ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Exodus 34

1. ప్రభువు మోషేతో “నీవు మొదటి పలకల వంటి రెండు రాతిపలకలను చెక్కుము. మొదటి పలకలమీద వ్రాసిన ఆజ్ఞలను మరల వానిమీద వ్రాసెదను. నీవు ఆ తొలిపలకలను పగులగొట్టితివి గదా!

2. నీవు సంసిద్ధుడవై రేపటి ఉదయముననే కొండమీదికి రమ్ము. కొండపైన నన్ను కలిసికొనుము.

3. నీతో మరెవ్వరును కొండయెక్కి రాగూడదు. అసలు కొండమీద ఎవరును కనిపింపగూడదు. గొఱ్ఱెల మందలుగాని, పశువుల మందలుగాని కొండ ఎదుట మేయరాదు” అని చెప్పెను.

4. కనుక మోషే మొదటి పలకల వంటి రాతిపలకలను రెండింటిని తయారు చేసెను. ప్రభువు ఆజ్ఞాపించినట్లుగనే వానిని తీసికొని మరునాటి ఉదయమున పెందలకడనే కొండమీదికి ఎక్కిపోయెను.

5. ప్రభువు మేఘమునుండి దిగి వచ్చి మోషే యెదుట నిలుచుండి తన నామమును వెల్లడి చేసెను.

6. ప్రభువు మోషేకు ముందుగా సాగిపోవుచు ఇట్లు ప్రకటించెను. “ప్రభువు! ప్రభువు! ఆయన కరుణామయుడు దయాపరుడునైన దేవుడు. సులభముగా కోపపడువాడుకాడు. నిత్యము ప్రేమ చూపు వాడు, నమ్మదగినవాడు.

7. ఆయన వేవేలమందికి కృపను చూపుచు దోషములను, అపరాధములను, పాపములను మన్నించువాడు. అయినను ఆయన నరుల పాపమును సహింపడు. తండ్రుల పాపమునకు కుమారులను, ఆ కుమారుల కుమారులను మూడు నాలుగు తరముల వరకు శిక్షించును.”

8. ఆ మాటలు వినినవెంటనే మోషే నేలకు తలవంచి నమస్కరించెను.

9. అతడు “ప్రభూ! నీకు నా యెడల కటాక్షము కలదేని నీవునాతో రమ్ము. ఈ ప్రజలు తలబిరుసువారు! నిజమే. అయినను నీవు మా దోషములను పాపము లను మన్నింపుము. మమ్ము నీ ప్రజగా స్వీకరింపుము” అని మనవిచేసెను.

10. ప్రభువు మోషేతో “నేను మీతో నిబంధనము చేసికొందును. ఈ ప్రపంచమున ఎప్పుడును, ఏ జాతియు కనివిని ఎరుగని మహాద్భుతములు నేను మీ అందరి ఎదుట చేయుదును. నీతోనున్న ఈ ప్రజలెల్లరు ప్రభువు కార్యములను చూచెదరు. నేను మీ ఎదుట చేయునది భీకరమైనది.

11. నేడు నేను మీకిచ్చిన కట్టడలు పాటింపుడు. నేను అమోరీయులను, కనానీయులను, హిత్తీయులను, ఫిలిస్తీయులను, హివ్వీయులను, యెబూసీయులను మీ ఎదుటినుండి తరిమివేయుదును.

12. మీరు ప్రవేశించు దేశము నందలి ప్రజలతో పొత్తు కుదుర్చుకొనకుడు. అటుల పొత్తు కుదుర్చుకొందురేని మీరు వారి ప్రలోభములకు చిక్కుకొందురు.

13. పైపెచ్చు మీరు వారి బలిపీఠములను కూలద్రోయవలయును. వారి విగ్రహములను నాశనముచేసి వారి పవిత్ర కొయ్యస్తంభములను నరికి వేయవలయును.

14. మీరు ఏ అన్యదైవములను ఆరాధింపరాదు. మీ ప్రభువు పేరు 'ఈర్ష్య.' అవును, ఆయన అసూయాపరుడైన దేవుడు.

15. మీకు ఆ దేశవాసులతో పొత్తు పనికిరాదు. ఏలయన ఆప్రజలు వ్యభిచారులవలె తమ దేవతలను ఆరాధించి వారికి బలులు అర్పించునపుడు మిమ్మును ఆహ్వానింపగా మీరును వెళ్ళి వారు అర్పించిన బలులను భుజింతురు.

16. మీరు వారి ఆడుపడుచులను మీ కుమారులకు పెండ్లి చేయగా, ఆ స్త్రీలు తమదేవతలను ఆరాధించునపుడు మీ కుమారులనుగూడ విగ్రహారాధనకు పురికొల్పుదురు.

17. మీరు పోతపోసిన దేవరలను తయారు చేసికొనరాదు.

18. మీరు పొంగనిరొట్టెల పండుగను చేసికొనవలయును. నేను మిమ్ము ఆజ్ఞాపించినట్లు అబీబు మాసమున ఏడునాళ్ళు పొంగనిరొట్టెలు భుజింపవలయును. మీరు ఆ నెలలోనే ఐగుప్తునుండి వెడలి వచ్చితిరి గదా!

19. నరులకుగాని, పశువులకుగాని మొదట పుట్టిన పిల్లలు నాకు చెందవలయును. ప్రతి మొదటి మగబిడ్డయు, పశువుల మందలు, గొఱ్ఱెలమందలు పెట్టిన ప్రతి మొదటి మగదియు నాకు చెందును.

20. గాడిద తొలిపిల్లకు మారుగా గొఱ్ఱపిల్లను అర్పించి ఆ గాడిదపిల్లను విడిపించుకొనవచ్చును, అటుల విడిపింపలేని ఆ గాడిదపిల్ల మెడ విరిచివేయవలయును. మీ తొలిచూలు మగబిడ్డలను గూడ విడిపించు కోవలెను. వట్టి చేతులతో ఎవరును నా సన్నిధికి రాగూడదు.

21. మీరు ఆరునాళ్ళు పనిచేసి ఏడవనాడు విశ్రాంతి తీసికొనుడు. దుక్కులుదున్ను కాలమునందైనను, కోతలుకోయు కాలమునందైనను ఈ నియమమును పాటింపవలయును.

22. మీరు వారములపండుగ అనగా గోధుమ పంట తొలివెన్నులను అర్పించుపండుగను, ఏడాది చివరవచ్చు పంటకూర్చుపండుగను జరుపుకొన వలయును.

23. మీలో మగవారందరును ఏడాదికి మూడు మారులు యిస్రాయేలు దేవుడను, ప్రభుడనైన నా సన్నిధికి రావలయును.

24. నేను మీ శత్రువులను మీ చెంతనుండి తరిమివేయుదును. మీ దేశమును విశాలము చేయుదును. అటుపిమ్మట మీరు ఏటేట మూడుమారులు మీ దేవుడైన ప్రభువు ఎదుట మీరు కనపడబోవునపుడు మీ భూమిని ఎవడును ఆశింపడు.

25. మీరు నాకు పశుబలులు అర్పించునపుడు పొంగిన రొట్టెలు కొనిరాగూడదు. పాస్కపండుగనాడు వధించిన పశువుమాంసమును మరునాటి ఉదయము వరకు అట్టిపెట్టికోకూడదు.

26. మీ భూమియొక్క ప్రథమఫలములలో మొదటివి నీ దేవుడైన ప్రభువు మందిరమునకు కొనిరావలయును. మేకపిల్లను దాని తల్లిపాలలో ఉడుకబెట్టరాదు.”

27. దేవుడైన యావే మోషేతో “నా మాటలను వ్రాయుము. ఈ మాటల ద్వారా నేను నీతోను, యిస్రాయేలీయులతోను నిబంధన చేసికొనుచున్నాను” అనెను.

28. మోషే ప్రభువుతో నలువది పగళ్ళు నలువది రాత్రులు గడిపెను. ఆ రోజులలో అతడు అన్నపానీయము లేవియును ముట్టుకొనలేదు. అతడు పలకమీద నిబంధనవాక్యములు, అనగా పదియాజ్ఞలను వ్రాసెను.

29. మోషే శాసనములుగల రెండు పలకలను గైకొని సీనాయి కొండమీదినుండి దిగివచ్చినపుడు యావేతో మాట్లాడి వచ్చుటవలన అతని ముఖము ప్రకాశించుచుండెను. కాని అతడు దానిని గుర్తింపనే లేదు.

30. అహరోను యిస్రాయేలు ప్రజలు మోషేవైపు చూడగా అతనిముఖము మిలమిల మెరయుచుండెను. కనుక వారు అతనిని సమీపించుటకు భయపడిరి.

31. కాని మోషే పిలువగా అహరోను యిస్రాయేలు నాయకులు అతని చెంతకు వచ్చిరి. మోషే వారితో సంభాషించెను.

32. తరువాత యిస్రాయేలీయులందరు మోషే ఎదుటకు వచ్చిరి. ప్రభువు సీనాయి కొండమీద తనకు విన్పించిన ఆజ్ఞలను అన్నిటిని అతడు ప్రజలకు ఎరిగించెను.

33. మోషే వారితో మాట్లాడుట చాలించిన తరువాత తన ముఖముమీద ముసుగు వేసికొనెను.

34. అతడు యావే సన్నిధిన మాట్లాడుటకు వెళ్ళునపుడెల్ల అటనుండి తిరిగి వచ్చు వరకు ముఖముమీది ముసుగును తొలగించెడి వాడు. తిరిగివచ్చిన పిదప ప్రభువు తనకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను యిస్రాయేలీయులకు తెలియజెప్పెడివాడు.

35. యిస్రాయేలీయులు మోషే ముఖము ప్రకాశించు చుండుటను గమనించెడివారు. అతడు మరల ప్రభువు సన్నిధికి వెళ్ళువరకు ముఖమును ముసుగుతో కప్పు కొనెడివాడు.