ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Exodus 6

1. అప్పుడు యావే మోషేతో “నేను ఫరోకు చేయబోవుదానిని నీవే చూచెదవు. చివరకు యిస్రాయేలీయులను పంపునట్లుగానే నేను అతనిపై ఒత్తిడి తెత్తును. అతడు వారిని తన దేశమునుండి తోలి వేయును” అనెను.

2-3. దేవుడు మోషేతో మాట్లాలాడెను. ఆయన అతనితో “నేనే ప్రభుడను. సర్వశక్తిమంతుడగు దేవునిగా నేను అబ్రహామునకు, ఈసాకునకు, యాకోబునకు ప్రత్యక్షమైతిని. కాని యావే అను నా నామమున మాత్రము వారికి నన్ను ఎరుకపరచు కోలేదు.

4. కొంతకాలము వారు పరదేశులుగా వసించిన కనాను మండలమును వారికిచ్చుటకు నేను వారితో ఒడంబడిక చేసికొంటిని.

5. ఇక ఐగుప్తు దేశీయులు బానిసలుగా చేసిన యిస్రాయేలీయుల ఆక్రందనను నేను చెవులారవింటిని. నా ఒడంబడికను గుర్తు తెచ్చుకొంటిని.

6. కావున యిస్రాయేలీయుల దగ్గరకు వెళ్ళి 'నేనే ప్రభుడను. ఐగుప్తుదేశీయులు మీనెత్తికెత్తిన బరువు తొలగింతును. వారి దాస్యము నుండి మీకు విముక్తి కలిగింతును. నా బాహువుచాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్ము దాస్యము నుండి విడిపింతును.

7. మిమ్ము నా ప్రజగా స్వీకరింతును. నేను మీకు దేవుడనగుదును. ఐగుప్తుదేశములో మిమ్ము కష్టముల బారినుండి తప్పించిన మీ దేవుడను, ప్రభుడను “నేనే” అని మీరు తెలిసికొందురు.

8. అబ్రహామునకు, ఈసాకునకు, యాకోబునకు ఇత్తునన్న దేశమునకే నేను మిమ్ము తోడ్కొని పోవు దును. ఆ దేశమును మీకు సొంతసొత్తుగా ఇత్తును. నేనే ప్రభుడను' అని చెప్పుము” అనెను.

9. మోషే ఈ మాటలను యిస్రాయేలీయులకు చెప్పెను. కాని వారు మనోవ్యధవలనను, క్రూరదాస్యము వలనను సహనమును కోల్పోయి ఉండుటచే, అతని మాటలు లక్ష్యము చేయరైరి.

10. అపుడు దేవుడు మోషేతో భాషించెను.

11. ఆయన అతనితో “నీవు వెళ్ళుము. ఈ దేశమును వదలిపోవుటకు యిస్రాయేలీయులను విడిపింపుమని ఫరోతో చెప్పుము” అని పలికెను.

12. మోషే ప్రభూ! యిస్రాయేలీయులే నన్ను లెక్కచేయనప్పుడు ఇక ఫరో నా నత్తిమాటలు వినునా?"" అని పలికెను.

13. ఈ విధముగా దేవుడు మోషేతో, అహరోనుతో మాటలాడెను. ఐగుప్తుదేశమునుండి యిస్రాయేలీయులను తోడ్కొని పోవుటకుగాను, యిస్రాయేలీయుల వద్దకు, ఫరోవద్దకు వెళ్ళుడని వారిని ఆజ్ఞాపించెను."

14. వారిరువురి కుటుంబముల మూలపురు షులు వీరు: యిస్రాయేలు పెద్దకొడుకైన రూబేను కుమారులు హోనోకు, పల్లు, హెస్రోను, కర్మీ అను వారు రూబేను వంశీయులు.

15. షిమ్యోను పుత్రులు: యెమూవేలు, యామీను, ఒహదు, యాకీను, సొహరు మరియు కనానీయురాలి కుమారుడగు షావులు. వీరు షిమ్యోను వంశీయులు.

16. లేవి కుమారులు క్రమముగా గెర్షోను, కోహాతు, మెరారి అనువారు. లేవి నూటముప్పదిఏడేండ్లు బ్రతికెను.

17. గెర్షోను కుమారులు కుటుంబ క్రమమున లిబ్ని, షిమి అనువారు.

18. హాతు కుమారులు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు అనువారు. కోహాతు నూటముప్పది మూడు యేండ్లు జీవించెను.

19. మెరారీ కుమారులు మహ్లి , మూషీ అను వారు. జ్యేష్ఠతనుబట్టి లేవి కుటుంబములవారు వీరే.

20. అమ్రాము తన మేనత్తయగు యోకెబెదును పెండ్లియాడెను. ఆమె అతనికి అహరోనును, మోషేను కనెను. అమ్రాము నూటముప్పది ఏడేండ్లు బ్రతికెను.

21. కోహాతు కుమారులు కోరా, నెఫెగు, సిఖ్రి అనువారు.

22. ఉజ్జీయేలు పుత్రులు మిషాయేలు, ఎల్సాఫాను, సిత్రీ అనువారు.

23. అహరోను అమ్మినాదాబు కుమార్తె, నహసోను చెల్లెలునగు ఎలీషెబను పెండ్లియాడెను. ఆమె అతనికి నాదాబును, అబీహూను, ఎలియెజెరును, ఈతామారును కనెను.

24. కోరా కుమారులు అస్సీరు, ఎల్కానా, అబియాసాపు. వీరు కోరా కుటుంబములవారు.

26. అహరోను కుమారుడగు ఎలియెజెరు పుతీయేలు కుమార్తెలలో ఒకరిని పెండ్లియాడెను. ఆమె అతనికి ఫీనెహాసును కనెను. కుటుంబక్రమమున లేవి కుటుంబముల మూలపురుషులు వీరు.

26. ఈ అహరోను మోషేలకే దేవుడు “యిస్రాయేలీయులను వారివారి వంశముల ప్రకారముగా ఐగుప్తుదేశము నుండి వెలుపలికి తోడ్కొనిరండు” అని చెప్పెను.

27. యిస్రాయేలీయులను ఐగుప్తుదేశము నుండి వెడలిపోనిమ్మని ఫరోరాజుతో మాట్లాడినది వీరిద్దరే. వీరే అహరోను, మోషేలు.

28-29. ఐగుప్తుదేశమున దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు, “నేను ప్రభుడను. నేను మీతో చెప్పిన మాటలనెల్ల ఐగుప్తురాజగు ఫరోతో చెప్పుము” అనెను.

30. మోషే ప్రభువుతో “నేను తడువుకొనుచు మాట్లాడువాడను. ఫరో నా మాటలు వినునా?” అనెను.