ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Exodus 1

1. తమతమ కుటుంబములతో యాకోబు వెంట ఐగుప్తు దేశమునకు వెళ్లిన యిస్రాయేలీయుల పేర్లివి:
2. రూబేను, షిమ్యోను, లేవి, యూదా,
3. ఇస్సాఖారు, సెబూలూను, బెన్యామీను,
4. దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు.
5. యాకోబు సంతతివారు మొత్తము దెబ్బది మంది. అంతకు ముందే యోసేపు ఐగుప్తు దేశమున ఉండెను.
6. కొంత కాలముకు యోసేపు, అతని సోదరులు, వారితరము వారందరు మరణించిరి.
7. యిశ్రాయేలీయులు పెక్కు మంది బిడ్డలను కని లెక్కకు మిక్కుటముగా పెరిగిరి. వారు అసంఖ్యాకముగా పెరిగి విస్తరిల్లి ప్రబలులైరి. నేల యీనినట్లు ఎక్కడ చూచిన యిశ్రాయేలీయులే.
8. అప్పుడు యోసేపు పుట్టు పూర్వోత్తరాలు తెలియని ఒక క్రొత్తరాజు ఐగుప్తు దేశమున సింహాసనమునకు వచ్చెను.
9. ఆ రాజు తన పరిజనులతో "ఈ యిశ్రాయేలీయుల సంతతి మనకంటె విస్తారమై బలిష్టముగానున్నది.
10. వారు ఇక ముందు పెరగకుండు నట్లు మనము కనుగలిగి నడచుకొనవలెను. కానిచో, యుద్దములు వచ్చినపుడు వారు మన శత్రువుల పక్షమున చేరి మనల నెదిరింతురు. మన దేశము నుండి తప్పించుకొని పారిపోయెదరు" అనెను.
11. ఆ మాటలను బట్టి రాజాధికారులు యిశ్రాయేలీయులచే వెట్టిచాకిరి చేయించి, వారిని అణద్రొక్కుటకై, వారి మీద దాసాధ్యక్షులను నియమించిరి. ఈ విధముగా యిస్రాయేలీయులు ఫరోరాజునకు, గిడ్డంగులుండు నగరములైన పీతోమును, రామెసేసును నిర్మించిరి.
12. అణచివేసి, రాచిరంసాన పెట్టిన కొలది, యిస్రాయేలీయులు నూరంతలుగా పెరిగి విస్తరిల్లిరి. ఐగుప్తు దేశీయులు యిస్రాయేలీయులను చూచి చీదరించుకొనిరి; వారికి భయపడిరి.
13. వారు నిర్ధాక్షిణ్యముగా యిస్రాయేలీయులను బానిసలుగా చేసిరి.
14. వెట్టిచాకిరితో ఇటుక పనులు, మట్టి పనులు, అన్నిరకముల పొలము పనులను చేయించి, వారి బ్రతుకును భరింపరానిదిగా చేసిరి . బండపనులన్నిటిని వారి నెత్తిన రుద్దిరి.
15. తరువాత ఐగుప్తు రాజు షీప్రా, పూవా అను హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడెను.
16. "మీరు హెబ్రీయ స్త్రీలకు కాన్పుచేయునపుడు వారికి, ఏ బిడ్డ పుట్టునో కనుకలిగి ఉండుడు. మగపిల్లవాడైనచో వెంటనే చంపుడు. ఆడుపిల్లమైనచో ప్రాణములతో వదలుడు" అని చెప్పెను.
17. కాని, మంత్రసానులు దైవభీతి కలవారు. కనుక, వారు రాజాజ్ఞలను మీరిరి. పుట్టిన మగపిల్లలను చంపరైరి.
18. అందుచేత, ఐగుప్తు రాజు మంత్రసానులను పిలిపించి 'మీరీ పని ఏల చేసితిరి? మగపిల్లలనేల ప్రాణములతో వదలితిరి?" అని అడిగెను.
19. "ప్రభూ! హెబ్రీయ స్త్రీలు, ఐగుప్తు స్త్రీలవంటివారు కాదు. వారు బలము కలవారు. మంత్రసాని రాక ముందే సులభముగా ప్రసవింతురు" అని చెప్పిరి.
20. దేవుడు ఆ మంత్రసానులపట్ల కనికరము చూపెను. యిశ్రాయేలీయులు పెరిగి పెరిగి మహా శక్తిమంతులైరి.
21. మంత్రసానులు దేవుని నమ్ముకొన్నవారు అగుటచే, ఆయన వారి వంశములను కూడ నిలిపెను.
22. అంతట, ఫరోరాజు "హెబ్రీయులకు పుట్టిన మగ పిల్లలను నైలు నదిలో పారవేయుడు. ఆడ పిల్లలను మాత్రము బ్రతుకనిండు" అని తన ప్రజల నాజ్ఞాపించెను.