ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

jekarya 14

1. ప్రభువు తీర్పుతీర్చు దినము ఆసన్నమైనది. అప్పుడు శత్రువులు యెరూషలేమును కొల్లగొట్టుదురు. మీ కన్నుల ఎదుటనే ఆ కొల్లసొమ్మును పంచుకొందురు.

2. ప్రభువు వివిధ జాతుల ప్రజలను ప్రోగుజేసికొని వచ్చును. వారు యెరూషలేముపై పోరు సల్పుదురు. శత్రువులు నగరమును స్వాధీనము చేసికొని గృహములను దోచుకొందురు. స్త్రీలను చెరతురు. సగము ప్రజలు ప్రవాసమునకు పోగా మిగిలినవారు పట్టణముననే ఉందురు.

3. అంతట ప్రభువు యుద్ధమునకుపోయి పూర్వమువలెనే శత్రువులతో పోరాడును.

4. ఆ దినమున ఆయన పాదములు యెరూషలేము ఎదుట తూర్పువైపున ఓలివుకొండపై ఉంచగా, అప్పుడు ఓలివు కొండ తూర్పు వైపునకును మరియు పడమర వైపునకును చీలిపోయి సువిశాలమైనలోయ ఏర్పడును. కొండలో సగభాగము ఉత్తరమునకును, సగభాగము దక్షిణమునకును కదలును.

5. కొండ మధ్యగా ఆవలికి ఆసేలు వరకు సాగిపోయెడి లోయగుండ మీరెల్లరును తప్పించుకొని పారిపోవుదురు. యూదా రాజగు ఉజ్జీయాకాలమున భూకంపము కలుగగ మీ పూర్వులు పారిపోయినట్లే మీరును పారిపోవుదురు. అప్పుడు నాదేవుడైన ప్రభువు సమస్త దేవదూతలతో విజయము చేయును.

6-7. ఆ దినమున వెలుగు లేకపోవును, దట్ట మైన చీకటి మాత్రమే ఉండును. ఆ దినము ఒక ప్రత్యేకదినముగా ఉండును. కాని సాయంకాల సమయమున వెలుతురు ఉండును. పగలుగాని, రాత్రిగాని ఉండని ఆ దినము ప్రభువునకు మాత్రమే తెలియును.

8. ఆ దినమున యెరూషలేమునుండి జీవజలము ప్రవహించును. ఆ నీటిలో సగము తూర్పు సముద్రమునకును, సగము పడమటి సముద్రమునకును పోవును. ఆ జలము గ్రీష్మ శీతకాలములందును ప్రవహించును.

9. అప్పుడు ప్రభువు లోకమంతటికిని రాజగును. ఎల్లరును ఆయనొక్కనినే ప్రభువుగా అంగీకరింతురు. “ప్రభువు' అను ఆయన నామము ఒక్కటియే అని తెలియబడును.

10. ఆ పట్టణము బెన్యామీను ద్వారమునుండి మూలద్వారము వరకును వ్యాపించియుండును. (ఈ మూలద్వారమువద్ద పూర్వము మరియొక ద్వారముండెడిది). హనవేలు బురుజునుండి రాజు ద్రాక్ష గానుగల వరకు వ్యాపించియుండును. ఉత్తరమున గెబానుండి దక్షిణమున రిమ్మోనువరకు దేశము సమతలమగును.

11. యెరూషలేము దాని చుట్టుపట్లనున్న దేశములకంటె ఎత్తుగానుండును. జనులెల్ల యెరూషలేము నగరమున సురక్షితముగా వసింతురు. ఆ నగరమునకు ఇక శాపము ఉండదు, దాని నివాసులు నిర్భయముగా నివసింతురు.

12. మరియు యెరూషలేముమీద యుద్ధము చేసిన జనులందరిని ప్రభువు తెగుళ్ళతో మొత్తును. వారు ఉన్నపాటుననే వారి దేహములు కుళ్ళిపోవును. వారి కన్నులు కండ్లరంధ్రములలో ఉండియే కుళ్ళి పోవును. వారి నాలుకలు నోళ్ళలో ఉండియే కుళ్ళి పోవును.

13. ఆ కాలమున ప్రభువు వారికి భీతిని, కలవరమును పుట్టించును. కనుక వారిలో ప్రతివాడు తమ ప్రక్కవానిని పట్టుకొని కొట్టును.

14. యూదా ప్రజలు యెరూషలేము పక్షమున పోరాడుదురు. వారు సమస్త జాతుల సొత్తును కొల్లగొట్టుదురు. వెండి బంగారములు, వస్త్రములు విస్తారముగా దోచుకొందురు.

15. శత్రువుల శిబిరములోని గుఱ్ఱములు, కంచరగాడిదలు, ఒంటెలు ఇతర జంతువులెల్ల ఘోర వ్యాధికి గురియగును.

16. అప్పుడు యెరూషలేము మీదికి దాడిచేసిన జాతులలో చావక మిగిలియున్నవారెల్లరును ప్రతియేడు యెరూషలేమునకు పోవుదురు. అచట సైన్యములకధిపతియైన ప్రభువును రాజునుగా ఆరాధించి గుడారముల పండుగలో పాల్గొందురు.

17. ఏ జాతియైనను యెరూషలేమునకు పోయి సైన్యములకధిపతియైన ప్రభువును రాజునుగా ఆరాధింపడేని వారి భూమిపై వాన కురియదు.

18. ఐగుప్తీయులు గుడారముల పండుగకు రారేని, ప్రభువు నగరమునకురాని ఇతర జాతులకు కలిగించు వ్యాధులనే వారికిని కలిగించును.

19. ఐగుప్తీయులుకాని, ఇతరజాతులుకాని గుడారముల పండుగలో పాల్గొనలేని ఇట్టి శిక్షకు పాత్రులగుదురు.

20. ఆ కాలమున గుఱ్ఱములజీనుకు కట్టిన గంటలమీద కూడ “ప్రభువునకు సమర్పితము” అని వ్రాయబడి యుండును. దేవళమునందలి వంటపాత్రములును బలిపీఠముచెంతనున్న పాత్రములవలె పవిత్రముగా నుండును.

21. యెరూషలేమునను యూదా దేశమంతటను ఉన్న పాత్రములన్నియు సైన్యములకధిపతియైన ప్రభువు ఆరాధనలో వాడుటకు యోగ్యములగును. బలులర్పించువారు వానిని బలిపశువు మాంసమును వండుటకు వినియోగించుకొందురు. ఆ కాలము వచ్చినపుడు సైన్యముల కధిపతియైన ప్రభువు దేవళమున కనానీయుడు ఎవడునూ కనిపింపడు.