ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

లేవీయకాండము చాప్టర్ 10

1. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమతమ ధూపపాత్రలను గైకొని, వానిలో అపవిత్రమైన నిప్పువేసి ప్రభువాజ్ఞను ఉల్లంఘించి ప్రభువునకు సాంబ్రాణిపొగ వేసిరి. వారు అట్టి నిప్పుతో సాంబ్రాణి పొగ వేయవలయునని ప్రభువు ఆజ్ఞాపింపలేదు.

2. కనుక ప్రభువు సన్నిధినుండి ఒక అగ్నిజ్వాల వెడలివచ్చి వారిని నిలువున కాల్చిచంపెను.

3. మోషే అహరోనుతో, “నాకు సేవచేయువారు నా పావిత్య్రమును గుర్తింపవలయును. నా ప్రజలల్లెరు నన్ను గౌరవింపవలయును అని ప్రభువు నుడివెనుకదా! దాని భావమిదియే” అని చెప్పెను. ఆ మాటలకు అహరోను మౌనము వహించెను.

4. మోషే, అహరోనునకు పినతండ్రియగు ఉజ్జీయేలు కుమారులైన మీషాయేలు, ఎల్సాఫాను అను వారిని పిలిచి “ఇటువచ్చి మీ సోదరుల శవములను గుడారము నుండి బయటకు కొనిపోయి శిబిరము వెలుపలికి చేర్పుడు” అని చెప్పెను.

5. మోషే ఆజ్ఞాపించినట్లే వారు చొక్కాయలతోనున్న మృతదేహములను శిబిరము వెలుపలికి కొనిపోయిరి.

6. మోషే అహరోనుతో, అతని కుమారులు ఎలియెజెరు, ఈతామారులతో “మీరు సంతాపసూచకముగా జుట్టు విరబోసికొనకుడు. బట్టలు చించుకొనకుడు. అటుల చేయుదురేని మీరును చత్తురు. ప్రభువు మన సమాజమంతటి మీద ఆగ్రహించును. ప్రభువు అగ్నికి ఆహుతులైనవారి కొరకు యిస్రాయేలీయులు అందరు సంతాపము వెలిబుచ్చవచ్చును.

7. మీరు గుడారమును వీడుదురేని తప్పక చత్తురు. ప్రభువు అభిషేకతైలముతో మీరు అభిషేకింపబడితిరి గదా!” అనెను. వారు మోషే ఆజ్ఞ పాటించిరి.

8. ప్రభువు అహరోనుతో ఇట్లు సెలవిచ్చెను. “నీవు గాని, నీ కుమారులుగాని సమావేశపు గుడారమునకు వచ్చునపుడు ద్రాక్షసారాయమునుగాని, ఘాటయిన మద్యమునుగాని సేవింపరాదు.

9. ఈ నియమము మీరుదురేని మీరు చత్తురు. మీ వంశజులందరికి ఇది శాశ్వతనియమము.

10. మీరు పవిత్ర వస్తువేదో, సామాన్యవస్తువేదో, శుచికరమైన వస్తువేదో, అశుచికరమైన వస్తువేదో గుర్తింపవలయును.

11. నేను మోషే ద్వారా మీకనుగ్రహించిన నియమములనెల్ల మీరు యిస్రాయేలీయులకు బోధింపవలయును” అని చెప్పెను,

12. మోషే అహరోనుతో, మిగిలిన అతని ఇద్దరు కుమారులు ఎలియెజెరు, ఈతామారు అనువారితో “మీరు ప్రభువునెదుట దహింపగా మిగిలిన ధాన్య బలిని గైకొని, దానితో పొంగనిరొట్టెలను తయారు చేసికొని పీఠము చేరువలో భుజింపుడు. అది పరమ పవిత్రమైన బలి.

13. నైవేద్యమును పవిత్రస్థలముననే ఆరగింపుడు. ప్రభువునకు అర్పింపబడిన ధాన్యబలినుండి ఈ భాగము మీకును, మీ కుమారులకును చెందును. ప్రభువే ఈ నియమమును జారీ చేసెను.

14. ప్రభువు ఎదుట అల్లాడింపబడిన రొమ్మును, దాని కుడితొడను, మీరు మీ కుటుంబములు కలిసి పవిత్ర స్థలమున భుజింపవచ్చును. యిస్రాయేలీయులు అర్పించు సమాధానబలులనుండి ఈ భాగములు మీకును, మీ కుమారులకును చెందును.

15. బలిపశువు క్రొవ్వును పీఠముమీద దహించు నపుడు ప్రభువునకు అల్లాడింపబడిన ఆ పశువు రొమ్మును దాని కుడితొడను శాశ్వతముగా మీకును, మీ కుమారులకును చెందును. ఇది ప్రభువు ఆజ్ఞ” అని చెప్పెను.

16. మోషే పాపపరిహారబలిగా అర్పింపబడిన మేకను గూర్చి విచారింపగా దానిని బలిపీఠముమీద సంపూర్తిగా కాల్చివేసిరని తెలియవచ్చెను. అతడు ఎలియెజెరు, ఈతామారులపై కోపించెను.

17. “మీరు ఆ పాపపరిహార బలిపశువును పవిత్ర స్థలమున ఏల భుజింపరైతిరి? అది పరమపవిత్రమైన నైవేద్యము కనుక దానిని భుజించుటవలన యిస్రాయేలీయుల పాపములకు ప్రాయశ్చిత్తము చేసియుందురుకదా?

18. ఆ పశువు నెత్తురును పవిత్రస్థలములోకి కొని పోలేదుకదా! కనుక నేను ఆజ్ఞాపించినట్లే మీరు దానిని పవిత్రస్థలములో భుజించియుండవలసినది” అనెను.

19. అందుకు అహరోను “పాపపరిహారబలిగా మరియు దహనబలిగా వారు అర్పించినబలి అర్పణను నేను భుజించిన మాత్రముననే ప్రభువు అధికముగా సంతుష్టి చెందియుండునా? మన ప్రజలు నేడు పాపపరిహారబలిని, సంపూర్ణదహనబలిని అర్పించిరి. అయినను ఇట్టి ఆపద కలిగినదికదా?” అని అనెను.

20. మోషే ఆ సమాధానమును అంగీకరించెను.

Copyright © 2025 Telugu Catholic Bible All Rights Reserved | Website Designed by HyderHub Web Services