ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Exodus 24

1. ఆయన మోషేతో “నీవు, అహరోను, నాదాబు, అబీహు, యిస్రాయేలీయుల డెబ్బదిమంది పెద్దలును నా కడకురండు. మీరు దూరముగనే ఉండి నాకు సాగిలపడుడు.

2. మోషే ఒక్కడే యావే దరికి రావలయును. మిగిలినవారు దూరముగ ఉండవలయును. ఇతర ప్రజ అతనితో కొండయెక్కిరాగూడదు” అని చెప్పెను.

3. మోషే యిస్రాయేలీయుల కడకు వెళ్ళి యావే చేసిన నియమములను, చెప్పిన విధులను వారికి వివరించెను. దానికి వారందరు ఒక్కగొంతుతో “యావే చెప్పిన నియమములన్నిటిని మేము పాటింతుము” అని పలికిరి.

4. మోషే యావే చేసిన నియమములన్నిటిని లిఖించెను. మరునాటి ప్రొద్దుట కొండపాదు దగ్గర బలిపీఠమును నిర్మించెను. యిస్రాయేలీయుల పన్నెండుతెగలకు గుర్తుగా పండ్రెండు శిలలను ఎత్తెను.

5. అప్పుడు మోషే దహనబలులు సమర్పించుటకు, సమాధానబలులుగా కోడెలను వధించుటకు, యిస్రాయేలీయులలో పడుచువాండ్రను కొంతమందిని పంపెను.

6. మోషే కోడెల నెత్తురులో సగము పళ్ళెములో పోసి, మిగిలిన సగమును బలిపీఠముపై చల్లెను.

7. అతడు నిబంధన గ్రంథమును చదివి యిస్రాయేలీయులకు వినిపించెను. వారు “యావే శాసనములెల్ల మేము అనుసరింతుము. మేము ఆయనకు విధేయులమై ఉందుము” అని అనిరి.

8. అప్పుడు మోషే పళ్ళెము లోని నెత్తురు యిస్రాయేలీయుల మీద ప్రోక్షించి “యావే మీకు ఈ నియమము ప్రసాదించుచు మీతో చేసికొనిన నిబంధనమునకు సంబంధించిన రక్తము ఇదియే” అనెను.

9. అహరోను, నాదాబు, అబీహులతో మరియు డెబ్బదిమంది యిస్రాయేలు పెద్దలతో మోషే కొండమీదికి వెళ్ళెను.

10. వారు యిస్రాయేలు దేవుని చూచిరి. ఆయన పాదములక్రింద ఆకాశమండలము వలె వెలుగుచున్న నీలమణి ఫలకము ఉండెను.

11. యావే ఆ యిస్రాయేలు ప్రముఖులకు ఏ హానియు చేయలేదు. వారు దేవుని చూచిరి. భోజనముచేసి పానీయములు సేవించిరి.

12. యావే మోషేతో "కొండమీదికి వచ్చి నన్ను కలిసికొనుము. నేను నియమములను ధర్మశాస్త్రమును రాతిఫలకముపై వ్రాసి నీకిచ్చెదను. నీవు యిస్రాయేలీ యులకు వానిని బోధింపుము” అనెను.

13. అంతట మోషే, అతని సేవకుడగు యెహోషువ ఇద్దరును లేచి దేవునికొండకు వెళ్ళిరి.

14. మోషే యిస్రాయేలీయుల పెద్దలతో “మేము తిరిగి మీకడకు వచ్చువరకు ఇక్కడనే వేచియుండుడు. అహరోను, హూరు మీ దగ్గరనే ఉందురు. మీ తగవులు తీర్చుకొనుటకు వారి దగ్గరకు వెళ్ళుడు” అని చెప్పెను.

15. పిదప మోషే కొండ మీదికి వెళ్ళెను. మేఘము కొండను క్రమ్మెను.

16. యావే తేజస్సు సీనాయి కొండమీద నిలిచెను. ఆరు రోజులపాటు మేఘము కొండను క్రమ్మెను. ఏడవనాడు యావే మేఘము మధ్యనుండి మోషేను పిలిచెను.

17. యావే తేజస్సు కొండకొమ్మున ప్రజ్వరిల్లుచున్న అగ్నివలె యిస్రాయేలీయుల కన్నులకు కనబడెను.

18. మోషే సరాసరి మేఘమున ప్రవేశించెను. అతడు కొండయెక్కి నలువది పగళ్ళు నలువది రాత్రులుండెను.

Copyright © 2025 Telugu Catholic Bible All Rights Reserved | Website Designed by HyderHub Web Services