ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Exodus 31

1-2. ప్రభువు మోషేతో “నేను యూదా తెగకు చెందిన హురు మనుమడును, ఊరి కుమారుడగు బేసలేలును ఎన్నుకొంటిని.

3. నేను అతనిని దైవాత్మతో నింపితిని. కనుక అతనికి సుందరమైన వస్తువులను చేయునేర్పు, సామర్థ్యము, తెలివితేటలు లభించును.

4. అతడు సుందరమైన వస్తువుల నమూనాలను తయారు చేసికొని వానిని బంగారముతో, వెండితో. ఇత్తడితో రూపొందింపగలడు.

5. రత్నములను సాన పెట్టి బంగారమున పొదుగగలడు. కొయ్యపై బొమ్మలు చెక్కగలడు. ఈ రీతిగా సుందర వస్తువులన్నిటిని తయారుచేయగలడు.

6. దానుతెగకు చెందిన అహీసామాకు కుమారుడగు ఒహోలియాబు బేసలేలునకు తోడైయుండును. మిగిలిన పనివాండ్రకందరికి నా జ్ఞానమును ప్రసాదించితిని. కనుక నేను నీకు ఆజ్ఞాపించిన వస్తువులన్నిటిని వారు సిద్ధముచేయగలరు.

7. సమావేశపుగుడారము, నిబంధన మందసము - దానిమీది కరుణాపీఠము, గుడారపు ఉపకరణములు,

8. బల్ల - దాని ఉపకరణములు, బంగారపు దీపస్తంభము - దాని ఉపకరణములు, ధూపపీఠము,

9. దహన బలులు అర్పించు బలిపీఠము - దాని ఉపకరణములు,

10. ప్రక్షాళనపు గంగాళము - దాని పీట, యాజకుడగు అహరోను, అతని కుమారులు యాజకపరిచర్య చేయునపుడు ధరించవలసిన వస్త్రములు - యాజకుడైన అహరోను యొక్క అమూల్య పరిశుద్ధ వస్త్రములు, అతని కుమారుల వస్త్రములు,

11. అభిషేక తైలము, పరిశుద్ధ స్థలమున వాడు పరిమళపు సాంబ్రాణి మొదలగు. వస్తువులన్నిటిని వారు తయారుచేయుదురు. నేను నిన్ను ఆజ్ఞాపించిన పద్ధతిలోనే వారు ఈ వస్తువులన్నింటిని తయారుచేయవలెను” అనెను.

12. ప్రభువు మోషేతో “యిస్రాయేలీయులను ఇట్లు ఆజ్ఞాపింపుము.

13. 'మీరు నేను నియమించిన విశ్రాంతిదినమును పాటింపవలయును. ప్రభుడనైన నేను మిమ్ము నా ప్రజలుగా చేసికొంటిని అనుటకు ఈ విశ్రాంతిదినము నాకును, మీకును మీ తరతరముల వారికిని మధ్య గుర్తుగా నుండును.

14. కనుక మీరు విశ్రాంతిదినమును పాటింపవలయును. అది మీకు పవిత్రమైనది. దానిని పవిత్రముగా ఎంచని వారందరికి మరణశిక్ష విధింపవలయును. విశ్రాంతి దినమున పనిచేయువారిని సమాజమునుండి వెలి వేయవలయును.

15. మీరు ఆరురోజులు పని చేసికొనవచ్చును. కాని ఏడవరోజు విశ్రాంతిదినము. అది ప్రభువునకు పవిత్రమైనది. ఆ దినమున పనిచేయు వాడు మరణమునకు పాత్రుడగును.

16. యిస్రాయేలీయులు తరతరములవరకు విశ్రాంతిదినమును నిత్యనియమముగా పాటింపవలెను.

17. నాకును యిస్రాయేలీయులకును మధ్య ఈ విశ్రాంతిదినము శాశ్వతచిహ్నముగా ఉండును. ప్రభుడనైన నేను ఆరు రోజులలో భూమ్యాకాశములను సృజించి ఏడవ నాడు పని చాలించి విశ్రమించితిని” అని చెప్పెను.

18. ఈ రీతిగా ప్రభువు సీనాయికొండమీద మోషేతో సంభాషించుట చాలించిన పిదప అతనికి రెండు నిబంధన పలకలను ఇచ్చెను. అవి ప్రభువు స్వయముగా తనవ్రేలితో వ్రాసి యిచ్చిన రాతిపలకలు.