ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Exodus 8

1. అప్పుడు యావే మోషేతో “నీవు ఫరోరాజు కడకు వెళ్ళి అతనితో 'యావే నీతో ఈ మాటలు చెప్పుమనెను. నన్ను ఆరాధించుటకు నా ప్రజను పోనిమ్ము.

2. నీవు వారిని పోనీయనిచో నీ దేశమునెల్ల కప్పలతో పీడింతునని తెలిసికొనుము.

3. నైలునది కప్పలతో నిండిపోవును. అవి తీరముదాటి నీ సౌధమునకు ప్రాకును. నీ పడుకగదికి, నీ శయ్యమీదికి ప్రాకును. నీ కొలువులో ఉన్నవారి ఇండ్లకు, నీ ప్రజల పడకయిండ్లకు ప్రాకును. నీ ఇంటి పొయ్యిలోనికి, పిండి పిసుకు తొట్లలోనికి ప్రాకును.

4. చివరకు కప్పలు నీమీదికిని, నీ ప్రజలమీదికిని, నీ దాసుల మీదికిని ప్రాకును' అని చెప్పుము" అని పలికెను.

5. యావే మోషేతో, “నీవు అహరోనుతో నదుల మీదికి, వాగుల మీదికి, ఊటగుంటల మీదికి .నీ కఱ్ఱను  చాపుము. ఐగుప్తుదేశమంత కప్పలతో నిండి పోవునట్లు చేయుము' అని చెప్పుము” అని పలికెను.

6. అహరోను చేయెత్తి ఐగుప్తుదేశములోని జలములమీదికి తన కఱ్ఱను చాచెను. అంతట కప్పలు వచ్చి ఐగుప్తు దేశమునందంతట నిండెను.

7. కాని మాంత్రికులు కూడ తమ మంత్రబలముతో ఐగుప్తుదేశము కప్పలతో నిండునట్లు చేసిరి.

8. ఫరో మోషేను, అహరోనును పిలిపించి “నన్నునూ, నా ప్రజలను కప్పలబారినుండి కాపాడుమని యావేను వేడుడు. యావేకు బలులర్పించుటకై ఈ ప్రజలను పోనిత్తునని మాటయిచ్చుచున్నాను” అనెను.

9. మోషే ఫరోతో “ఏలినవారు అనుగ్రహించిన చాలు. కప్పలు నిన్ను నీ కొలువు వారిని, నీ ప్రజలను వీడిపోవునట్లుగా నేనెప్పుడు ప్రార్థింపవలయునో చెప్పుము. నా ప్రార్థనవలన అవి నిన్ను నీ ఇండ్లను వదలిపోయి నైలునదిలోనే ఉండిపోవును”. అనెను.

10. “రేపే ప్రార్ధింపుము” అని ఫరో పలికెను. “నీవు చెప్పినట్లే జరుగును. దీనినిబట్టి ఎవ్వరును మా దేవుడయిన యావేకు సాటిరారని నీవు తెలిసికొందువు.

11. కప్పలు నిన్ను, నీ సౌధములను, నీ కొలువువారిని, నీ జనులను వదలిపోవును. అవి నదిలోనే ఉండును" అని మోషే పలికెను.

12. మోషే, అహరోను ఫరో సమ్ముఖమునుండి వెళ్ళిపోయిరి, యావే కప్పలతో ఫరోను ముప్పుతిప్పలు పెట్టెను. కావున అతనిని కప్పల బారినుండి కాపాడు మని మోషే ప్రభువునకు మొరపెట్టెను.

13. యావే మోషే ప్రార్ధన ప్రకారముగా చేసెను. ఇండ్లలో, ముంగిళ్ళలో, పొలములలో ఉన్న కప్పలన్నియు చచ్చిపోయెను.

14. ప్రజలు చచ్చిన కప్పలను కుప్పలుకుప్పలుగా ప్రోగుచేసిరి. దేశమంతయు కంపుకొట్టెను.

15. కీడు తొలగినదిగదా అనుకొని ప్రభువు చెప్పినట్లు ఫరో ఎప్పటిమాదిరిగా కఠినహృదయుడయ్యెను. మోషే, అహరోను చెప్పిన మాటలు అతడు వినిపించుకోలేదు.

16. అంతట యావే మోషేతో “నీవు అహరోనుతో 'కఱ్ఱచాచి నేలమీద దుమ్మును కొట్టుము. ఐగుప్తు దేశమునందంతట ఆ దుమ్ము దోమలుగా మారును' అనిచెప్పుము” అని పలికెను.

17. వారు అట్లే చేసిరి. అహరోను కఱ్ఱ చాచి దుమ్మునుకొట్టెను. అంతట మనుష్యులకు, జంతువులకు దోమకాటు మొదలయ్యెను. ఐగుప్తు దేశములో నేలమీది దుమ్మంత దోమలుగా మారెను.

18. మాంత్రికులుకూడ మంత్రబలముతో దోమలను పుట్టించుటకు ప్రయత్నించిరి. కాని వారిచేత కాలేదు. దోమలు మనుష్యులను, జంతువులను కుట్టెను.

19. అందుచేత మాంత్రికులు ఫరోతో “ఇది దైవశక్తివలన పుట్టిన కార్యము” అని చెప్పిరి. కాని ఫరో హృదయము ఇంకను బండబారెను. ప్రభువు ముందుగా చెప్పినట్లే అతడు మోషే అహరోనుల మాటలకు చెవియొగ్గలేదు.

20. అంతట యావే మోషేతో “నీవు వేకువనే లేచి ఫరో నదికి వెళ్ళునపుడు అతనికొరకు వేచి యుండుము. అతనితో 'యావే నీకిట్లు చెప్పుచున్నాడు. నన్ను ఆరాధించుటకు నా ప్రజలను పోనిమ్ము.

21. నీవు నా ప్రజను వెళ్ళనీయనిచో నేను నీమీదికి, నీ కొలువువారిమీదికి, నీ జనములమీదికి, నీ సౌధముల మీదికి ఈగల గుంపులను పంపెదను. ఐగుప్తుదేశీ యులు నివసించుచున్న ఇండ్లు, వారు నిలిచిన ప్రదేశ ములన్నియు ఈగలతో నిండిపోవును.

22. కాని అదే సమయమున నా ప్రజలు నివసించు గోషేను మండలమును మాత్రము కాపాడెదను. అక్కడ మాత్రము ఈగపోటు ఉండదు. ఇట్లు చేసినగాని యీ దేశమున అరిష్టములు కలిగించునది ప్రభుడనైన నేనేనని నీవు తెలిసికొనజాలవు.

23. నా ప్రజలను నీ ప్రజలనుండి వేరుచేయుదును. రేపే యీ సూచకక్రియ కనబడును' అని చెప్పుము” అని పలికెను.

24. యావే తాను చెప్పినట్లే చేసెను. ఈగలు గుంపులు గుంపులుగా ఫరో సౌధములలోనికి, అతని కొలువు వారి ఇండ్లలోనికి వచ్చెను. అవి ఐగుప్తుదేశము నందంతట వ్యాపించెను. దేశమంతయు నాశనమయ్యెను.

25. ఫరో మోషేను, అహరోనును పిలిపించి “వెళ్ళుడు ఈ దేశములోనే మీ దేవునికి బలి అర్పింపుడు” అని చెప్పెను.

26. దానికి మోషే “అది మంచిపని కాదు. మేము మా ప్రభువైన దేవునికి పశువులను కొన్నింటిని బలిగా అర్పింతుము. కాని ఆ పశువులను బలియిచ్చుట అనిన ఐగుప్తుదేశీయులు ఏహ్యముగా భావింతురు. ఐగుప్తుదేశీయుల కన్నుల ఎదుటనే వారికి క్రోధము పుట్టించు బలి అర్పించినచో వారు మమ్ము రాళ్ళతో కొట్టి చంపరా?

27. మా దేవుడైన యావే ఆజ్ఞాపించినట్లుగా మేము మూడు రోజులపాటు ఎడారిలో ప్రయాణముచేసి ఆయనకు బలి అర్పించెదము" అని పలికెను.

28. దానికి ఫరో “మీరు ఎక్కువ దూరము పోమనినచో, మీ దేవుడైన యావేకు ఎడారిలో బలి అర్పింప మిమ్ము పోనిత్తును. నా కొరకు మీదేవుని వేడుడు” అని పలికెను.

29. అంతట మోషే “నేను ఇక్కడనుండి వెళ్ళిపోయిన వెంటనే ప్రభువును వేడుకొందును. రేపు ప్రొద్దుట ఈ ఈగలగుంపులు ఫరోను, అతని కొలువువారిని, అతని జనులను వీడిపోవును. కాని ఫరో మాత్రము మరల కపటనాటకమాడి, ప్రభువునకు బలి అర్పింప ప్రజలను వెళ్ళనీకుండ అడ్డగింపరాదు” అనెను.

30. మోషే ఫరోరాజు సమ్ముఖమునుండి వెడలి, యావేను ప్రార్ధించెను.

31. యావే అతడు వేడుకొనినట్లే చేసెను. ఈగలు ఫరోను, అతని కొలువువారిని, అతని ప్రజలను వీడివెళ్ళెను. ఒక్కటిగూడ మిగులలేదు.

32. కాని ఫరో ఈసారి కూడ కఠినచిత్తుడై ప్రజలను పోనీయడాయెను.