ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Exodus 39

1. గుడారమున పరిచర్యచేయు యాజకులకు వారు ఊదా, ధూమ్ర, ఎరుపు రంగుల ఉన్నితో విలువైన వస్త్రములు సిద్ధము చేసెను. ప్రభువు మోషేను ఆజ్ఞాపించినట్లే అహరోనునకు పవిత్ర వస్త్రములు తయారుచేసెను.

2. అతడు బంగారముతో, ఊదా, ధూమ్ర, ఎరుపు రంగులుగల ఉన్నితో పేనిన సన్నని దారముతో పరిశుద్ధవస్త్రమును తయారుచేసెను.

3. మేలిమి బంగారుతీగలను కత్తిరించి ఆ ముక్కలను ఊదా, ధూమ్ర, ఎరుపు రంగుల ఉన్నితో సన్నని పేనినదారముతో కళాత్మకమైన అల్లిక పనితో చేర్చి పరిశుద్ధవస్త్రమును తయారు చేసెను.

4. ఆ పరిశుద్ధ వస్త్రమునకు ఇరువైపుల రెండు భుజపాశములు అమర్చెను. వానితో దానిని యాజకుని భుజములకు తగిలింప వీలుగా నుండెను.

5. ఆ వస్త్రముతో కలిపి కుట్టిన నడికట్టుకూడ బంగారముతో ఊదా, ధూమ్ర, ఎరుపు రంగులుగల ఉన్నితో పేనిన సన్ననిదారముతో తయారుచేయబడెను. ప్రభువు మోషేను ఆజ్ఞాపించిన రీతిగనే దానిని చేసెను.

6. రెండు లేతపచ్చలను తయారుచేసి వానిని బంగారమున పొదిగించెను. యిస్రాయేలు కుమారుల నామములను వానిమీద ముద్రలవలె చెక్కించెను.

7. ప్రభువు మోషేను ఆజ్ఞాపించినట్లుగనే ఆ లేతపచ్చలను ఎఫోదు అనబడు పరిశుద్ధవస్త్రపు భుజపాశములతో చేర్చి కుట్టించెను. వానిని చూచి ప్రభువు యిస్రాయేలీ యులను స్మరించుకొనెడివాడు.

8. అతడు ఎఫోదు పరిశుద్ధవస్త్రమువలె కళాత్మకమైన అల్లికపనితో గూడిన వక్షఃఫలకమును కూడ తయారుచేసెను. దానిని బంగారముతో, ఊదా, ధూమ్ర, ఎరుపు రంగులుగల ఉన్నితో పేనిన సన్నని దారముతో తయారుచేసెను.

9. ఆ వక్షఃఫలకమును చదరముగా చేసి రెండు మడతలుగా నడిమికి మడచగ దాని పొడవు తొమ్మిది అంగుళములు, వెడల్పు తొమ్మిది అంగుళములు ఉండెను.

10. ఆ ఫలకము మీద నాలుగు వరుసలుగా మణులను తాపించెను. మొదటి వరుసలో కురువిందము, పద్మరాగమణి, గరుడపచ్చ ఉండెను.

11. రెండవ వరుసలో మరకతము, కెంపు, నీలమణి ఉండెను.

12. మూడవ వరుసలో వజ్రము, సూర్యకాంతము, గోమేధికము ఉండెను.

13. నాలుగవ వరుసలో సులేమానురాయి, చంద్రకాంతము, వైఢూర్యము ఉండెను, ఈ మణులనన్నిటిని బంగారమున పొదిగించెను.

14. ఈ పండ్రెండు రత్నములమీద యిస్రాయేలు కుమారుల పేర్లు చెక్కబడియుండెను. ఒక్కొక్కరత్నముమీద ఒక్కొక్క తెగ పేరు ముద్రితమైయుండెను.

15. వక్షఃఫలకమునకు దారపు ముడులవంటి మెలికలు కలిగిన బంగారు గొలుసులు చేయించెను.

16. రెండు జిలుగు బంగారు జవ్వలను, రెండు బంగారు ఉంగరములను చేయించి వానిని వక్షఃఫలకము మీది అంచులకు తగిలించెను.

17. రెండు బంగారు గొలుసులను గూడ చేయించి వానిని ఒక వైపున రెండు ఉంగరములకు తగిలించిరి.

18. మరియొక వైపున రెండు రవ్వలకు తగిలించిరి. ఈ రీతిగా ఆ గొలుసులను ఎఫోదు అనబడు పరిశుద్ధవస్త్రపు ఉపరిభాగమున ఉండు భుజపాశముల మీద తగిలించిరి.

19. మరి రెండు బంగారు ఉంగరములు చేయించి వానిని ఎఫోదు పరిశుద్ధవస్త్రమునకు దాపున, వక్షఃఫలకమునకు క్రిందిభాగమున, దాని లోపలివైపున ఇమిడ్చిరి.

20. ఇంకను రెండు బంగారు ఉంగరములను చేయించి వానిని ఎఫోదు పరిశుద్ధవస్త్ర భుజపాశములకు ముందు, క్రింది భాగమున తగిలించిరి. ఈ ఉంగరములు అల్లిక పనిగల పరిశుద్ధవస్త్రపు నడికట్టుకు పైగా దాని కూర్పునొద్ద ఉండెను.

21. ప్రభువు మోషేను ఆజ్ఞాపించినట్లే వక్షఃఫలకమును దాని ఉంగరములకును, పరిశుద్ధవస్త్రపు ఉంగరములకును ఊదాసూత్రముతో బిగియగట్టిరి. దాని ఫలితముగా వక్షఃఫలకము వదులై జారిపోక నడికట్టుకు పైగా నిలిచెడిది.

22. యాజకుడు ఎఫోదు పరిశుద్ధవస్త్రము తొడుగుకొను నిలువుటంగీని అతడు ఊదా ఉన్నితో తయారుచేసెను.

23. దాని నడుమ తలదూర్చు రంధ్రము ఉంచెను. ఈ రంధ్రముచుట్టు, తోలు అంగీ మెడకు కుట్టినట్లుగా, అది చినుగకుండునట్లు నేత వస్త్రమును గట్టిగాకుట్టెను.

24. అంగీ క్రిందిఅంచుచుట్టు ఊదా, ధూమ్ర, ఎరుపురంగుల ఉన్నితో పేనిన సన్నని దారముతో దానిమ్మపండ్లు కుట్టించెను.

25. వాని నడుమ బంగారు గజ్జలు అమర్చెను.

26. ప్రభువు మోషేను ఆజ్ఞాపించినట్లుగనే అంగీ క్రిందియంచు చుట్టు దానిమ్మపండ్లు, గజ్జెలు ఒక్కొక్కటి వరుసగా వ్రేలాడుచుండెను.

27. అతడు అహరోనునకు అతని కుమారులకు చక్కని నారబట్టతో చొక్కాలను తయారుచేసెను.

28. తలపాగాలు, టోపీలు, లోవస్త్రములను గూడ మంచి నారబట్టతో సిద్ధము చేసెను.

29. ప్రభువు మోషేను ఆజ్ఞాపించినట్లే పేనిన సన్ననిదారముతో, ఊదా, ధూమ్ర, ఎరుపురంగుల ఉన్నితో, అల్లికపనితో నడి కట్టును తయారుచేసెను.

30. మేలిమి బంగారముతో పతకమును చేయించి దానిమీద “ప్రభువునకు నివేదితము” అను అక్షరములు చెక్కించెను.

31. ప్రభువు మోషేను ఆజ్ఞాపించినట్లే ఆ పతకమును తలపాగా మీద పెట్టి ఊదా దారముతో కట్టించెను.

32. ఈ రీతిగా సమాగమపు గుడారము పని యంతయు ముగిసెను. ప్రభువు మోషేను ఆజ్ఞాపించి నట్లే యిస్రాయేలీయులు ఎల్లపనులు చేసి ముగించిరి.

33. గుడారము, కప్పు, పరికరములు, కొక్కెములు, చట్రములు, అడ్డుకఱ్ఱలు, స్తంభములు, దిమ్మెలు,

34. ఎఱ్ఱని అద్దకము వేసిన గొఱ్ఱెతోళ్ళు, నాణ్యమైన గట్టి తోళ్ళు, మందసము ఎదుటితెర,

35. సాక్ష్యపు శాసన ముల పలకలుగల మందసము, దానిమీద కరుణా పీఠము, మోతకఱ్ఱలు,

36. రొట్టెలనుంచుబల్ల, దాని ఉపకరణములు, దేవునికి అర్పించు సముఖపు రొట్టెలు,

37. బంగారపు దీపస్తంభము, దానిమీది దీపములు, దానిపరికరములు, దీపతైలము,

38. బంగారముతో చేయబడిన ధూపపీఠము, అభిషేకతైలము, సువాసన గల సాంబ్రాణి, గుడారపు గుమ్మపు తెర,

39. ఇత్తడి బలిపీఠము, దాని జల్లెడ, మోతకఱ్ఱలు, మిగిలిన పరికరములు, గంగాళము దాని పీట,

40. ఆవరణపు తెరలు, స్తంభములు వాని దిమ్మెలు, ఆవరణ ద్వారపు తెర, దాని త్రాళ్ళు, మేకులు, గుడారమున పరిచర్య చేయుటకు వలయు పరికరములు.

41. పరిశుద్ధ స్థలమున పరిచర్యచేయు యాజకులకు వస్త్రములు అనగా యాజకుడు అహరోనునకు ప్రతిష్ఠిత వస్త్రములు, అతని కుమారులు తాల్చు వస్త్రములు, వీనినన్నిటిని సిద్ధముచేసి యిస్రాయేలీయులు మోషేకడకు కొని వచ్చిరి.

42. ప్రభువు మోషేను ఆజ్ఞాపించినట్లుగనే యిస్రాయేలీయులు అన్ని పనులుచేసి ముగించిరి.

43. మోషే వారు తయారుచేసిన వస్తువులనన్నిటిని పరీక్షించి చూచెను. అవి అన్నియు ప్రభువు ఆజ్ఞాపించినట్లే చేయబడియుండెను. కనుక మోషే వానినన్నిటిని ఆశీర్వదించెను.