ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

jekarya 10

1. మీరు వసంతకాలమున వానకొరకు ప్రభువును వేడుడు. అతడే మబ్బులు, జల్లులు పంపి ప్రతివాని పొలము పచ్చబడునట్లు చేయును.

2. ప్రజలు గృహదేవతలను, సోదెకాండ్రను సంప్రతింపగా, వారు వారికి కల్లబొల్లి జవాబులు చెప్పిరి. కలల అర్ధము వివరించువారు మిమ్ము అపమార్గము పట్టించిరి. వారు కలిగించు ఊరటయు నిరుపయోగమైనది. కావున ప్రజలు దారితప్పిన గొఱ్ఱెలవలె తిరుగాడుచున్నారు. కాపరిలేడుగాన, వారు వెతల పాలగుచున్నారు.

3. ప్రభువు ఇట్లనుచున్నాడు: “నా ప్రజలను పాలించు కాపరులపై నేను ఆగ్రహము చెందితిని. నేను వారి నాయకులను దండించి తీరుదును. యూదా ప్రజలు నావారు. సైన్యములకధిపతియు, ప్రభువునైన నేను వారిని ఆదరింతును. వారు బలముగల యుద్ధాశ్వముల వంటివారు అగుదురు.

4. వారినుండి ఒక మణి పుట్టును. దానినుండి ఒక శిబిరపు మేకు పుట్టును.  ఒక యుద్దపువిల్లు తయారగును, బాధించువాడు వారిలోనుండి బయలుదేరును.

5. వారు శూరులవలె తమ విరోధులను వీధులలోని బురదలో పడవేసి తొక్కుదురు. వారి ప్రభువు వారికి తోడుగానుండెను గాన, వారు పోరుసల్పగా శత్రువుల ఆశ్వికులు సిగ్గుతో వెనుదిరుగుదురు.

6. నేను యూదా ప్రజలను తన బలాఢ్యులను చేయుదును. యోసేపు సంతతిని కాపాడుదును. ఆ వారిపై దయజూపి వారినెల్లరిని స్వీయదేశమునకు కొనివత్తును. నేను వారి ప్రభుడనైన దేవుడను,  నేను వారి మనవులను ఆలింపగా, నేను వారిని తిరస్కరించలేదు అను భావము వారికి కలుగును.

7. యిస్రాయేలీయులు శూరులవలె ఒప్పుదురు. ద్రాక్షారసముగ్రోలిన వారివలె సంతసింతురు. వారి సంతతి. ఈ విజయమును జ్ఞప్తియందుంచుకొని ప్రభువు చేసిన కార్యమునకుగాను , హృదయపూర్వకముగా ఉల్లసింతురు.

8. నేను నా ప్రజలను ఈలవేసి పిలిచి ప్రోగుజేయుదును. వారిని సంరక్షింతును. పూర్వమువలెవారిని బహుళ సంఖ్యాకులను చేయుదును.

9. నేను వారిని జాతుల నడుమ చెల్లాచెదరు చేసినను ఆ దూర దేశములలో వారు నన్ను స్మరించుకొందురు. వారును, వారి బిడ్డలును ప్రాణములు దక్కించుకొని స్వీయదేశమునకు తిరిగి వత్తురు.

10. ఐగుప్తు అస్సిరియాలనుండి నేను వారిని తోడ్కొని వత్తును. సొంతభూమిపై వారిని పాదుకొల్పుదును. గిలాదు లెబానోనులలో వారికి పట్టజాలనంత స్థావరము కల్పింతును. దేశమంతయు ఆ జనులతో నిండిపోవును.

11. వారు ఆపత్సముద్రమును దాటునపుడు ప్రభువునైన నేను దాని అలలను అణచివేయుదును. నైలునది గర్భము ఎండిపోవును. అస్సిరియా గర్వమణగును. ఐగుప్తు ప్రాభవము అంతరించును.

12. నేను నా ప్రజలను బలసంపన్నులను చేయుదును. వారు నా నామమును స్మరించి, నాకు విధేయులు అగుదురు. ఇది ప్రభువు వాక్కు