ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

జెఫన్యా చాప్టర్ 1

1. ఆమోను కుమారుడైన యోషీయా యూదా రాజ్యమునకు రాజుగానున్న కాలమున ప్రభువు జెఫన్యాకు తెలియజేసిన సందేశమిది. కూషి, గెదల్యా, అమర్యా, హిజ్కియా క్రమముగా అతనికి మూల పురుషులు.

2. ప్రభువిట్లనెను: “నేను భూమిమీద ఉన్నవానినెల్ల నాశనము చేయుదును.

3. నరులు, పశువులు, పక్షులు, చేపలన్నియు చచ్చును. నేను దుష్టులను నిర్మూలింతును. నరుల నెల్లరిని నేలమీదినుండి తుడిచిపెట్టుదును. ఇది ప్రభుడనైన నా వాక్కు"

4. నేను యూదావాసులను, యెరూషలేము పౌరులను దండింతును. అచట కనిపించు దబ్బరదేవర బాలు ఆరాధన చిహ్నములెల్ల తొలగింతును. అతని భక్తులలో మిగిలినవారిని, వానికి నివేదింపబడినవారిని, దాని అర్చకులను నాశనము చేయుదును ఎల్లరును వారిని విస్మరింతురు.

5. మిద్దెల మీదికెక్కి సూర్యచంద్ర నక్షత్రములను కొలుచువారిని హతమారును. నా నామము బట్టియు, తమకు రాజను దాని పేరునుబట్టియు మ్రొక్కి బాసచేయువారిని హతమారును.

6. నన్ను విడనాడినవారిని, నా చెంతకు రానివారిని, ఆ నన్ను సంప్రతింపని వారిని కూడ హతమారును".

7. ప్రభువు తీర్పు తీర్చురోజు సమీపించినది. కావున మీరు ఆయన ఎదుట మౌనముగా ఉండుడు. ప్రభువు తన ప్రజలను బలి ఇచ్చుటకు సంసిద్ధుడయ్యెను. ఆయన యూదాపై దండెత్తుటకు శత్రువుల నాహ్వానించెను.

8. ప్రభువిట్లనుచున్నాడు: ప్రభువు బలిదినమున నేను రాజోద్యోగులను, రాజకుమారులను, అన్యదేశాచారములను పాటించు వారిని శిక్షింతును.

9. ఆ రోజున నేను తమ యజమానుని ఇండ్లగడపను దాటి హింసతోను, మోసముతోను ఆ ఇండ్లను నింపిన వారిని దండింతును.

10. ఆ దినము మీరు యెరూషలేములోని మత్స్యద్వారమువద్ద రోదన శబ్దమును, నగరము నూత్నభాగమున శోకాలాపములు ఆలింతురు. కొండల దిక్కునుండి గొప్పనాశనము వచ్చును

11. మక్తేషు లోయలో వసించువారలారా! మీరు ఈ శబ్దములు వినినపుడు అంగలార్పుడు. ఏలయన కనానీయుల (వ్యాపారస్తులు) ప్రజలందరును నశించిరి. వెండిని తూకమువేయు వారందరును నశించిరి.

12. ఆ కాలమున నేను దీపమును తీసికొని యెరూషలేమునెల్ల గాలింతును. తేటబడిన ద్రాక్షరసమువంటివారై ప్రభువు మంచినిగాని, చెడునుగాని చేయడులే అని అనుకొను వారిని శిక్షింతును.

13. శత్రువులు వారిండ్లను నాశనము చేసి, వారి సంపదను కొల్లగొట్టుదురు. ఈ వారు తాము కట్టుకొనిన భవనములలో వసింపజాలరు. తాము నాటుకొనిన ద్రాక్షతోటలనుండి రసమును త్రాగజాలరు.

14. ప్రభువు మహాతీర్పుదినము సమీపించినది. అది వేగముగా వచ్చుచున్నది. ఆ దినము మిగుల సంతాపకరమైనది. ఆనాడు ధైర్యవంతులైన శూరులుకూడ నిట్టూర్పు విడుతురు.

15. అది ఆగ్రహపూరితమైన దినము. శ్రమను, శోకమును తెచ్చి పెట్టు దినము. వినాశమును, విధ్వంసమును కొనివచ్చుదినము. అంధకార బంధురమును విషాదమయమునైన దినము. మబ్బులు కమ్మి చిమ్మచీకట్లు ఆవరించియుండు దినము.

16. అది యుద్ధమునకు బాకానూదెడి దినము. సైనికులు సురక్షిత నగరముల చెంతను, బురుజుల చెంతను యుద్ధ ఘోషణ చేయుదినము.

17. ప్రభువు ఇట్లనుచున్నాడు: నేను ప్రజలను ఘోరవిపత్తునకు గురిచేయుదును. నరులు గ్రుడ్డివారివలె తడవుకొనుచు తిరుగుదురు. వారు నాకు ద్రోహము చేసిరి. కాన శత్రువులు వారి నెత్తుటిని నీటివలె చల్లుదురు. వారి శవములు పెంటప్రోవులవలె నేలపై పడియుండును.

18. ప్రభువు తన ఆగ్రహమును ప్రదర్శించు దినమున వారి వెండి బంగారములు కూడ వారిని రక్షింపజాలవు. ఆయన రోషాగ్నిచే, ఆయన కోపాగ్నివలన భూమి అంతయు భస్మమగును. ఆ ఆయన భూమిపై వసించువారినందరిని హఠాత్తుగా హతమార్చును.

Copyright © 2025 Telugu Catholic Bible All Rights Reserved | Website Designed by HyderHub Web Services