ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

యెహోషువ 7

1. కాని యిస్రాయేలీయులు శాపమును లక్ష్య పెట్టక దోషముచేసిరి. యూదా తెగవాడును సెరా మునిమనుమడును, సబ్ది మనుమడును, కర్మీ కుమారుడునైన ఆకాను శపింపబడిన వస్తువులు కొన్నిటిని తీసికొనెను. అందుచే యావే యిస్రాయేలీయులపై కోపించెను.

2. అప్పుడు యెహోషువ బేతేలునకు తూర్పు దిక్కున నున్న 'హాయి' అను పురమునకు పోయి వేగు నడిపి రండని ఇద్దరు మనుష్యులను యెరికో నుండి పంపించెను. వారు హాయి అను పురమునకు పోయి వేగునడపి యెహోషువ యొద్దకు తిరిగివచ్చిరి.

3. “ప్రజలందరు వెళ్ళనక్కరలేదు. రెండు, మూడు వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొనవచ్చును. శత్రువుల సంఖ్య స్వల్పము. సైన్యమంతయు శ్రమపడి అక్కడి వరకు పోనక్కరలేదు” అని చెప్పిరి.

4. మూడువేల మంది ప్రజలు హాయి పట్టణమును పట్టుకొనుటకు వెళ్ళిరి. కాని వారు హాయి వీరుల ముందు నిలువజాలక పారిపోయిరి.

5. హాయి ప్రజలు వారిలో ముప్పదియారు మందిని మట్టుపెట్టిరి. మిగిలినవారిని నగర ద్వారమునుండి షేబారీము పల్లము వరకు తరిమి మోరాదు వద్ద సంహరించిరి. అప్పుడు ప్రజల గుండె చెదరిపోయెను.

6. అప్పుడు యెహోషువ తన వస్త్రములు చించుకొనెను. అతడును, యిస్రాయేలీయుల పెద్దలును తమ తలలపై దుమ్ముపోసికొని చీకటి పడువరకు యావే మందసము ముందట సాష్టాంగపడియుండిరి.

7. “అయ్యో ప్రభూ! యావే! నీవు ఈ ప్రజలను యోర్దాను నది ఏల దాటించితివి? అమోరీయులచేతికి అప్పగించి నాశనము చేయుటకా? మేము యోర్దాను నదికి ఆవలి తీరముననే స్థిరపడియుండిన ఎంత బాగుండెడిది.

8. ప్రభూ! యిస్రాయేలీయులు శత్రువునకు వెన్ను చూపిరిగదా! ఇక ఇప్పుడేమనగలను?

9. కనానీయులు, ఈ దేశవాసులందరును ఈ సంగతి విందురు. వారందరు ఒక్కటై మమ్ము ఎదురింతురు. నేల మీది నుండి మా పేరు తుడిచివేయుదురు. నీ పేరు నిలుపు కొనుటకు నీవిక ఏమి చేయుదువు?” అని ప్రార్థించెను.

10. యావే యెహోషువతో “లెమ్ము! ఇట్లు బోరగిలబడియుండనేల? యిస్రాయేలీయులు పాపము చేసిరి. నేను చేసిన నిబంధనను వారు అతిక్రమించిరి.

11. శపింపబడిన వస్తువులు దొంగిలించి దాచుకొని తమ సరకులలో కలుపుకొనిరి.

12. కావుననే యిస్రాయేలీయులు శత్రువులముందు నిలువలేకపోయిరి. శాపవస్తువులను ముట్టి తామును శాపమునకు గురియైరి. అందుచే శత్రువులకు వెన్నుచూపిరి. శాపగ్రస్తులైనవారు మీ మధ్యనుండకుండ మీరు వారిని సంహరించిననే తప్ప నేను మీకు తోడైయుండను.

13. లెమ్ము! ప్రజలను శుద్దీకరించి వారితో ఈ విధముగా చెప్పుము. 'రేపు మీరందరును శుద్ధిచేసి కొనుడు. ఇప్పుడు మీ మధ్య శాపగ్రస్తులైనవారు ఉన్నారు. మీరు ఈ శాపగ్రస్తులను సంహరించిననే తప్ప మీ శత్రువులను ఎదుర్కొనలేరు అని యావే యిస్రాయేలీయులకు సెలవిచ్చుచున్నాడు' అని చెప్పుము.

14. కావున వేకువజామున తెగల క్రమము బట్టి మీరు ముందుకు రావలయును. యావే సూచించు తెగవారు వంశక్రమమున ముందుకు రావలయును. యావే సూచించు వంశము కుటుంబముల ప్రకారము ముందుకు రావలెను. యావే సూచించు కుటుంబములోని పురుషుల వరుస ప్రకారము ఒక్కొక్కరు ముందుకు రావలెను.

15. అప్పుడు శపింపబడిన వస్తువును దొంగిలించినవాడిని తన వారితో కలిపి అగ్నిలో కాల్చి వేయవలయును. ఏలయన, అతడు యావే నిర్ణయమును మీరి యిస్రాయేలీయులలో దుష్కార్యము చేసెను” అని పలికెను.

16. యెహోషువ ఉదయముననే లేచి యిస్రాయేలీయులను వారి తెగల వరుస ప్రకారము చెంతకు రప్పించినపుడు యూదా తెగ పట్టుబడెను.

17. యూదా తెగను వంశముల ప్రకారము చెంతకు రప్పించినపుడు సెరా వంశము చిక్కెను. సెరా వంశములోని కుటుంబములను చెంతకు రప్పించినపుడు సబ్ది కుటుంబము దొరకెను.

18. సబ్ది కుటుంబములోని పురుషులను వరుసగా చెంతకు రప్పించినపుడు యూదా తెగకు చెందిన సెరా మునిమనుమడును, సబ్ది మనుమడును, కర్మీ కుమారుడునైన ఆకాను పట్టుబడెను.

19. అప్పుడు యెహోషువ "కుమారా! యిస్రాయేలు దేవుడైన యావేను స్తుతించి గౌరవింపుము. నీవేమి చేసితివో దాచక నాతో చెప్పుము” అని ఆకానును అడిగెను.

20. అంతట ఆకాను “యిస్రాయేలు దేవుడైన యావే ఎడల నేను పాపముచేసిన మాట నిజమే. నేను చేసిన తప్పు ఇది.

21. దోపిడి వస్తువులందు ఒక మంచి షీనారు ఉత్తరీయమును, రెండువందల తులముల వెండిని, ఏబది తులముల ఎత్తుగల బంగారు కమ్మిని చూచి ఆశించి దొంగిలించితిని. వాటిని నా గుడారమునందు భూమిలో పాతిపెట్టితిని. వెండి కూడ వాటి క్రిందనే ఉన్నది” అని యెహోషువతో చెప్పెను.

22. అతడు మనుష్యులను పంపెను. వారు ఆ డేరా దగ్గరకు పరుగెత్తుకొనిపోయిరి. ఉత్తరీయము దాచబడియుండెను. వెండి ఆ వస్త్రము క్రింద ఉండెను.

23. వారు డేరా మధ్యనుండి వాటిని తీసుకొని యెహోషువ, యిస్రాయేలీయులు సమావేశమైయున్న తావునకు కొనివచ్చి యావే సాన్నిధ్యమున ఉంచిరి.

24. అప్పుడు యెహోషువ సెరా కుమారుడగు ఆకానును, ఆ వెండిని, ఆ ఉత్తరీయమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, అతనికి చెందిన ప్రతి వస్తువును ఆకొరు లోయలోనికి కొనిపోయెను. యిస్రాయేలీయులును యెహోషువతో వెళ్ళిరి.

25. యెహోషువ “నీవు మాకెంత శ్రమ కలిగించితివి! యావేగూడ నేడు నిన్ను శ్రమ పెట్టునుగాక!” అనెను. అంతట యిస్రాయేలీయులందరు అతనిని రాళ్ళతో కొట్టి, తదుపరి అగ్నితో కాల్చివేసిరి.

26. అతని మీద పెద్ద రాళ్ళగుట్టను పేర్చిరి. అది నేటికిని ఉన్నది. అప్పుడు యావే కోపము చల్లారెను. నాటినుండి నేటివరకు ఆ తావునకు 'ఆకోరులోయ'' అని పేరు.