ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Exodus 30

1. ధూపము వేయుటకై తుమ్మ కఱ్ఱతో ఒక పీఠమును తయారుచేయుము.

2. అది చదరముగా ఉండవలయును. దాని పొడవు ఒక మూర, వెడల్పు ఒక మూర, ఎత్తు రెండు మూరలు ఉండవలయును. ఆ పీఠము కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలయును.

3. పీఠము ఉపరిభాగమును, నాలుగు అంచులను, కొమ్ములను అచ్చమైన బంగారురేకుతో పొదుగుము. దానిచుట్టు బంగారపుకట్టు గూడ ఉండ వలయును.

4. దానిని మోసికొనిపోవుటకై రెండు బంగారు కడియములను చేయించి వానిని ఆ కట్టుకు క్రింద ఇరువైపుల అమర్పుము. వానిలోనికి మోత కఱ్ఱలను దూర్చి పీఠమును మోసికొని పోవలయును.

5. ఈ మోతకఱ్ఱలను తుమ్మకఱ్ఱతో చేయించి వానికి బంగారము పొదుగుము.

6. నిబంధన మందసము మీది కరుపీఠము ముందుగల తెరకు ముందట ఈ ధూపపీఠమును ఉంచుము. అక్కడ నేను నిన్ను కలిసికొందును.

7. అహరోను ప్రతిదినము ఉదయము దీపపువత్తులను ఎగద్రోయుటకు వచ్చినపుడు ఈ పీఠముపై కమ్మని సాంబ్రాణిపొగ వేయవలయును.

8. సాయంకాలము దీపములు వెలిగింపవచ్చినపుడు, అతడు పీఠముపై సాంబ్రాణి పొగ వేయవలయును. ఈ రీతిగా మీ తరములన్నింటను నిర్విరామముగా సాంబ్రాణి పొగ వేయవలయును.

9. పీఠముమీద నీవు నిషిద్దమైన సాంబ్రాణిపొగ వేయరాదు. దహించిన పశుబలినిగాని, భోజనబలినిగాని, పానీయబలినిగాని దానిమీద సమర్పింపరాదు.

10. ఏడాదికి ఒకసారి అహరోను ఆ పీఠపు కొమ్ములమీద ప్రాయశ్చిత్తము చేయవలయును, పాపపరిహారముగా సమర్పించిన పశువునెత్తురుతో అహరోను ప్రాయశ్చిత్తము జరుపవలెను. మీ తరతరములకు సంవత్సరమునకొకసారి అతడు దానికొరకు ప్రాయశ్చిత్తము చేయవలయును. ఇది ప్రభువునకు మహాపవిత్రమైనది.”

11. ప్రభువు మోషేతో “నీవు ప్రజల జనాభా వ్రాయించునపుడు ప్రతివాడు తన ప్రాణమునకుగాను ప్రభువునకు పరిహారము చెల్లింపవలయును.

12. ఇట్లు చేసినచో జనాభాలెక్క వ్రాయించినందులకు ప్రజలకు ఏ తెగులును కలుగదు.

13. జనాభాలెక్కలో చేరిన ప్రతివాడును దేవాలయపు తులామానము తూనికచొప్పున అరతులమువెండి చెల్లింపవలయును. ఇది ప్రభువునకు అర్పించు పన్ను.

14. జనాభా లెక్కలో చేరిన ప్రతివాడు, అనగా ఇరువది యేండ్లు మరియు అంతకు పైబడిన ఈడుగల వారందరును ఈ పన్ను చెల్లింపవలయును.

15. మీ ప్రాణములకు పరిహారము గాను ఈ పన్నును యావేకు చెల్లించునపుడు ధనవంతులు ఎక్కువ చెల్లింపనక్కరలేదు. పేదలు తక్కువ చెల్లింపరాదు.

16. ప్రజలనుండి ఈ సొమ్మును ప్రోగు చేసి దానిని గుడారమున కైంకర్యమునకై వినియోగింపుడు. ఈసొమ్ము యావే యిస్రాయేలీయులను స్మరించుకొనునట్లు చేయును. అది మీ ప్రాణములకు గాను చెల్లించిన సొమ్ము” అనెను.

17. ప్రభువు మోషేతో “నీవు ఇత్తడి గంగాళ మును, దానికి ఇత్తడిపీటను చేయింపుము.

18. దానిని నీళ్ళతోనింపి గుడారమునకు, బలిపీఠమునకు మధ్య ఉంచుము.

19. అహరోను అతని కుమారులు దానిలోని నీటితో కాలుసేతులు కడుగుకొందురు.

20. ప్రత్యక్షపు గుడారమున అడుగిడునపుడుగాని, బలిపీఠము మీద అగ్నితో దహనబలులు అర్పించునపుడుగాని ఈ గంగాళములోని నీళ్ళతో కాలుసేతులు కడుగుకొందురేని వారికి ప్రాణహాని కలుగదు.

21. కనుక ప్రాణహాని కలుగకుండవలెనన్న వారు ఈ నీటితో కాలుసేతులు కడుగుకొనవలెను. ఇది యిస్రాయేలీయులు తరతరములవరకు శాశ్వతముగా పాటింప వలసిన నియయము” అని చెప్పెను.

22. ప్రభువు మోషేతో “నీవు మంచి సుగంధ ద్రవ్యములు తీసికొనుము.

23. ఐదువందల తులముల పరిమళద్రవ్యము, రెండువందలయేబది తులముల లవంగిపట్ట, రెండువందలయేబది తులముల నిమ్మగడ్డి, ఐదువందలతులముల మొద్దు లవంగిపట్టను తీసికొనుము.

24. ఈ దినుసులన్నియు దేవాలయపు తులామానము తూకమునకు సరిపోవలయును. ఐదువందల దేవాలయ ప్రామాణిక షెకెల్ ల   ఓలివు నూనె గూడ వానికి చేర్పుము.

25. వీనినన్నిటిని కలిపి సుగంధ ద్రవ్యకారులు తయారు చేసినట్లుగనే సుగంధ తైలమును సిద్ధముచేయుడు. ఇది పవిత్రమైన సుగంధితైలము.

26. దీనితో నీవు సాన్నిధ్యపుగుడారమును, నిబంధనమందసమును,

27. బల్లను, దాని పరికరములను, దీపస్తంభమును, దాని పరికరములను, ధూప పీఠమును

28. దహనబలులు అర్పించు బలిపీఠమును, దాని ఉపకరణములను, గంగాళమును, దానిపీటను అభిషేకింపుము.

29. ఈ రీతిగా నీవు ఈ వస్తువులను ప్రభువునకు నివేదింపుము. అవి మహాపవిత్ర వస్తువులగును. వానిని తాకిన వస్తువులు కూడ పవిత్రమగును.

30. అహరోనును అతని కుమారులనుగూడ ఈ సుగంధతైలముతో అభిషేకించి నాకు నివేదింపుము. అపుడు వారు నాకు కైంకర్యముచేయు యాజకులు అగుదురు.

31. నీవు యిస్రాయేలీయులతో “మీ తరములన్నింటను అభిషేకమునకైవాడు ఈ సుగంధతైలము మహాపవిత్రమైనదిగా ఉండవలయును.

32. దానితో సామాన్య జనమును అభిషేకింపరాదు దానితో మరియొక సుగంధతైలమును తయారు చేయరాదు. అది పవిత్రమైనది గనుక మీరు దానిని పవిత్రవస్తువుగనే భావింపవలయును.

33. ఈ సుగంధ తైలమువంటి తైలమును తయారుచేయు వారును, యాజకులు కానివారిని దీనితో అభిషేకము చేయువారును సమాజమునుండి వెలివేయబడుదురు' అని చెప్పుము” అనెను.

34. ప్రభువు మోషేతో “నీవు జటామాంసి, గోపీచందనము, గంధము, సుగంధ ద్రవ్యములు, అచ్చమైన సాంబ్రాణి, జిగురు సమపాళ్ళలో తీసికొని

35. సుగంధి ద్రవ్యకారులు చేయు రీతిగనే సాంబ్రాణిని తయారుచేయుము. దానిలో ఉప్పు కలుపవలయును. అది నిర్మలముగను, పవిత్రముగను ఉండవలయును.

36. దానిలో కొంతభాగమును మెత్తగా నలుగగొట్టి, పిండిచేసి ఆ పిండిలో కొంతభాగమును గుడారమున నిబంధన మందసమునెదుట నేను నిన్ను కలిసికొను తావున ఉంచుము. ఈ సాంబ్రాణి పరమపవిత్రమైనది.

37. మీ ఉపయోగార్థము ఇదే పాళ్ళతో మరియొక సాంబ్రాణిని తయారు చేసికొనరాదు. ఇది ప్రభువునకు అర్పించిన పవిత్రమైన సాంబ్రాణి.

38. ఈ సాంబ్రాణి వంటి సుగంధ ద్రవ్యములను తయారు చేయువాడు సమాజమునుండి వెలివేయబడును” అని చెప్పెను.

Copyright © 2025 Telugu Catholic Bible All Rights Reserved | Website Designed by HyderHub Web Services