ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ద్వితియోపదేశకాండము 4

1. యిస్రాయేలీయులారా! నేడు నేను మీకు బోధించుచున్న చట్టములను, విధులను పాటింపుడు. అట్లు చేయుదురేని మీరు బ్రతుకుదురు. మీ పూర్వుల దేవుడైన ప్రభువు మీకొసగిన నేలను స్వాధీనము చేసికొందురు.

2. మీ దేవుడైన యావే ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుటయందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటలతో మీరు ఏమియును చేర్చరాదు. వానినుండి ఏమియును తొలగింపరాదు. నేను నిర్దేశించిన ప్రభువు ఆజ్ఞలను ఉన్నవానిని ఉన్నట్లుగా అనుసరింపుడు.

3. బాలు పెయోరు కొండ వద్ద ఏమి జరిగినదో మీ కంటితోనే చూచితిరిగదా! అచట బాలు పెయోరును ఆరాధించిన వారినందరిని ప్రభువు నాశనము చేసెను.

4. కాని నిండుహృదయముతో ప్రభువును అనుసరించిన వారందరు నేటికిని బ్రతికి యున్నారు.

5. ప్రభువైన దేవుడు నన్నాజ్ఞాపించినట్లే నేను మీకు అతని విధులను, చట్టములను బోధించితిని. మీరు ఆక్రమించుకొని స్వాధీనము చేసికొనబోవు నేలమీద ఈ ఆజ్ఞలన్నిటిని పాటింపుడు.

6. మీరు ఈ విధులన్నిటిని అనుసరింతురేని ఇతరజాతులు మీరెంత వివేకవంతులో, ఎంతవిజ్ఞానవంతులో గుర్తింతురు. వారు ఈ విధులనుగూర్చి విన్నపుడు ఈ మహాజాతికి ఇంతటి వివేకము, విజ్ఞానము అబ్బినదిగదా! అని విస్తుపోవుదురు.

7. ఔనుమరి! మనదేవుడు పిలువగానే పలుకును. ఏ జాతిజనులకైనను, ఎంత గొప్పజాతి జనులకైనను వారి దేవుడు మనదేవునివలె చేరువలో నున్నాడా?

8. ఏ జాతికైనను, ఎంత గొప్పజాతికైనను నేను ఈనాడు మీకు వినిపించిన న్యాయబద్ధమైన విధులవంటి ఆజ్ఞలు, చట్టములు కలవా?

9. కాని జాగ్రత్త! ఆనాడు మీరు కన్నులార గాంచిన అంశములను మరువకుడు. జీవితాంతము వానిని జ్ఞప్తియుంచుకొనుడు. వానిని మీ కుమారులకు, మనుమలకు గూడ తెలియజేయుడు.

10. నాడు మీరు హోరేబు కొండచెంత మీ దేవుని సమక్షమున నిలుచుండి యుంటిరి. అప్పుడు ప్రభువు నాతో 'నీవు ప్రజలను ప్రోగుజేయుము. వారికి నా ఆజ్ఞలను బోధింతును. ఈ నేలమీద జీవించినంతకాలము వారు నాకు విధేయులై ఉండవలయును. వారు నాకు భయపడవలయునని తమ బిడ్డలకుగూడ బోధింప వలయును' అని పలికెను.

11. అప్పుడు మీరెల్లరు కొండదిగువన నిలువబడియుంటిరి. ఆ కొండమీద దట్టమైన కారుమబ్బులు క్రమ్ముకొనియుండెను. అది ఆకాశము వరకు నిప్పులు క్రక్కుచుండెను.

12. ఆ నిప్పుమంటల నడుమనుండి ప్రభువు మీతో సంభా షించెను. మీరు ప్రభువు సంభాషణధ్వని వింటిరిగాని ఏ రూపమును మీరు చూడలేదు, స్వరమును మాత్రమే వింటిరి.

13. అప్పుడు ప్రభువు తన నిబంధనమును మీకు ప్రకటించెను. మీరు ఆ ఒడంబడికను అనగా పది ఆజ్ఞలను పాటింపవలయునని ఆజ్ఞాపించెను. ఆ ఆజ్ఞలను ఆయన రెండు రాతిపలకల మీద వ్రాసి ఇచ్చెను.

14. మీరాక్రమించుకొని స్వాధీనము చేసికొన బోవు నేలమీద ఈ విధులను, చట్టములను పాటించునట్లుగ నేను మీకు బోధింపవలయునని ప్రభువు కట్టడ చేసెను.

15. ఆనాడు ప్రభువు హోరేబు కొండమీది నిప్పు మంటల నడుమ నుండి మీతో మాటాడినపుడు మీరు ఏ రూపమును చూడరైతిరి. కనుక జాగ్రత్త వహింపుడు.

16-18. మీరెట్టి ఆకారముతోనైన విగ్రహములను చేసి పాపము మూటగట్టుకొనకుడు. స్త్రీ పురుషులు, భూమిమీది జంతువులు, ఆకాశమున ఎగురుపక్షులు, నేలమీద ప్రాకు పురుగులు, నీటిలో సంచరించు చేపలు- వేని విగ్రహములను చేయకుడు.

19. మీరు ఆకాశమున కన్పించు సూర్యచంద్రనక్షత్రాదులకు భ్రమసిపోయి వానికి ఆరాధనలర్పించి సేవలు చేయ రాదు. ప్రభువు వాని ఆరాధనను భూమిమీది నానా జాతులకు వదలివేసెను.

20. కాని మిమ్ము మాత్రము అతడు ఐగుప్తుదేశమున ఇనుప కొలిమినుండి తరలించు కొనివచ్చెను. ఎందుకో తెలియునా? మీరు ఈనాడు అయినట్లుగా అతని సొంత ప్రజలగుట కొరకే.

21. మీ కార్యములను బట్టి ప్రభువు నామీద మండిపడెను. నేను యోర్దాను దాటననియు ప్రభువు మీకొసగబోవు సారవంతమైన నేలమీద అడుగుపెట్టననియు ఆయన శపథము చేసెను.

22. నేను యోర్ధాను దాటకుండా, ఈ దేశముననే కన్ను మూయుదును. మీరు మాత్రము యోర్ధాను దాటి ఆ సారవంతమైన నేలను భుక్తము చేసికొందురు.

23. కనుక జాగ్రత్త! మీ ప్రభువు మీతో చేసికొనిన ఒడంబడికను విస్మ రింపకుడు. ఆయన నిషేధించిన విగ్రహములను, రూపములను చేయకుడు.

24. ఏలయన, మీ ప్రభువైన యావే దహించివేయు అగ్నివంటివాడు, అసూయాపరుడైన ' దేవుడు.

25. మీరు ఆ నేలమీద చాలకాలము వసించి కుమారులను, మనుమలను కన్నపిదప కూడ ఏ ఆకారముతోనైనను విగ్రహములనుచేసి పాపము కట్టుకొనకుడు. ఇది ప్రభువు సహింపని దుష్కార్యము కనుక మీరతని కోపమును రెచ్చగొట్టుదురు.

26. మీరు ఈ ఆజ్ఞను పాటింపరేని నాశనమైపోయెదరని భూమ్యాకాశములను సాక్ష్యముగా పిలిచి చెప్పుచున్నాను. మీరు యోర్ధానునకు ఆవలివైపున స్వాధీనము చేసికొన బోవు భూమిపై ఎక్కువకాలము మనజాలరనియు, మొదలంట నాశనమై పోవుదురనియు ప్రమాణము చేసి చెప్పుచున్నాను.

27. ప్రభువు మిమ్ము అన్యదేశ ములలో ఇతరజాతులనడుమ చెల్లాచెదరుచేయును. మీలో కొద్దిమంది మాత్రమే అట మిగులుదురు.

28. అచట నరుల చేతిపనియైన రాతి, కొయ్యవిగ్రహములు న్నవి కదా! చూచుటకును, వినుటకును, భుజించుట కును, వాసన చూచుటకును ఆ బొమ్మలకు శక్తిలేదు. మీరు గూడ వానిని సేవింపవలసియుండును.

29. అక్కడి నుండి మీరు మీ ప్రభువైన దేవునికొరకు వెదకుదురు. కాని పూర్ణహృదయముతో వెదకుదురేని ఆయనను కనుగొందురు.

30. నేను పేర్కొనిన కష్టము లన్నియు వాటిల్లును. మీకు బాధలు సంభవించగ చిట్టచివరకు మీరు ప్రభువునొద్దకు తిరిగివచ్చి ఆయన మాటవిందురు.

31. మీ ప్రభువైన దేవుడు కనికరము గల దేవుడు. కాబట్టి మిమ్ము చేయివిడువడు, నాశనము చేయడు. మీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనమును విస్మరింపడు.

32. భూతకాలమును, మీ పుట్టుకకు ముందటి కాలమును, దేవుడు నరుని సృజించిన ఆదికాలమును పరిశీలింపుడు. నేల నాలుగుచెరగులు గాలించినను ఇంతటి మహావాక్కు ఎందైనగలదా? ఇంతటి మహా భాషణము ఎందైన వినిపించినదా?

33. మీరు తప్ప మరి ఏ జాతియైనను నిప్పుమంటల నడుమనుండి తమ దేవుడు మాట్లాడగా విని ఇంతవరకు బ్రతికి యున్నదా?

34. ఏ దేవుడైన ఒక జాతి నడుమనుండి మరియొక జాతిని తరలించుకొనివచ్చెనా? కాని మీరు కన్నులార చూచుచుండగనే మీ దేవుడు శోధనలతోను, సూచకక్రియలతోను, అద్భుతములతోను, యుద్ధముతోను, తన బాహుబలముతోను, చాచిన కరముతోను, మహాభయంకర కార్యములతోను మిమ్ము ఐగుప్తునుండి తోడ్కొనివచ్చెను గదా!

35. ప్రభువు తప్ప మరియొక దేవుడు లేడని రుజువుచేయుట కొరకే ఆయన ఈ కార్యములను చేసెను.

36. మీకు ఉపదేశము చేయుటకొరకే ఆయన ఆకాశము నుండి తన భాషణమును వినిపించెను. ఈ భూమిమీద ఆయన మీకు తన మహాగ్నిని చూపించెను. ఆ అగ్నినుండి మీరు ఆయన వాక్కు వింటిరి.

37. ప్రభువు మీ పితరులను ప్రేమించెను. కనుక వారి సంతానమైన మిమ్మునుకూడ చేపట్టెను. స్వయముగా తన మహాబలముతో మిమ్ము ఐగుప్తు నుండి తోడ్కొనివచ్చెను.

38. మీరు బయల్వెడలివచ్చినప్పుడు మీకంటె సంఖ్యావంతులును, శక్తిమంతులునైన జాతులను ఆయన మీ ఎదుటనుండి తరిమివేసి వారి దేశములను మీకిచ్చెను. నేటికి మీరు వానిని అనుభవించుచున్నారు.

39. కనుక నేడు ఈ సత్యమును బాగుగా గుర్తించి హృదయమున నిలుపుకొనుడు. మీది ఆకాశము నగాని, నేల మీదగాని, క్రిందగాని యావేయే దేవుడు గాని మరియొక దేవుడు లేడు.

40. నేను ఆదేశించినట్లుగనే మీరు ఆయన ఆజ్ఞలను, చట్టములను పాటింపుడు. అప్పుడు మీకును, మీ తరువాతి సంతానమునకును క్షేమము కలుగును. ప్రభువు మీకు భుక్తము చేయనున్న నేలమీద మీరు దీర్ఘాయుష్మంతులై కలకాలము వర్థిల్లుదురు.”

41. అంతట మోషే యోర్దానునకు తూర్పున మూడు పట్టణములు ప్రత్యేకించెను.

42. ఎవడైన తన పొరుగువాని పై పగలేకయే వానిని యాదృచ్ఛికముగా చంపినయెడల ఈ పట్టణములకు పారిపోయి అచట తలదాచుకొనవచ్చును.

43. ఆ పట్టణములివి: రూబేను తెగల ఎడారి పీఠభూములలోని బేసేరు, గాదు తెగల గిలాదు మండలములోని రామోతు, మనష్షే తెగల బాషాను మండలమునందలి గోలాను.

44. మోషే యిస్రాయేలీయులకు ఇచ్చిన ధర్మ శాస్త్రము ఇది.

45. యిస్రాయేలీయులు ఐగుప్తునుండి వెడలివచ్చిన తరువాత మోషే వారికి నిర్దేశించిన విధులు, చట్టములు ఇవి.

46. వారు యోర్ధాను నదికి తూర్పున లోయలో బెత్పెయోరు నగరముచెంత ఉన్నప్పుడు అతడు ఈ కట్టడలు చేసెను. ఈ నగరము హెష్బోనున పరిపాలనము చేసిన అమోరీయరాజగు సీహోను దేశమునగలదు. మోషే, యిస్రాయేలీయులు ఐగుప్తునుండి వెడలి వచ్చినప్పుడు ఈ రాజును ఓడించిరి.

47. యిస్రాయేలీయులు సీహోను దేశమునే గాక బాషాను రాజగు ఓగు దేశమునుగూడ స్వాధీనము చేసికొనిరి. ఇతడు మరియొక అమోరీయరాజు. యోర్డానునకు తూర్పున రాజ్యము చేయుచుండెడి వాడు.

48. వారు స్వాధీనముచేసికొనిన దేశము అర్నోను నది అంచుననున్న అరోయేరు పట్టణము నుండి ఉత్తరమున సిర్యోను అనగా హెర్మోను కొండ వరకు వ్యాపించియుండెను.

49. మరియు యోర్దానునకు తూర్పున నున్న భాగముకూడ మృతసముద్రము వరకును, పిస్గా కొండలవరకును ఈ దేశముననే చేరియుండెను.