ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Exodus 33

1. ప్రభువు మోషేతో "నీవు ఐగుప్తునుండి తోడ్కొని వచ్చిన ఈ ప్రజలతో కదలిపొమ్ము. నేను అబ్రహాము, ఈసాకు, యాకోబులతో వారి సంతతి వారికి యిచ్చెదనని మాటయిచ్చిన భూమికి వారిని నడిపించుకొనిపొమ్ము.

2. నేను నీకు ముందుగా నా దూతనుపంపి కనానీయులను, అమోరీయులను, హిత్తీయులును, పెరిస్సీయులను, హివ్వీయులును, యెబూసీయులను అక్కడినుండి వెడలగొట్టింతును.

3. మీరు పాలు తేనెలు జాలువారు నేలను చేరుకొందురు. కాని నేను మీతో రాను. మీరు తలబిరుసుగల జనులు గనుక నేను కోపించి దారిలోనే మిమ్ము నాశము చేయుదునేమో!” అని పలికెను.

4. ఆ కఠిన మాటలకు ప్రజలు మిగులచింతించి ఆభరణములు తాల్చుటగూడ మానివేసిరి.

5. ప్రభువు మోషేతో “నీవు యిస్రాయేలీయులతో ఇట్లు నుడువుము: మీకు తలబిరుసెక్కువ. నేను కొద్దికాలముపాటే మీతో పయనించినను మిమ్ము వేరంట పెకలించివేయుట నిక్కము. ఇపుడు మీ ఆభరణములు తీసివేయుడు. ఆ మీదట మిమ్ము ఏమి చేయవలయునో నిర్ణయింతును” అని చెప్పెను.

6. కనుక హోరెబు కొండనుండి యిస్రాయేలీయులు తమ ప్రయాణమున ఆభరణములు పెట్టుకొనలేదు,

7. మోషే గుడారమును తీసికొని వెళ్ళి శిబిరమునకు కొంచెము దూరమున పన్ని, అతడు దానికి సమావేశపు గుడారము' అని పేరిడెను. ప్రభువును సంప్రతింపదలచుకొన్నవారు పాళెమునకు వెలుపల నున్న ఆ గుడారమునకు వెళ్ళెడివారు.

8. మోషే గుడారమునకు పోవునపుడెల్ల యిస్రాయేలీయులందరు లేచి తమ తమ గుడారపు గుమ్మముల ముందట నిలుచుండెడివారు. మోషే సమావేశపు గుడారము ప్రవేశించువరకు రెప్పవాల్పకుండ అతని వైపు చూచు చుండెడివారు.

9. అతడు గుడారమున అడుగిడగనే మేఘస్తంభము దిగివచ్చి గుడారపు గుమ్మమున నిలి చెడిది. ప్రభువు మోషేతో మాట్లాడెడివాడు.

10. సమావేశపుగుడారపు గుమ్మమువద్ద మేఘము కనిపింపగనే యిస్రాయేలీయులందరు లేచి నిలుచుండి తమతమ గుడారముల ద్వారమునుండియే వంగి దండము పెట్టెడివారు.

11. నరుడు తన మిత్రునితో సంభాషించునట్లే ప్రభువు మోషేతో ముఖాముఖి సంభాషించెడివాడు. తరువాత మోషే శిబిరమునకు మరలి వచ్చెడివాడు. కాని అతని సేవకుడును నూను కుమారుడును, యువకుడైన యెహోషువ మాత్రము గుడారమును వీడివచ్చెడివాడుకాడు. -

12. మోషే ప్రభువుతో “నీవు నన్ను ఈ ప్రజను నడిపించుకొని పొమ్మనుచున్నావు కాని నీవు నాతో ఎవరిని పంపుదువో తెలుపవైతివి. అయినను నీవు నాతో - 'నేను నిన్ను నీ పేరుతో బాగుగా ఎరుగుదును. నీవు నా అనుగ్రహమునకు పాత్రుడవైతివి', అని పలికితివి.

13. నీవు చెప్పినట్లే నేను నీ దయకు నోచుకొంటినేని, ఈ ప్రజకు నీవేమి చేయగోరెదవో ముందుగనే తెలియజెప్పుము. అప్పుడు నేను నిన్ను అర్ధము చేసికొందును. నీ మన్ననకు పాత్రుడనగుదును. ఈ ప్రజలు గూడ నీవారేగదా!” అనెను.

14. అందులకు ప్రత్యుత్తరముగా ప్రభువు అతనితో “నా సాన్నిధ్యము నీ వెంటవచ్చును. నేను నీకు విశ్రాంతిని ప్రసాదింతును” అనెను.

15. అంతట మోషే “నీ సాన్నిధ్యము నావెంటరాదేని, మమ్ము ఈ తావునువీడి వెళ్ళనీయకుము.

16. నీవు మావెంట రావేని, నేను, ఈ ప్రజ నీ ఆదరమునకు పాత్రులమైతిమని ఎట్లు వెల్లడిఅగును? నీవు మాతో ఉందువేని అపుడు నేనును, ఈ ప్రజలును ఈ ప్రపంచములోని సకలజాతివారికంటెను ధన్యులముగా గణింపబడుదుము” అనెను.

17. ప్రభువు అతనితో “నేను నీవు కోరినట్లే చేయుదును. నీవు నా కటాక్షమునకు నోచుకొంటివి. నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదును” అనెను.

18. మోషే ప్రభువుతో "దయచేసి నీ తేజస్సును చూడనిమ్ము” అని అడిగెను.

19. ప్రభువు అతనితో “నా మంచితనమంతయు నీ యెదుట సాగిపోనిత్తును. 'యావే' అను నా నామమును నీ ఎదుట ఉచ్చరింతును. నేను నా ఇష్టము వచ్చిన వారిని కటాక్షింతును ఎవనియందు కనికరపడెదనో వానిని కనికరింతును” అని పలికెను.

20. మరియు ప్రభువు అతనితో “కాని నీవు నా ముఖమును చూడజాలవు. ఏ నరుడును నన్నుచూచి బ్రతుకజాలడు.

21.ఇదిగో! ఇట నా ప్రక్క ఒక స్థలమున్నది. నీవు ఈ తావున బండమీదికెక్కి నిలుచుండుము.

22. నా తేజస్సు నీ ముందట సాగిపోవునపుడు నిన్ను ఈ బండనెరియలో దాచి యుంచి, నిన్నుదాటి సాగిపోవువరకు నిన్ను నాచేతితో కప్పియుంతును.

23. అటు తరువాత నా చేతిని తొలగింతును. నీవు నా ముఖమును దర్శింపజాలవు. నా వెనుకతట్టు మాత్రము కనుగొందువు” అని చెప్పెను.