ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Exodus 14

1-2. ప్రభువు మోషేతో “మీరు పోవు దారి నుండి వెనుదిరిగి మిలునకు సముద్రమునకు నడుమ, బాల్సెఫోనునకు ఎదురుగా, పీహహీరోతు ముందట, గుడారములు వేసికొనవలయునని యిస్రా యేలీయులతో చెప్పుము. సముద్రమువద్ద ఈ చోటికి ఎదురుగా మీరు విడిదిచేయవలయును.

3. ఫరో రాజు 'చూడుడు. యిస్రాయేలీయులు నా దేశములో చిక్కుబడి ఉన్నారు. ఎడారి వారిని కప్పివేసినది' అని అనుకొనును.

4. అప్పుడు నేను ఫరోరాజు హృదయమును కఠినము చేయుదును. అతడు వారిని వెంటాడును. ఫరోరాజును అతని సైన్యమును చిందరవందర చేసి నేను కీర్తి తెచ్చుకొందును. ఐగుప్తుదేశీయులు నేనే ప్రభుడనని గుర్తింతురు” అని చెప్పెను. యిస్రాయేలీయులు అటులనే చేసిరి.

5. ఐగుప్తు దేశ ప్రభువైన ఫరోకుయిస్రాయేలీయులు  తప్పించుకొనిపోయిరని తెలిసెను. అతడును, అతని కొలువువారును యిస్రాయేలీయుల విషయమున మనసు మార్చుకొనిరి. “బానిసతనమునుండి యిస్రాయేలీయులను ఏల తప్పించుకొని పోనిచ్చితిమి?” అనివారు అనుకొనిరి.

6. వెంటనే ఫరో రథమును సిద్ధముచేయించి, సైన్యమును వెంటతీసికొని బయలు దేరిపోయెను.

7. అతడు శ్రేష్ఠములైన తన ఆరువందల రథములనేగాక ఐగుప్తుదేశమందున్న ఇతర రథములను కూడ వెంట గొనిపోయెను. ప్రతి రథముమీద రౌతులుండిరి.

8. యావే ఐగుప్తుదేశ ప్రభువు ఫరోను కఠినాత్మునిగా చేసెను. అతడు ఎదిరించి వెడలిపోవు యిస్రాయేలీయులను వెన్నాడెను.

9. ఫరో అశ్వబలము, ఆశ్వికులు, రథబలము, కాల్బలము యిస్రాయేలీయులను తరుముచూ పీహహీరోతు సమీపమున బాల్సెఫోనునకు ఎదురుగా సముద్రము ఒడ్డున వారు విడిదిచేసియున్న ప్రదేశమునకు వచ్చెను.

10. ఐగుప్తు దేశీయులు ఫరో రాజుతో తమను వెన్నాడ వచ్చిరని యిస్రాయేలీయులు గుర్తించిరి. వారికి మిక్కిలి భయము కలుగగా యావేకు మొర పెట్టుకొనిరి.

11. యిస్రాయేలీయులు మోషేతో “ఐగుప్తుదేశములో మమ్ము పూడ్చి పెట్టుటకు చోటుకరవైనదా? ఈ ఎడారిలో చచ్చుటకు మమ్ము తరలించుకొని వచ్చితివిగదా? నీవు ఐగుప్తుదేశమునుండి మమ్ము తీసికొని వచ్చి ఒరుగ బెట్టినది ఏమున్నది?

12. మా జోలికిరావలదు. మేము ఐగుప్తుదేశీయులకు చాకిరి చేయుదుము అని ఆ దేశముననున్నప్పుడే చెప్పలేదా? ఇప్పుడు ఈ ఎడారిలో చచ్చుటకంటె ఐగుప్తుదేశీయులకు ఊడిగము చేయుట మేలుగదా?” అనిరి.

13. దానికి మోషే వారితో “భయపడకుడు. గట్టిగా నిలబడుడు. మిమ్ము రక్షించుటకు యావే ఏమిచేయునో మీరు ఈనాడే కన్నులార చూడగలరు. ఈనాడు మీరు చూచుచున్న ఈ ఐగుప్తు దేశీయులను ఇక ముందెన్నడు చూడబోరు.

14. యావే మీ పక్షమున పోరాడును. మీరు కదలక మెదలక ఉండుడు” అనెను.

15. యావే మోషేతో “నీవు నాకు మొరపెట్టనేల? ముందుకు నడువుడని యిస్రాయేలీయులతో చెప్పుము.

16. నీ కఱ్ఱను ఎత్తి సముద్రమువైపు నీ చేతినిచాపి, దానిని పాయలుగా చేయుము. యిస్రాయేలీయులు  సముద్రము నడుమ పొడినేలమీద నడచిపోయెదరు.

17. ఇదిగో, నేను నేనే! ఐగుప్తుదేశీయులను కఠినాత్ములనుగా చేయుదును. అందుచే వారు యిస్రాయేలీయులను తరుముదురు. ఫరోరాజు వలనను, అతని రథ బలమువలనను, అశ్వబలమువలనను, కాల్బలము 'వలనను నాకు నేను మహిమ తెచ్చుకొందును.

18. ఫరోరాజువలనను, అతని రథములవలనను, అశ్వముల వలనను, సైన్యములవలనను నేను మహిమ తెచ్చుకొని నప్పుడే ఐగుప్తుదేశీయులు నన్ను ప్రభువుగా గుర్తింతురు” అని చెప్పెను.

19. అప్పుడు యిస్రాయేలీయుల బలగమునకు ముందు నడుచుచున్న యావేదూత వారి వెనుకకు వచ్చిచేరెను. వారి ముందున్న మేఘస్తంభము కూడ వెనుకకు వచ్చి నిలిచెను.

20. మేఘస్తంభము ఐగుప్తు దేశీయులకు, యిస్రాయేలీయులకు నడుమ ఉండెను. మేఘమువలన చీకటి క్రమ్మెను. అది యిస్రాయేలీయులకు వెలుగును, ఐగుప్తీయులకు చీకటిని కలిగించెను. యిస్రాయేలీయులు తలపడకుండగనే ఆ రాత్రియంతయు గడిచిపోయెను.

21. మోషే సముద్రముమీదికి చేతిని చాచెను. యావే రాత్రియంతయు బలమైన తూర్పుగాలి వీచి సముద్రము వెనుకకు చుట్టుకొనిపోయి సముద్రగర్భము ఆరిపోవునట్లు చేసెను.

22. జలములు విడిపోగా యిస్రాయేలీయులు పొడినేల మీదనే సముద్రగర్భమున ప్రవేశించిరి. వారికి కుడివైపున ఎడమవైపున నీరు గోడలవలె నిలిచిపోయినది.

23. ఐగుప్తుదేశీయులు యిస్రాయేలీయులను తరిమిరి. ఫరోరాజు రథబలము, రౌతులు, గుఱ్ఱములు, యిస్రాయేలీయులను వెన్నంటి సముద్రగర్భమున ప్రవేశించెను.

24. యావే వేకువ జామున ఆ అగ్నిమేఘమయమైన స్తంభమునుండి ఐగుప్తుదేశపు సైన్యమువైపు పారజూచెను. ఆ బలగమును గగ్గోలుపడునట్లు చేసెను.

25. ఆయన చక్రములను ఊడిపడునట్లు చేయగా వారి రథములు ముందుకు కష్టముగా కదిలినవి. “యిస్రాయేలీయులను వదలి పారిపోవుదమురండు. యావేవారికి తోడుగా నిలచి మనతో పోరాడుచున్నాడు” అని ఐగుప్తుదేశీయులు అనుకొనిరి.

26. అప్పుడే యావే మోషేతో “సముద్రము మీదికి నీ చేతిని చాపుము. సముద్రము ఐగుప్తుదేశీయుల రథబలముమీద, రౌతులమీద తిరిగిపారును” అని చెప్పెను.

27. మోషే సముద్రము మీదికి చేతిని చాచెను. ప్రొద్దు పొడుచునప్పటికి సముద్రజలములు యథాస్థలమునకు మరలివచ్చెను. దానిని చూచి ఐగుప్తుదేశీయులు పారిపోజొచ్చిరి. యావే ఐగుప్తు దేశీయులను సముద్ర మధ్యమున పడద్రోసెను.

28. యిస్రాయేలీయులను వెంటాడుచు సముద్రమున ప్రవేశించిన ఫరో సర్వసైన్యమునందలి రథములను, రౌతులను తిరిగివచ్చిన జలములు నిలువున ముంచి వేసెను. ఫరో సైన్యములో ఒక్క పురుగుకూడ బ్రతుక లేదు.

29. కాని యిస్రాయేలీయులు మాత్రము సముద్రములో పొడినేలమీద ముందుకు సాగిపోయిరి. వారికి కుడివైపున ఎడమవైపున నీరు గోడలవలె నిలిచినది.

30. ఆనాడు యావే ఐగుప్తుదేశీయుల బారినపడకుండ యిస్రాయేలీయులను కాపాడెను. యిస్రాయేలీయులు సముద్రతీరముమీద ఐగుప్తు దేశీయుల శవములను చూచిరి.

31. ఐగుప్తుదేశీయులకు వ్యతిరేకముగా యావే ఒనర్చిన ఆ మహాకార్యమును యిస్రాయేలీయులు కన్నులార చూచిరి. వారు యావేకు భయపడిరి. యావేను ఆయన దాసుడగు మోషేను నమ్మిరి.