ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

jekarya 6

1. నేను కన్నులెత్తి చూడగా ఈ దృశ్యము కనిపించెను. నాలుగు రథములు రెండు కంచుకొండల నుండి వెలుపలికి వచ్చుచుండెను.

2-3. మొదటి రథమును ఎఱ్ఱగుఱ్ఱములును, రెండవదానిని నల్లగుఱ్ఱములును, మూడవదానిని తెల్లగుఱ్ఱములును, నాలుగవదానిని చుక్కలు కలిగిన గుఱ్ఱములును లాగుచుండెను.

4. అపుడు "అయ్యా! ఈ రథముల భావమేమిటి?” అని నేను దేవదూతనడిగితిని.

5. “ఇవి నాలుగు ఆత్మములు. ఇవి ఇప్పుడే సర్వలోకాధిపతియైన ప్రభువు సమక్షమునుండి వచ్చినవి” అని అతడు చెప్పెను.

6. నల్లగుఱ్ఱములులాగు రథము ఉత్తరదిక్కున నున్న బబులోనియాకు పోవుచుండెను. తెల్లగుఱ్ఱములు లాగునది దానిననుసరించి వెంటపోవుచుండెను. చుక్కలుగలిగిన గుఱ్ఱములులాగునది దక్షిణదేశమునకు పోవుచుండెను.

7. చుక్కలుకలిగిన గుఱ్ఱములు కాలు కదపి భూమిని పరిశీలింపబోవుటకు త్వరపడుచున్నట్లు కనిపించెను. దేవదూత “మీరు వెళ్ళి భూలోకమంతట పరీక్షించిచూడుడు” అని వానితో చెప్పెను.

8. అంతట దేవదూత "ఉత్తరదిక్కుననున్న బబులోనియాకు వచ్చిన అశ్వములు ప్రభువు ఆత్మను ఉపశమింపచేసినవి” అని నాతో చెప్పెను.

9. ప్రభువువాణి నాతో ఇట్లనెను:

10. “బబులోనియా ప్రవాసమునుండి వచ్చిన హెల్దయి, తోబియా, యెదాయా అనువారు జెఫన్యా కుమారుడగు యోషీయా ఇంటనున్నారు. వారచట దిగియున్న దినముననే నీవు ఆ ఇంటికి వెళ్ళి,

11. వారినడిగి వెండి బంగారములు తీసుకొని, కిరీటము చేసి యెహోసాదాకు పుత్రుడును, ప్రధానయాజకుడునైన యెహోషువా శిరస్సునలంకరింపుము.

12. సైన్యములకధిపతియైన ప్రభువు ఇలాగు సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుము. “చిగురు అనబడు నరుడు తానున్నచోటనే వృద్ధి చెందును. అతడు ప్రభువు మందిరమును పునర్నిర్మించును.

13. ఆ జనుడు దేవళమునుకట్టి రాజ గౌరవమును బడసి సింహాసనాసీనుడై పాలించును, సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయును'. ఈ ఇరుబాధ్యతలమధ్య శాంతిసామరస్యములు నెలకొని యుండును.

14. ఆ కిరీటము హెల్దయి, తోబియా, యెదాయా, యోషీయాల కీర్తికి జ్ఞాపకార్థముగా దేవాలయమున ఉండును.

15. దూరముననున్నవారు తిరిగివచ్చి ప్రభువు దేవాలయ నిర్మాణమున తోడ్పడుదురు. దానిని పునర్నిర్మించినపుడు సైన్యములకధిపతియైన ప్రభువు నన్ను పంపెనని మీరు గుర్తింతురు. మీరు మీ దేవుడైన ప్రభువు యావే ఆజ్ఞలు పాటింతురేని ఇదియంతయు జరుగును”.