్పింపబడిన పవిత్ర నైవేద్యములను అతిపవిత్ర నైవేద్యములను కూడ భుజింపవచ్చును.

23. కాని వారు వికలాంగులు కనుక అడ్డుతెర ఎదుటకును, బలిపీఠముచెంతకును రాకూడదు. వారు ప్రభుడనైన నేను పునీతము చేసిన ఈ పవిత్ర సామాగ్రిని అమంగళపరపకూడదు.” ,

24. ఈ సంగతులన్నిటిని మోషే అహరోనునకును, అతని కుమారులకును, యిస్రాయేలు ప్రజలకును తెలియజేసెను.