ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Exodus 7

1. అంతట దేవుడు మోషేతో “ఇదిగో! చూడుము, నేను నిన్ను ఫరోరాజునకు దేవునివంటి వానినిగా నియమించితిని. నీ సోదరుడు అహరోను నీకు ప్రవక్తగా ఉండును.

2. నేను పలుకుమని నీతో చెప్పినదెల్ల నీవు నీ సోదరుడగు అహరోనుతో చెప్పుము. అతడు ఆ మాటలను ఫరోతో చెప్పి యిస్రాయేలీయులను ఐగుప్తుదేశమునుండి పంపివేయుమని అడుగును. కాని నేను ఫరో హృదయమును కఠినపరతును.

3. అప్పుడు నేను ఐగుప్తుదేశములో అనేక సూచకక్రియలను చూపి, మహత్తర కార్యములను చేయుదును.

4. ఫరో నీ మాట వినడు. నేను ఐగుప్తుదేశముపై నా బలమును చూపుదును. ఆ దేశీయులను నిశ్చయముగా శిక్షించి, నా సేనలును, ప్రజలును అయిన యిస్రాయేలీయులను ఐగుప్తుదేశమునుండి తోడ్కొనివచ్చెదను.

5. ఐగుప్తుదేశముపై నా బలమును చూపి యిస్రాయేలీ యులను వెలుపలకు తోడ్కొనివచ్చినపుడు ఆ దేశీ యులు నేనే ప్రభుడనని తెలిసికొందురు” అనెను.

6. మోషే అహరోనులు ప్రభువుమాట తల దాల్చి ఆయన ఆనతిచ్చినట్లే చేసిరి.

7. ఫరోరాజుతో సంభాషించు నాటికి మోషే వయస్సు ఎనుబది యేండ్లు. అహరోను వయస్సు ఎనుబది మూడేండ్లు.

8. ప్రభువు మోషే అహరోనులతో మాట్లాడుచు,

9. “ఏదీ! మీ అద్భుత శక్తి చూపుడని ఫరో మిమ్మును అడిగినయెడల, మోషే! నీవు అహరోనుతో 'నీ కఱ్ఱను తీసికొని ఫరోముందు పడవేయుము. అది పాము అగును' అని చెప్పవలయును” అని పలికెను.

10. అంతట మోషే అహరోనులు ఫరోరాజు దగ్గరకు వెళ్ళి ప్రభువు ఆనతిచ్చినట్లుగా చేసిరి. అహరోను ఫరో ముందు, అతని కొలువువారి ముందు కఱ్ఱను పడ వేసెను. అది పాముగా మారెను.

11. ఇది చూచిన ఫరోరాజు ఐగుప్తునందలి విజ్ఞానులను, మాంత్రికులను పిలిచెను. వారుకూడ తమ మంత్రములచేత ఆ విధముగనే చేసిరి.

12. వారిలో ప్రతివాడు తన కఱ్ఱను విసరివేసెను. అది పాముగా మారెను. కాని అహరోను కఱ్ఱను వారి కర్రలన్నింటిని మింగివేసెను.

13. అయినప్పటికి ఫరోరాజు కఠినచిత్తుడుగనే ఉండెను. ప్రభువు ముందు చెప్పినట్లుగనే మోషే అహరోనుల మాటలు అతని చెవికి ఎక్కలేదు.

14. అప్పుడు ప్రభువు మోషేతో ఇట్లనెను. “ఫరోరాజు కఠినహృదయుడుగనే ఉన్నాడు. ప్రజను పోనిచ్చుటకు అంగీకరింపకున్నాడు.

15. ఉదయము ననే అతడు నైలునదికి వెళ్ళునపుడు నీవును అతనితో పాటు వెళ్ళుము. ఏటి ఒడ్డున అతనికొరకు వేచియుండుము. నీవు వెళ్ళునపుడు అంతకుముందు పాముగా మారిన కఱ్ఱను గూడ కొనిపొమ్ము.

16. పోయి అతనితో 'హెబ్రీయుల దేవుడైన యావే, అరణ్యములో నన్ను ఆరాధించ నా ప్రజలను పోనిమ్ము' అని నీతో చెప్పుటకు నన్ను పంపెను. కాని ఇంతవరకు నీవు ఆయన మాటలు వినలేదు.

17. కావున ప్రభువు ఇట్లు చెప్పుచున్నాడు. ఇక దీనిని బట్టియైన నేను యావేనని నీవు గుర్తింతువు సుమా! నా చేతిలో ఉన్న ఈ కఱ్ఱతో నైలునది నీటిని కొట్టెదను. అది నెత్తురుగా మారును.

18. ఏటిలోని చేపలన్నియు చచ్చును. నది అంతయు కంపుకొట్టును. నైలునదినీరు త్రాగుటకు ఐగుప్తుదేశీయులు ఏవగించుకొందురు.”

19. ప్రభువు మోషేతో “నీవు అహరోనుతో 'నీ కఱ్ఱను చేపట్టి ఐగుప్తుదేశమునందలి జలములు అన్నింటి మీదికి అనగా నదులు, వాగులు, చెరువులు, ఊటగుంటల మీదికి చేయిచాపుము. వానిలోని నీరెల్ల నెత్తురుగా మారును. చివరకు తొట్టులలోను, కుండలలోను ఉన్న నీరు కూడ నెత్తురగును' అని చెప్పుము” అని పలికెను.

20. మోషే, అహరోనులు ప్రభువు ఆజ్ఞాపించినట్లే చేసిరి. ఫరోరాజు అతని కొలువువారు చూచుచుండగనే అహరోను కఱ్ఱనెత్తి నైలు నది నీటిని కొట్టెను. నది నీరంతయు నెత్తురయ్యెను.

21. నదిలోని చేపలన్నియు చచ్చెను. అది కంపు కొట్టెను. ఐగుప్తు దేశీయులు నైలునది నీటిని త్రాగలేకపోయిరి. ఐగుప్తు దేశమందంతట నెత్తురు కనిపించెను.

22. కాని ఐగుప్తుదేశీయులైన మాంత్రికులు కూడ తమ మంత్ర బలముచే ఆ అద్భుతకార్యమును చేసిరి. అందుచేత ప్రభువు ముందు చెప్పినట్లుగానే ఫరోరాజు యొక్క హృదయము కఠినము అయ్యెను. అతడు మోషే అహరోనులు చెప్పిన మాటలు వినలేదు.

23. ఫరోరాజు ఈ అద్భుతకార్యమునుగూడ లెక్కచేయక తన సౌధమునకు తిరిగి వెళ్ళెను.

24. అంతట ఐగుప్తు దేశీయులు మంచినీటికై ఏటి ఒడ్డుపొడవున గుంటలు త్రవ్విరి. వారు నైలునదిలోని నీటిని త్రాగలేకపోయిరి.

25. యావే నైలునది నీటిని కఱ్ఱతో కొట్టిన తరువాత ఏడు రోజులు గడిచెను.