ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

లేవీయకాండము చాప్టర్ 13

1. ప్రభువు మోషే, అహరోనులతో ఇట్లనెను:

2. "ఎవని శరీరము మీదనైనా వాపుగాని, పొక్కులు గాని, నిగనిగలాడు పొడగాని కనిపించి కుష్టయేమో అను శంక కలిగించినయెడల అతనిని అహరోను వంశపు యాజకుని యొద్దకు కొనిపోవలయును.

3. యాజకుడు అతని చర్మవ్యాధిని పరిశీలించును. వ్యాధి సోకినచోట వెంట్రుకలు తెల్లబారినను, లేక దేహ చర్మముకంటె ఆ చోటు పల్లముగా కనబడినను అది కుష్ఠమే. యాజకుడు అట్టి నరుని అశుద్ధునిగా నిర్ణయించవలయును.

4. కాని దేహముమీద తెల్లని మచ్చమాత్రము కనిపించి, చర్మముక్రుంగుట, వెంట్రుకలు తెల్లబారుట అను లక్షణములు కనిపింపవేని యాజకుడు రోగిని ఏడునాళ్ళపాటు కడన ఉంచవలయును.

5. ఏడవనాడు రోగిని మరల పరిశీలింపవలయును. ఆ పొడ ఆలాగునే యుండి దేహమునందు వ్యాపింపకుండ ఉండినయెడల రోగిని మరి ఏడు దినములపాటు కడన ఉంచవలయును.

6. ఏడవనాడు మరల రోగిని పరీక్షింపవలయును. క్షీణించిన పొడ దేహమునందు వ్యాపింపక ఉండిన యెడల యాజకుడు రోగిని శుద్దునిగా నిర్ణయింపవలెను. అది వట్టి పొక్కు మాత్రమే. రోగిబట్టలు ఉతుకుకొని శుద్ధినిపొందును.

7. కాని యాజకుడు రోగిని పరీక్షించి శుద్ధునిగా నిర్ణయించిన పిదప అతని దేహమందు పొడ వ్యాపించేనేని అతడు మరల యాజకుని చూడవలయును.

8. యాజకుడు రోగిని పరీక్షించి పొడ వ్యాపించియుండిన యెడల అతనిని అశుద్ధునిగా నిర్ణయించవలెను. అది కుష్ఠమే.

9. ఎవరికైనను కుష్ఠసోకినయెడల వానిని యాజకుని వద్దకు కొనిపోవలయును.

10-11. యాజకుడు రోగిని పరీక్షించును. అతని దేహము మీద తెల్లనివాపు, తెల్లబారిన వెంట్రుకలు, పచ్చిగ కన్పించెనేని దానిని పూర్వమునుండే ఉన్న కుష్ఠగా నిర్ణయింపవలయును. రోగిని అశుద్ధునిగా నిర్ణయింపవలయును. అట్టి రోగిని పరీక్షార్థము ఊరినుండి వెలుపలికి పంపనక్కరలేదు. అతడు నిస్సందేహముగా అశుద్దుడు.

12-13. కాని రోగి దేహమంతట శిరస్సునుండి పాదమువరకు కుష్ఠ వ్యాపించియుండెనేని యాజకుడు అతనిని పరిశీలింపవలయును. రోగి దేహమంతట కుష్ఠ వ్యాపించియుండెనేని యాజకుడు అతనిని శుద్ధునిగా నిర్ణయింపవలయును. రోగి దేహమందంత తెల్లబారెను కనుక అతడు శుద్దుడు.

14. కాని ఆ రోగి చర్మముమీద పుండు లేవగనే అతడు అశుద్దుడు అగును.

15. యాజకుడు రోగి పుండును పరీక్షించి అతనిని అశుద్దునిగా నిర్ణయింపవలయును. పుండు కుష్ఠకు గుర్తు. పుండు కలవాడు అశుద్దుడు.

16. కాని ఆ పుండు తెల్లబారెనేని రోగి యాజకునివద్దకు వెళ్ళవలయును.

17. యాజకుడు రోగిని పరీక్షించి కుష్ఠ తెల్లబారినదని గుర్తించెనేని అతనిని శుద్దునిగా నిర్ణయింపవలయును. అతడు శుద్ధుడే.

18-19. ఎవరికైన బొబ్బలేచి అది నయమైన పిదప ఆ తావున తెల్లని వాపుకాని, ఎరుపు, తెలుపు రంగుల పొడ గాని కనిపించినయెడల అతడు యాజకుని వద్దకు వెళ్ళవలయును.

20. యాజకుడు రోగిని పరీక్షించి చూచి, తెల్లని రోమములు, చర్మము పల్లముగా ఉండుట అను లక్షణములు కనిపించినచో అతనిని అశుద్ధునిగా నిర్ణయింపవలయును. అతనికి బొబ్బమీద కుష్ఠ సోకినట్లు.

21. కాని పై రెండు లక్షణములు కన్పింపక వ్యాధి సోకిన తావున రంగు మాత్రమే మారియుండెనేని యాజకుడు రోగిని ఏడు నాళ్ళపాటు వేరుగా ఉంచవలయును.

22. పొడ వ్యాపించునేని యాజకుడు రోగిని అశుద్ధునిగా నిర్ణయింపవలయును. అతనికి కుష్ఠ సోకినది.

23. కాని పొడ వ్యాపింపదేని అది బొబ్బమచ్చ మాత్రమే. కనుక యాజకుడు రోగిని శుద్ధునిగానే నిర్ణయింప వలయును.

24. ఎవరికైనను దేహము కాలి, ఆ కాలిన భాగమున తెల్లనిమచ్చగాని లేక తెలుపు, ఎరుపు రంగుల మచ్చ గాని ఏర్పడినచో,

25. యాజకుడు అతనిని పరీక్షింపవలయును. వెంట్రుకలు తెల్లబడుట, చర్మము క్రుంగుటయను లక్షణములు కనిపించెనేని కుష్ఠ సోకినట్లే. యాజకుడు అతనిని అశుద్ధునిగా నిర్ణయింపవలయును. అది కుష్ఠయే.

26. కాని పై రెండు లక్షణములు కన్పింపక వ్యాధి సోకిన తావున రంగుమాత్రమే మారియుండెనేని యాజకుడు రోగిని ఏడునాళ్ళపాటు వేరుగ ఉంచవలయును.

27. ఏడవనాడు, రోగిని మరల పరీక్షించి చూచి పొడ వ్యాపించియున్నచో అతనిని అశుదునిగా నిర్ణయింపవలయును. అది కుష్ఠయే.

28. కాని పొడ వ్యాపింపక రంగును కోల్పోవుచుండెనేని దానిని కాలుపులవలన వచ్చిన వాపుగా నిర్ణయింపవలయును. యాజకుడు రోగిని శుద్ధునిగా గణింపవలయును. అది కేవలము వాపువలన కలిగినమచ్చ.

29-30. స్త్రీ పురుషులలో ఎవరికైన తలమీదనైనను, గడ్డముమీదనైనను పొడలేచినచో యాజకుడు ఆ వ్యక్తిని పరీక్షింపవలయును. అచట చర్మము క్రుంగి యుండి వెంట్రుకలు సన్నబారి పసుపురంగు కలిగియుండిన యాజకుడు రోగిని అశుద్ధునిగా నిర్ణయింపవలయును. అది తలమీదనో, గడ్డము మీదనో వచ్చెడి కుష్ఠ.

31. కాని యాజకుడు పరీక్షింపగా పై రెండు లకణములు కన్పింపవేని రోగిని ఏడునాళ్ళపాటు వేరుగ ఉంచవలయును.

32-33. ఏడవనాడు రోగిని మరల పరీక్షింపవలయును. పొక్కిన పుండు వ్యాపింపక, చర్మము క్రుంగక, వెంట్రుకలు పసుపురంగు పొందక ఉండెనేని రోగి ఆ కురుపు లేచిన భాగము చుట్టు వెంట్రుకలు గొరిగించుకోవలెను. అతడు ఇంకను ఏడునాళ్ళపాటు ఊరికి వెలుపల వసింపవలయును.

34. యాజకుడు రోగిని మరల ఏడవనాడు పరీక్షింప వలయును. కురుపు దేహమునందు వ్యాపింపక, చర్మము క్రుంగక ఉండెనేని యాజకుడు రోగిని శుద్ధునిగనే గణింపవలయును. అతడు దుస్తులు ఉతుకుకొని శుద్ధినిపొందును.

35-36. కాని రోగిని శుద్దునిగా నిర్ణయించిన పిమ్మట కురుపు వ్యాపించెనేని యాజకుడు అతనిని మరల పరీక్షింపవలయును. అది వ్యాపించియుండెనేని ఇక వెంట్రుకలు పసుపుగానున్నవా లేవా అని పరీక్షింపనక్కరలేదు. అతడు అశుద్దుడే.

37. కాని యాజకుని దృష్టిలో కురుపు వ్యాపింపకయుండి ఆ తావున నల్లని వెంట్రుకలు పెరుగుచుండెనేని రోగికి వ్యాధినయమైనట్లే. యాజకుడు అతనిని శుద్ధునిగా నిర్ణయింపవలయును.

38-39. స్త్రీ పురుషులలో ఎవరి చర్మముమీదనైన తెల్లని పొడలు ఏర్పడినచో యాజకులు ఆ వ్యక్తిని పరీక్షింపవలయును. ఆ పొడలు మసకగానున్న తెల్ల మచ్చలు మాత్రమే అగునేని అవి వట్టి దద్దులు. ఆ రోగి శుద్దుడు.

40. ఎవరికైనను తలమీద వెంట్రుకలు రాలి పోయినచో అది బట్టతల మాత్రమే అగును. అతడు అశుద్దుడు కాడు.

41. అతని తల ముందటిభాగమున వెంట్రుకలు రాలిపోయినచో ఆ భాగము బట్టతల అగును. అతడు అశుద్దుడు కాడు.

42. కాని అతని బట్టతల మీద తెలుపు, ఎరుపు రంగులుగల కురుపు లేచెనేని అది కుష్ఠ.

43-44. యాజకుడు రోగిని పరీక్షించి అతని తలమీద ఎరుపు, తెలుపు రంగులు గల వాపును గుర్తించెనేని అతనిని అశుద్ధునిగా నిర్ణయింపవలయును. అది తలమీద వచ్చెడు కుష్ఠ.

45. కుష్ఠరోగి చినిగిన బట్టలు తాల్చి, తల విరబోసి కొనవలయును. అతడు పై పెదవి మీద చేయి మోపి “అశుద్దుడను, అశుద్ధుడను” అని కేకలిడవలయును.

46. కుష్ఠరోగిగా ఉన్నంతకాలము అతడు అశుద్దుడే. అతడు ఏకాంతముగా శిబిరము వెలుపల జీవింపవలయును.

47-49. ఉన్ని, నూలు దుస్తులకుగాని, చర్మ సామాగ్రికి కాని కుష్ఠసోకి వాని మీదపచ్చనిపొడ కనిపించిన యెడల వానిని యాజకునికి చూపింపవలయును.

50. యాజకుడు ఆ వస్తువుల మీది బూజును పరీక్షించి, వానిని ఏడు రోజులపాటు ఒక ప్రక్కన పెట్టించును.

51. అతడు ఏడవనాడు మరల పరీక్షించినపుడు ఆ వస్తువులమీద బూజు వ్యాపించియుండెనేని అది కుష్ఠయే. ఆ వస్తువులు అశుద్ధములు.

52. కనుక యాజకుడు వానిని దహింపవలయును. అది వ్యాప్తి చెందు కుష్ఠ కనుక దానిని నిప్పుతో కాల్చివేయవలయును.

53-54. కాని ఆ వస్తువులమీద బూజు వ్యాపింపదేని వానిని కడిగి ఏడునాళ్ళపాటు ఒక ప్రక్కన పెట్టవలయును.

55. అతడు వానిని మరల పరీక్షించినపుడు బూజు వ్యాపింపకపోయినను, అవి పూర్వపు రంగుతోనే యుండినయెడల ఆ వస్తువులను అశుద్ధములుగా గణింపవలయును. బూజు పూర్తిగా లోపటను, వెలుపటను సోకినది కనుక వానిని నిప్పుతో కాల్చి వేయవలయును.

56. కాని యాజకుడు మరల పరీక్షించినపుడు బూజు తగ్గియుండెనేని ఆ బూజుపట్టిన భాగమును మాత్రము కోసివేయవలయును.

57. ఆ వస్తువుల మీద బూజు మరల కన్పించెనేని కుష్ఠ ప్రబలమైనట్లు. కనుక యాజకుడు వానిని కాల్చివేయవలయును.

58. కాని ఆ వస్తువులను ఒకమారు కడిగిన తరువాత వానిమీది బూజు పోయెనేని వానిని మరల కడుగవలయును. అప్పుడు అవి శుద్ధములగును.

59. ఉన్ని, నూలు దుస్తులకు, చర్మసామాగ్రికి సోకిన కుష్ఠను గూర్చిన నియమములివి.”