ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

లేవీయకాండము చాప్టర్ 17

1. ప్రభువు మోషేతో ఇట్లు నుడివెను:

2. “నీవు అహరోనునకును, అతని కుమారులకును, యిస్రాయేలు ప్రజలకును నా ఆజ్ఞలను ఎరిగింపుము.

3-4. యిస్రాయేలీయులలో ఎవడైన ఎద్దునుగాని, మేకనుగాని, గొఱ్ఱెనుగాని బలిగా సమర్పింపగోరెనేని తన శిబిరమునగాని లేక ఆ శిబిరమునకు వెలుపల గాని వధింపరాదు. మొదట దానిని సమావేశపు గుడారపు ప్రవేశద్వారమువద్దకు కొనివచ్చి అచట ప్రభువునకు అర్పింపవలయును. ఈ నియమము మీరినవాడు నెత్తురును చిందించినట్లే. అతనిని యిస్రాయేలు సమాజమునుండి వెలివేయవలయును.

5. అనగా యిస్రాయేలీయులు ఇంతకుముందు పొలముననే చంపెడు పశువులను ఇకమీదట ప్రభువు సన్నిధికి కొనిరావలయును. వానిని సమావేశపు గుడార ప్రవేశద్వారము చెంతనున్న యాజకుని వద్దకు కొని వచ్చి అచ్చట సమాధానబలిగా అర్పింపవలయును.

6. యాజకుడు ఆ పశువుల నెత్తురును గుడార ప్రవేశ ద్వారముచెంతనున్న బలిపీఠము కొమ్ములపై చిలుకరించును. వాని క్రొవ్వును పీఠముపై దహింపగా ఆ సువాసనవలన ప్రభువు సంతృప్తి చెందును.

7. యిస్రాయేలీయులు మేకల రూపముననున్న దబ్బర దేవత 'సతేరు''నకు పొలములలో పూర్వమువలె బలులు అర్పింపరాదు. అటుల చేసినచో వ్యభిచరించినట్లగును. ఇది తరతరములవరకు యిస్రాయేలీయులకు శాశ్వతనియమము కావలయును.

8-9. వారికి ఈ విధముగా చెప్పుము: యిస్రాయేలీయులు, వారిచెంత వసించు పరదేశులు దహనబలినైనను మరి ఏ బలినైనను సమావేశపు గుడారము ప్రవేశద్వారమునొద్ద తప్ప మరి ఎచ్చటనైనను అర్పించెదరేని సమాజమునుండి వెలివేయబడుదురు.

10. యిస్రాయేలీయులుగాని, వారితో వసించు పరదేశులుగాని నెత్తుటిని భుజింతురేని నేను వారికి విము ఖుడనై వారిని శిక్షించి సమాజమునుండి వెలివేయుదును.

11. రక్తము దేహమునకు ప్రాణము. కనుకనే ఈ నెత్తురును బలిపీఠముమీద చిలుకరించి మీ పాపములకు ప్రాయశ్చిత్తము చేయుటకుగాను, దానిని మీకు ఇచ్చితిని. నెత్తురు దానిలోనున్న ప్రాణమునుబట్టి ప్రాయశ్చిత్తము చేయును.

12. కావుననే యిస్రాయేలీయులు కాని, వారితో వసించు పరదేశులుకాని నెత్తురును భుజింపరాదని నేను కట్టడచేసితిని..

13. యిస్రాయేలీయులు, వారితో వసించు పరదేశులు శుచికరమైన జంతువునైనను, పక్షినైనను వేటాడి పట్టుకొందురేని మొదట దాని నెత్తురును నేలమీదపిండి మట్టితో కప్పివేయవలయును.

14. ప్రతిప్రాణి ప్రాణము దాని నెత్తురులో ఉన్నది. కనుకనే నేను యిస్రాయేలీయులు నెత్తురును భుజింపరాదనియు, అటుల చేయువారు సమాజమునుండి వెలి వేయబడుదురనియు ఆజ్ఞాపించితిని.

15. యిస్రాయేలీయులు, వారితో వసించు అన్యదేశీయులు, సహజముగా చనిపోయిన జంతువును లేక క్రూరమృగములచే చంపబడిన జంతువును భుజింతురేని సాయంకాలమువరకు మైలపడియుందురు. బట్టలు ఉతుకుకొని స్నానముచేసిన పిమ్మట వారు పవిత్రులగుదురు.

16. ఈ నియమము. మీరినవారు దాని దోషమును భరింతురు.”

Copyright © 2025 Telugu Catholic Bible All Rights Reserved | Website Designed by HyderHub Web Services