ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

jekarya 1

1. దర్యావేషు పారశీకమునకు రాజుగానున్న కాలము రెండవయేడు ఎనిమిదవనెలలో ప్రభువు తన వాక్కును జెకర్యా ప్రవక్తకు వినిపించెను. అతడు బెరాకియా కుమారుడు, ఇద్ధో మనుమడు.

2. సైన్యములకధిపతియైన ప్రభువు జెకర్యాను ప్రజలతో ఇట్లు చెప్పుమనెను: “ప్రభుడనైన నేను మీ పూర్వులపై మిగుల ఆగ్రహము చెందితిని.

3. కాని ఇపుడు నేను మీతో చెప్పునదేమనగా మీరు నా వైపు మరలుడు, నేను మీవైపు తిరుగుదును.

4. మీరు మీ పూర్వులవలె ప్రవర్తింపవలదు. పూర్వ కాలముననే ప్రవక్తలు 'మీరు దుష్కార్యములుచేయుచు పాపపు జీవితము జీవింపవలదు' అని వారిని హెచ్చరించిరి. కాని వారు నా మాటవినలేదు, నాకు విధేయులు కాలేదు.

5. మీ పూర్వులుకాని ఆ ప్రవక్తలు కాని ఇపుడులేరు.

6. అయినను నేను నా సేవకులైన ప్రవక్తలద్వారా వినిపించిన ఆజ్ఞలు, హెచ్చరికలు నెరవేరగ మీ పూర్వులు గతించిన పిదపగూడ మిగిలియున్నవికదా! వారపుడు పశ్చాత్తాపపడిరి. సైన్యములకధిపతియు ప్రభుడనైన నేను నా సంకల్పము చొప్పున వారిని తమ ప్రవర్తనకు తగినరీతిగానే శిక్షించితినని వారు అంగీకరించిరి.”

7. దర్యావేషు పరిపాలన రెండవయేట షేబాతు అనబడు పదునొకండవనెల ఇరువది నాలుగవదినమున రాత్రి దర్శనమున ప్రభువు నాకు ఈ సందేశము నెరిగించెను.

8. నేను ప్రభువుదూత ఎఱ్ఱని గుఱ్ఱము నెక్కిపోవుటను గమనించితిని. అతడు ఒక లోయలో గొంజిచెట్ల నడుమ ఆగెను. అతని వెనుక ఎరుపు, ముదురు గోధుమ, తెలుపురంగుగల గుఱ్ఱములు ఉండెను.

9. “అయ్యా! ఈ అశ్వముల భావమేమిటి?” అని నేనతనిని అడిగితిని, అతడు "నేను వాని భావము నీకెరిగింతును.

10. భూమిని పరిశీలించి చూచుటకుగాను ప్రభువు వానిని పంపెను” అని అనెను.

11. అంతటవి గొంజిచెట్ల నడుమనున్న దేవదూతతో “మేము ప్రపంచమంతట తిరిగి చూచితిమి. లోకమంతయు నెమ్మదితోను శాంతితోను ఒప్పుచున్నది” అని అనెను.

12. అపుడు దేవదూత "సైన్యములకధిపతియైన ప్రభూ! ఇప్పటికి డెబ్బది యేండ్ల నుండి నీవు యెరూషలేము మీదను, యూదా నగరముల మీదను ఆగ్రహము చెందియుంటివి. నీవు ఆ పట్టణములపై దయచూపుటకు ఇంకెంత కాలము పట్టును?” అని అడిగెను.

13. ప్రభువు ఓదార్పు మాటలతో అతనికి జవాబు చెప్పెను.

14. దేవదూత నన్ను సైన్యములకధిపతియైన ప్రభువు పలుకులను ఇట్లు ప్రకటింపుము అనెను: “నాకు యెరూషలేముపట్ల గాఢమైన ప్రేమాదరములు కలవు.

15. నెమ్మదిని, శాంతిని అనుభవించుచున్న అన్యజాతులపై నేను ఆగ్రహము చెందితిని. నేను నా ప్రజలపై కొద్దిగా కోపించితిని. కాని ఆ జాతులు వారి బాధలను అధికము చేసెను.

16. కావున నేను యెరూషలేముపై దయచూపుటకు ఈ నగరమునకు తిరిగివచ్చితిని. నా దేవళమును పునరుద్దరింతురు. యెరూషలేమును తిరిగి నిర్మింతురు.”

17. మరియు దేవదూత నన్నిట్లు ప్రకటింపుము అనెను: “సైన్యములకధిపతియైన ప్రభువు పలుకులివి: నా నగరములు మరల పెంపుచెందును. నేను యెరూషలేమును మరల ఆదుకొందును. దానిని మరల నా దానినిగా చేసికొందును.”

18. అంతట నేను మరియొక దర్శనమున నాలుగు కొమ్ములను చూచితిని.

19. నేను "అయ్యా! వీని భావమేమి?” అని నాతో సంభాషించు దేవదూత నడిగితిని. “అవి యూదావారిని, యిస్రాయేలువారిని, యెరూషలేము నివాసులను చెదరగొట్టిన మహాశక్తులను సూచించునని” అని అతడు చెప్పెను.

20. అపుడు ప్రభువు నాకు నలుగురు కమ్మరి వారిని చూపించెను.

21. “వీరేమి చేయవచ్చిరి?" అని నేను ప్రభువును ప్రశ్నించితిని. “వీరు యూదాను నాశనము చేసి దాని ప్రజలను చెదరగొట్టిన జాతులను భయపెట్టి సంహరించుటకు వచ్చిరి” అని జవాబిచ్చెను.