ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Exodus 19

1. ఐగుప్తుదేశమునుండి బయలుదేరిన మూడునెలలకు, మూడవ నెల మొదటిదినమందే యిస్రాయేలీయులు సీనాయి అరణ్యమునకు వచ్చిరి.

2. వారు రెఫీదీమునుండి ముందునకు సాగిరి. సీనాయి ఎడారి చేరుకొనినపిదప అచ్చటనే కొండకు ఎదురుగా విడిదిచేసిరి.

3. మోషే కొండనెక్కి దేవునికడకు వెళ్ళెను. దేవుడు కొండనుండి అతనిని పిలిచి “నా ఈ మాటలను యాకోబు సంతతియగు యిస్రాయేలీయులకు వెల్ల డింపుము.

4. 'నేను ఐగుప్తుదేశీయులను ఏమిచేసితినో మీరు కనులార చూచితిరి. గరుడపక్షి తన పిల్లలను రెక్కలమీద మోసికొనిపోవునట్లే నేనును మిమ్ము మోసికొనివచ్చి నా కడకు చేర్చుకొంటినని మీకు బాగుగ తెలియును.

5. దీనిని బట్టి మీరొకటి గమనింపుడు. మీరు నామాటవిని నా నిబంధనను శ్రద్ధగా పాటించినచో సకలజాతుల వారిలో మీరే నావారు, నా సొంత ప్రజలు అగుదురు. ఈ భూమండలమెల్ల నాదేకదా?!

6. మీరే నాకు యాజక రూప రాజ్య ము. మీరే నా పవిత్ర ప్రజ' యిస్రాయేలీయులతో నీవు చెప్పవలసిన మాటలు ఇవియే” అనెను.

7. కనుక మోషే వెళ్ళి యిస్రాయేలు పెద్దలందరిని పిలిపించెను. యావే చెప్పుమన్నమాటలెల్ల వారితో చెప్పెను.

8. అప్పుడు యిస్రాయేలీయులందరును ఒక్కగొంతుతో “యావే చెప్పినదంతయు మేము చేయుదుము” అనిరి. మోషే తిరిగి వెళ్ళి యిస్రాయేలీ యుల మాటలను యావేకు విన్నవించెను.

9. యావే మోషేతో “నేను కారుమబ్బులో వత్తును. అట్లయినచో నేను నీతో మాట్లాడుట యిస్రాయేలీయులు జాతిని తన ప్రజగా ఎన్నుకోవచ్చుననుట. అందరు విని ఎల్లప్పుడు నిన్ను నమ్ముదురు” అనెను. మోషే ప్రజల మాటలను యావేకు తెలిపెను.

10. యావే మోషేతో “నీవు యిస్రాయేలీయుల కడకు వెళ్ళి నేడు, రేపు వారిని శుద్ధపరచుము. వారు వారి దుస్తులను ఉతుకుకొనవలయును. 

11. మూడవ నాటికి అందరు సిద్ధముగా ఉండవలయును. మూడవ నాడు ఎల్లరు చూచుచుండగ యావే సీనాయి కొండ మీదికి దిగివచ్చును.

12. నీవు కొండకు హద్దులు ఏర్పరచి వారితో 'జాగ్రత్త! ఎవ్వరును కొండ ఎక్కరాదు. కొండ మొదలు తాకరాదు. ఎవ్వడైనను కొండను ముట్టుకొన్నచో, వానికి చావుమూడును.

13. ఎవ్వడును కొండను చేతితో తాకరాదు. తాకినది మనుష్యుడు కావచ్చు, జంతువుకావచ్చు. ఎవ్వరైనను రాళ్ళతోగాని, బాణములతోగాని కొట్టబడుదురు. తాకిన వారెవ్వరు బ్రతుకరు' అని చెప్పుము. కొమ్ముబూర సుదీర్ఘంగా మ్రోగినప్పుడే వారందరు కొండచెంతకు రావలయును” అనెను.

14. మోషే కొండదిగి ప్రజలకడకు వచ్చెను. అతడు వారిని శుద్ధిచేసెను. వారు దుస్తులు ఉతుకు కొనిరి.

15. అప్పుడు మోషే వారితో “మూడవ నాటికి సిద్ధముగా నుండుడు. స్త్రీని సమీపింపకుడు” అని హెచ్చరించెను.

16. మూడవనాడు ప్రొద్దుపొడువగనే కొండమీద ఉరుములు ఉరిమెను. మెరుపులు మెరిసెను. కారు మబ్బులు క్రమ్మెను. పెద్దనాదముతో కొమ్ముబూర మ్రోగెను. విడుదులలో యిస్రాయేలీయులందరును వణకిపోయిరి.

17. అప్పుడు మోషే దేవుని కలిసి కొనుటకు యిస్రాయేలీయులను విడుదుల నుండి కొనిపోయెను. వారందరు కొండ అంచున నిలబడిరి.

18. యావే అగ్నిరూపమున సీనాయి కొండమీదికి దిగివచ్చుటచే దానిని పొగ చుట్టుముట్టెను. కొలిమి పొగవలె కొండనుండి పొగ పైకిలేచెను. కొండ అంత దద్దరిల్లెను.

19. కొమ్ముబూరఘోత ఉన్న కొలది పెద్దదయ్యెను. మోషే మాట్లాడెను. దేవుడతనికి ఉరుములతో జవాబు చెప్పెను.

20. యావే పర్వతశిఖరము మీదికి దిగివచ్చెను. ఆయన మోషేను కొండకొమ్మునకు రమ్మనెను. మోషే కొండమీదికి ఎక్కిపోయెను.

21. యావే మోషేతో “వెళ్ళి ప్రభువును చూచుటకు ఎవ్వరును హద్దులు దాటి ముందునకు రాగూడదని యిస్రాయేలీయులను హెచ్చరింపుము. వచ్చినచో ఎంతోమంది చచ్చిపోదురు.

22. యావే కడకువచ్చు యాజకులు సైతము శుద్ధి చేసికొనవలయును. అటులకానిచో యావే వారిమీద విరుచుకొనిపడును” అనెను.

23. దానికి మోషే “యిస్రాయేలీయులలో ఎవ్వరును కొండ ఎక్కిరారు. కొండకు హద్దులు ఏర్పరచి పవిత్రమైన దానినిగా చాటింపుము అని నీవు ముందుగానే హెచ్చరించితివి గదా!” అనెను.

24. యావే మోషేతో “కొండ దిగిపొమ్ము. పోయి అహరోనును నీతో పాటు కొనిరమ్ము. ప్రభువును చూచుటకై యాజకులనుగాని, యిస్రాయేలీయులనుగాని హద్దుదాటి రానీయకుము. వచ్చినచో యావే వారిమీద విరుచుకొనిపడును” అనెను.

25. మోషే కొండదిగి వెళ్ళి యిస్రాయేలీయులతో ఆ మాటలు చెప్పెను.