ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

లేవీయకాండము చాప్టర్ 14

1. ప్రభువు మోషేతో ఇట్లు చెప్పెను:

2. "కుష్ఠనయమైనవానిని శుద్ధిచేయు విధానమిది. శుద్ధిని పొందుదినమున అతనిని యాజకునివద్దకు కొని రావలయును.

3-4. యాజకుడు అతనిని శిబిరము వెలువలికి కొనిపోయి అచట పరీక్ష చేయును, రోగికి కుష్ఠ నయమయ్యెనేని యాజకుడు అతనిచే రెండు శుద్ధమైన పక్షులు, కొంచెము దేవదారు కొయ్య, ఒక ఎఱ్ఱదారము, హిస్సోపురెమ్మ తెప్పించును.

5. అటు పిమ్మట యాజకులు శుభ్రమైన ప్రవాహ జలముపై మట్టిపాత్రలో ఒక పక్షిని చంపించును.

6. రెండవ పక్షిని, కొయ్యను, దారమును, హిస్సోపురెమ్మను మొదటి పక్షి నెత్తురులో ముంచును.

7. యాజకుడు శుద్ధిని పొందవలసిన వానిమీద పక్షినెత్తురును ఏడు సార్లు చిలుకరించి అతడు శుద్దుడయ్యెనని పలుకును. రెండవపక్షిని వదలివేయగా అది పొలములోనికి ఎగిరిపోవును.

8. రోగి దుస్తులు ఉతుకుకొనును. వెంట్రుకలన్ని గొరిగించుకొని స్నానము చేయును. అప్పుడతడు శుద్ధినిపొందును. ఆ పిమ్మట అతడు శిబిరములోనికి ప్రవేశింపవచ్చును. కాని ఏడునాళ్ళ పాటు తన గుడారము వెలుపల ఉండి పోవలయును.

9. ఏడవనాడు మరల తల, గడ్డము, కనుబొమ్మలు, మిగిలిన రోమములు గొరిగించుకొని, దుస్తులు ఉతుకుకొని, స్నానము చేయవలయును. అప్పుడతడు శుద్ధిని పొందును.

10. ఎనిమిదవనాడు అతడు ఏడాది ఈడుగలవి, అవలక్షణములు లేనివి రెండు మగగొఱ్ఱెపిల్లలను, ఒక ఆడుగొఱ్ఱెపిల్లను, నూనెతో కలిపిన మూడు కుంచముల గోధుమపిండిని, ఒక గిన్నెడు ఓలివునూనెను కొని రావలయును.

11. యాజకుడు అతనిని అతని కానుకలను సమావేశపుగుడార ప్రవేశ ద్వారము వద్దకు కొనిపోవును. 

12. యాజకుడు ఒక మగగొఱ్ఱెపిల్లను ఓలివుతైలమును దోషపరిహారబలిగా వానిని తెచ్చి ప్రభువునెదుట అల్లాడింపబడు అర్పణగా అర్పించును.

13. పాపపరిహారబలులు, దహనబలులు సమర్పించు పవిత్రస్థలముననే ఆ గొఱ్ఱెపిల్లను వధింపవలయును. పాపపరిహారబలివలె ఈ దోషపరిహారబలిలో చంపబడిన గొఱ్ఱెపిల్ల యాజకునికే చెందును. అది పరమ పవిత్రమైన నైవేద్యము.

14. యాజకుడు ఆ గొఱ్ఱె పిల్లనెత్తుటిని కొద్దిగా తీసికొని శుద్ధి పొందువాని కుడిచెవి అంచుమీదను, కుడిచేతి బొటనవ్రేలి మీదను, కుడికాలి బొటనవ్రేలి మీదను పూయవలయును. 

15. అతడు నూనెబుడ్డిని తీసికొని తన ఎడమ అరచేతిలో కొంచెము తైలము పోసికోవలయును.

16. కుడిచేతి వ్రేలితో ఆ ఎడమచేతిలోని తైలమును కొద్దిగా తీసికొని ఏడుసార్లు దేవుని సన్నిధిలో చిలుకరింపవలయును.

17. ఎడమ అరచేతిలోని తైలమును కొద్దిగా తీసికొని శుద్ధినిపొందువాని కుడిచెవి అంచుమీద, కుడిచేతి బొటన వ్రేలిమీద, కుడికాలి బొటనవ్రేలి మీద పూయవలయును. దోషపరిహారార్ధబలి నెత్తురును పూసినట్లే ఈ తైలమును పూయవలయును.

18. యాజకుడు తన చేతిలో మిగిలియున్న తైలమును, శుద్ధిని పొందువాని తలమీద పోయును. ఈ రీతిగా అతడు ప్రభువు సన్నిధిలో ప్రాయశ్చిత్తము చేయవలయును.

19-20. అటుపిమ్మట యాజకుడు పాపపరిహార బలిని అర్పించి శుద్ధిజరుపును. కడన దహనబలికి ఉద్దేశింపబడిన గొఱ్ఱెపిల్లను వధించి దానిని ధాన్యబలితోపాటు పీఠముమీద దహించును. ఈ రీతిగా ప్రాయశ్చిత్తము చేయగా కుష్ఠనయమయినవాడు శుద్ధినిబడయును.

21. శుద్ది పొందువాడు పేదవాడైనచో దోష పరిహారబలికిగాను ఒక్క మగగొఱ్ఱెపిల్లను కొనివచ్చిన చాలును. దానిని ప్రభువు ఎదుట అల్లాడింపబడు అర్పణగా అర్పింపవలయును. నూనె కలిపిన ఒక కుంచెడు గోధుమపిండిని, ఒక బుడ్డిలో మూడవ వంతు ఓలివునూనెను కొనివచ్చిన చాలును.

22. ఇంకను అతడు తన తాహతుకు తగినట్లుగా రెండు తెల్లగువ్వలనో లేక రెండు పావురపుపిల్లలనో కొని రావలయును. వానిలో ఒకటి పాపపరిహారబలికి మరియొకటి దహనబలికి.

23. అతడు శుద్ధిచేయించు కొనమొదలు పెట్టిన ఎనిమిదవనాడు వానినన్నిటిని గుడార ప్రవేశద్వారమునొద్ద ఉండు యాజకుని వద్దకు కొనితేవలయును.

24. యాజకుడు దోషపరిహార గొఱ్ఱె పిల్లను, ఒక గిన్నెలో నూనెను గైకొని ప్రభువు ముందట అల్లాడింపబడు అర్పణగా అర్పించును.

25. గొఱ్ఱెపిల్లను వధించి దాని నెత్తుటిని కొంత తీసుకొని శుద్ధిని బడయువాని కుడిచెవి అంచునకు, కుడిచేతి బొటనవ్రేలికి, కుడికాలి బొటనవ్రేలికి పూయవలయును.

26-27. యాజకుడు నూనెను తన ఎడమ అరచేతిలో పోసికొని, కుడిచేతి వ్రేలితో దానిని ఏడుసార్లు ప్రభువు సన్నిధిలో చిలుకరించును.

28. ఆ నూనెను కొంత శుద్ది పొందువాని కుడిచెవి అంచుమీదను, కుడిచేతి బొటనవ్రేలి మీదను, కుడికాలి బొటనవ్రేలిమీదను పూయును. దోషపరిహారబలి రక్తమును పూసినట్లే ఈ నూనెను కూడ పూయవలయును.

29. యాజకుడు తన ఎడమచేతిలో మిగిలి యున్న నూనెను శుద్ధిని బడయువాని తలమీద పోసి అతనికి ప్రాయశ్చిత్తము చేయవలయును.

30-31. తరువాత అతడు తన తాహతుకు తగినట్లుగా ఒక పావురమునుగాని లేక ఒక తెల్లగువ్వనుగాని పాప పరిహారబలిగా సమర్పించును. రెండవ దానిని ధాన్యబలితో పాటు దహనబలిగా అర్పించును. ఈ రీతిగా యాజకుడు ప్రాయశ్చిత్తము చేయును.

32. కుష్ఠనుండి విముక్తి చెందిన పిదప ప్రాయశ్చిత్తమునకు గాను పశువులను అర్పింపలేని పేదవానిని గూర్చిన, నియమములివి.”

33. ప్రభువు మోషే అహరోనులతో ఇట్లనెను:

34-35. "మీరు నేను వారసత్వముగా ఈయనున్న కనాను మండలమును చేరుకొనిన తరువాత నేనట మీలో ఎవరి ఇంటికైన కుష్ఠ సోకునట్లు చేయుదునేని ఆ ఇంటి యజమానుడు యాజకునివద్దకు వెళ్ళి తన ఇంటికి కుష్ఠ సోకినదని తెలియజేయవలయును.

36. యాజకుడు ఆ ఇంటిని పరీక్షించుటకు వెళ్ళకముందు ఆ ఇంటియందలి వస్తువులన్నిటిని వెలుపల పెట్టించును. లేదేని ఆ ఇంటిలోని వస్తువులన్ని అశుద్ధములగును. అటుతరువాత అతడు ఆ ఇంటిలోనికి పోవును.

37-38. ఆ ఇంట ఎఱ్ఱని పొడలుగాని లేక తెల్లని పొడలు గాని గోడలను తినివేయుచున్నచో, అతడు ఆ ఇంటినుండి వెలుపలికి వచ్చి, దానిని ఏడునాళ్ళపాటు మూయించును.

39. ఏడవనాడు ఆ ఇంటిని మరల పరీక్షించును. పొడలు గోడలమీద వ్యాపించి ఉన్నచో,

40. ఆ పొడలు సోకిన రాళ్ళను గోడలలోనుండి తొలగించి పట్టణము వెలుపల ఏదైన అశుద్ధమైన తావున పడవేయుడని ఆజ్ఞాపింపవలయును.

41. అటుపిమ్మట గోడల లోపలి భాగములను గోకివేసి ప్రోగైన అలుకుడు మట్టిని నగరము వెలుపల ఏదైన అశుద్ధమైన తావున పోయింప వలయును.

42. తొలగించిన రాళ్ళకు బదులుగా క్రొత్త రాళ్ళను పేర్చి గోడలను మరల అలుకవలయును.

43. రాళ్ళను తొలగించి గోడలను గోకి క్రొత్తగా అలికిన తరువాతకూడ పొడలు మరల కన్పించెనేని

44. యాజకుడు వచ్చి ఇంటిని పరీక్షింపవలయును. పొడలు మరల వ్యాపించియుండెనేని ఆ ఇంటికి కుష్ఠ సోకినట్లు. అది అశుద్ధమైన ఇల్లు.

45. కనుక ఆ ఇంటిని పడగొట్టవలయును. దాని రాళ్ళను, కొయ్యను, అలుకుడు మట్టిని ఎత్తి నగరము వెలుపల ఏదైన అశుద్ధమైన తావున పడవేయవలయును.

46. అశుద్ధముగా ఉన్నందున మూసివేయబడి యున్న ఇంటిలో ఎవడైనను అడుగుపెట్టెనేని అతడు సాయంకాలము వరకు అశుద్దుడగును.

47. దానిలో నిద్రించువాడుకాని, అన్నము తినువాడు కాని బట్టలు ఉతుకు కోవలయును.

48. కాని యాజకుడు ఇంటిని పరీక్షింపవచ్చినప్పుడు, కొత్తగా అలికిన తరువాత అందలి పొడలు వ్యాపించియుండవేని అతడు దానిని శుద్ధముగా నిర్ణయింపవలయును. ఎందుకన గోడల మీది కుష్ఠ సమసిపోయినది.

49. యజమానుడు ఇంటిని శుద్ధి చేయించుటకు గాను దోషపరిహారార్ధబలికి రెండు పక్షులను, దేవదారు కొయ్యను, ఎల్లని దారమును, హిస్సోపు రెమ్మను కొనిరావలయును.

50.. స్వచ్చమైన ప్రవాహజలము మీద ఒక పక్షిని మట్టిపాత్రలో చంపవలయును.

51. దేవదారు కొయ్యను, హిస్సోపురెమ్మను, దారమును, బ్రతికియున్న పక్షిని అన్నిటిని ప్రవహించు జలముపై చంపిన పక్షి నెత్తురులో మరియు ప్రవాహజలములో ముంచి, వాటితో ఇంటిని ఏడుసార్లు చిలుకరింపవలయును.

52. ఈ రీతిగా అతడు పక్షిరక్తముతో, స్వచ్చమైన నీటితో, బ్రతికియున్న పక్షితో, దేవదారు కొయ్య, ఎఱ్ఱని దారము, హెస్సోపురెమ్మతో ఇంటిని శుద్ధి చేయవలయును.

53. తరువాత వెలుపలి పొలములోనికి ఎగిరిపోవుటకు రెండవపక్షిని వదలి వేయవలయును. ఈ రీతిగా కుష్ఠసోకిన ఇంటికి ప్రాయశ్చిత్తముచేయగా నిర్మలమగును.

54-56. నరులకు, ఇండ్లకు, బట్టలకు సోకెడు కుష్ఠను గూర్చి, వాపులు, పొక్కులు, నిగనిగలాడు పొడలు మొదలగువానిని గూర్చి నియమములివి.

57. ఒకడు ఎప్పుడు అపవిత్రుడగునో, ఎప్పుడు పవిత్రుడగునో తెలియజేయుటకు కుష్ఠమును గూర్చిన విధి యిదియే.