ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Exodus 40

1-2. ప్రభువు మోషేతో “మొదటినెల మొదటిదినమున సమావేశపు మందిరగుడారమును నిర్మింపుము.

3. శాసనములుగల సాక్ష్యపు మందసమును గుడారమునందుంచి దాని ముందట అడ్డుతెర కట్టుము.

4. బల్లను దాని ఉపకరణములను, దీప స్తంభమును దాని దీపములను కొనివచ్చి గుడారమున నెలకొల్పుము.

5. ధూపమువేయు బంగారుపీఠమును తెచ్చి శాసనములున్న సాక్ష్యపుమందసము ఎదుట నిలుపుము. గుడార గుమ్మమునకు తెర తగిలింపుము.

6. దహనబలులు అర్పించు బలిపీఠమును సమావేశపు గుడారము ముందటనిలుపుము.

7. ఆ బలిపీఠము నకు సమావేశపుగుడారమునకు నడుమ గంగాళ మును ఉంచి దానిని నీటితో నింపుము.

8. గుడారము చుట్టు ఆవరణము నిర్మించి ఆ ఆవరణ ద్వారమునకు తెరకట్టుము.

9. పిమ్మట అభిషేకతైలము తీసికొని మందిర మును దాని పరికరములను అభిషేకించి దేవునికి నివేదింపుము. అప్పుడది పవిత్రమగును. 

10. దహన బలులు అర్పించు పీఠమును, దాని పరికరములను తైలముతో అభిషేకించి దేవునికి నివేదింపుము. అప్పుడది మహాపవిత్రమగును.

11. గంగాళమును దాని పీటను అభిషేకించి దేవునికి నివేదింపుము.

12. అహరోనును, అతని కుమారులను సమా వేశపుగుడారము గుమ్మము నొద్దకు కొనిరమ్ము. వారిని నీటితో శుభ్రముగా కడగవలయును.

13. అహరోనునకు పవిత్రవస్త్రములు తొడిగి అతనిని అభిషేకించి నాకు నివేదింపుము. అటుతరువాత అతడు యాజకుడై నాకు పరిచర్యచేయును.

14. అహరోను కుమారులను కొనివచ్చి వారికి చొక్కాలు తొడిగింపుము.

15. వారు నాకు యాజకులగుటకై నీవు వారి తండ్రికి అభిషేకము చేసినట్లు వారికిని అభిషేకము చేయుము. ఈ అభిషేకమువలన వారు తరతరములవరకు నాకు నిత్యయాజకులగుదురు” అని చెప్పెను.

16. ప్రభువు ఆజ్ఞాపించినట్లే మోషే సమస్తమును నెరవేర్చెను.

17. యిస్రాయేలీయులు ఐగుప్తునుండి బయలుదేరిన రెండవ సంవత్సరము మొదటి నెల మొదటి రోజున మందిరము నిలువ పెట్టబడెను.

18. యావే మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే గుడారమును నిర్మించెను. అతడు దాని దిమ్మలలో చట్రములను నిలిపి, దాని అడ్డకఱ్ఱలను దూర్చి, స్తంభములను నెలకొల్పెను .

19. ప్రభువు ఆజ్ఞాపించినట్లే అతడు మందిరముమీద గుడారమును పరచి, వానిమీద గుడారపుకప్పును వేసెను.

20. అతడు సాక్ష్యపు శాసనముల పలకలు కొనివచ్చి మందసములో పెట్టెను. ఆ మందసము కడియములలో మోతకఱ్ఱలను దూర్చి దానిమీది కరుణాపీఠము నుంచెను.

21. మందసమును గుడారమున ఉంచి దానిముందట అడ్డుతెరను అమర్చి ప్రభువు ఆజ్ఞాపించినట్లే మందసమును ఇతరుల కంటపడనీయడాయెను.

22. అతడు బల్లను కొనివచ్చి గుడారపు ఉత్తరభాగమున అడ్డుతెర ముందటనుంచెను.

23. ప్రభువు ఆజ్ఞాపించినట్లే దానిమీద నైవేద్యముగా రొట్టెలను అమర్చెను.

24. దీపస్తంభమును గుడారపు దక్షిణ భాగమున బల్లకెదురుగా నిలిపెను.

25. ప్రభువు ఆజ్ఞాపించినట్లే దైవసాన్నిధ్యమున దీపమును వెలిగించెను.

26. బంగారుపీఠమును గుడారమున అడ్డు తెర ముందట నిలిపెను.

27. ప్రభువు ఆజ్ఞాపించినట్లే దానిమీద సువాసనగల సాంబ్రాణి పొగ వేసెను.

28. గుడారపు గుమ్మమునకు తెరనమర్చెను.

29. గుడారపు గుమ్మమునెదుట దహనబలులు అర్పించు బలిపీఠమునుంచెను. ప్రభువు ఆజ్ఞాపించినట్లే ఆ బలిపీఠము మీద దహనబలిని, నైవేద్యమును అర్పించి పైకెగయు సువాసనాభరితహోమముగా సమర్పించెను.

30. యావే మోషేను ఆజ్ఞాపించినట్లు అతడు బలిపీఠమునకు గుడారమునకు మధ్య గంగాళము నుంచెను. కాలుచేతులు కడుగుకొనుటకు దానిని నీటితో నింపెను.

31. మోషే, అహరోను, అతని కుమారులు దానియొద్ద కాలుసేతులు కడుగుకొనిరి.

32. ప్రభువు ఆజ్ఞాపించినట్లే వారు గుడారమున ప్రవేశించినపుడుగాని, బలిపీఠమునొద్దకు వచ్చినపుడు గాని కాలు సేతులు కడుగుకొనిరి.

33. గుడారమునకు, బలిపీఠమునకు చుట్టు ఆవరణమును నిర్మించి, దాని ద్వారముకడ తెరను కట్టెను. ఈ రీతిగా మోషే సమస్త కార్యములను ముగించెను.

34. మేఘము సమావేశపు గుడారమును కప్పి వేసెను. ప్రభు తేజస్సు దానిని నింపివేసెను.

35. మేఘము గుడారమునుకప్పుట వలనను, ప్రభువు తేజస్సు దానిని నింపివేయుటవలనను మోషే గుడారమున అడుగు పెట్టలేకపోయెను.

36. మేఘము గుడారము మీది నుండి పైకి లేచినప్పుడుగాని యిస్రాయేలీయులు ఒక విడిది నుండి మరియొక విడిదికి పయనము కట్టెడివారు కారు.

37. మేఘము పైకి లేవనిచో వారు విడిదినుండి కదలెడివారుకారు. అది పైకిలేచువరకు కనిపెట్టుకొని యుండెడివారు.

38. పగలు ప్రభుమేఘము గుడారముపై నిలిచెడిది. రేయి ఆ మేఘమునుండి నిప్పు వెలిగెడిది. యిస్రాయేలీయులు విడిదినుండి విడిదికి పయనము చేసినంత కాలము, ఆ మేఘమును, ఆ నిప్పును చూచుచునే ఉండిరి.