ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ద్వితియోపదేశకాండము 3

1. తదనంతరము ఉత్తర దిక్కుగా నడచి బాషాను మండలము చేరుకొంటిమి. అప్పుడు ఆ దేశమునేలు రాజు ఓగు బాషాను జనమును ప్రోగుజేసికొనివచ్చి ఎడ్రెయి వద్ద మనలను ఎదిరించెను.

2. ప్రభువు నాతో 'నీవు ఇతనికి భయపడవలదు. ఈ రాజును, ఇతని ప్రజలను, దేశమును మీ వశముచేసితిని. హెష్బోనున వసించిన అమోరీయ ప్రభువు సీహోనును వలె ఇతనిని గూడ ఓడింపుము' అని చెప్పెను.

3. ఆ రీతిగా ప్రభువు ఓగురాజును అతని జనులందరిని మన చేతికి చిక్కించెను. మనము ఒక్కరిని మిగిలింపక అందరిని వధించితిమి.

4. ఒక్కదానిని కూడ వదలి పెట్టకుండ వారి పట్టణములన్నిటిని పట్టుకొంటిమి. అవి అన్నియు కలిసి అరువది నగరములు. అవి యర్గోబు సీమలోనున్నవి. బాషాను రాజగు ఓగు పరిపాలించినది అచటనే.

5. అవియన్నియు సురక్షిత పట్టణములు. వాటికి ఎత్తయిన ప్రాకారములు, కవాటములు, ఆ కవాటములకు లోపలినుండి బిగించుటకు గడియలు కలవు. ఇదిగాక అరక్షిత పట్టణములు చాల కలవు.

6. హెష్బోను రాజగు సీహోను నగరములవలె ఈ పట్టణములను గూడ శాపము పాలుచేసి, నాశనము చేసితిమి. అందలి స్త్రీ, పురుషులను, పిల్లలను చంపితిమి.

7. ఆ నగరములను దోచుకొని అచటి పశువులమందలను తోలుకొనివచ్చితిమి.

8. ఆ రీతిగా మనము ఇద్దరు అమోరీయ రాజుల నుండి యోర్దాను తూర్పుసీమను వశము చేసికొంటిమి. ఆ నేల అర్నోనునది అంచునుండి హెర్మోను కొండ వరకు వ్యాపించియున్నది.

9. (ఈ కొండనే సీదోనీయులు సిర్యోను అని, అమోరీయులు సెనీరు అని పిలుచుదురు.)

10. పీఠభూమిలోని నగరములన్నిటిని, గిలాదు అంతటిని, ఓగు రాజు ప్రధాన పట్టణములైన సల్కా ఎద్రెయిల వరకు వ్యాపించియున్న బాషాను రాజ్యమును అంతటిని మనము జయించితిమి.

11. (ఓగురాజు రేఫా జాతిలో చివరివాడు. అతనికి ఇనుముతో చేసిన పడకమంచము కలదు. ప్రామాణికమైన కొలమానము ప్రకారము దాని పొడవు తొమ్మిది మూరలు. వెడల్పు నాలుగుమూరలు. అమోరీయులకు చెందిన రబ్బా నగరమున నేటికిని దానిని చూడవచ్చును.)

12. అర్నోనులోయ అంచులలోని అరెయోరు పట్టణమునకు ఉత్తరదిక్కున గల భాగమును, గిలాదు కొండభాగము సగమును ఆ సమయమున ఆక్రమించుకొంటిమి. నేను గిలాదు పీఠభూమిలో సగమును, అందలి పట్టణములను రూబేను, గాదు తెగలకిచ్చితిని.

13. మనష్షే అర్ధతెగకు గిలాదున మిగిలిన భాగమును, ఓగు రాజు దేశమైన బాషానును ఇచ్చితిని. అర్గోబు సీమను, బాషానును కలిపి రేఫా మండలమని పిలిచెడి వారు.

14. గెషూరు, మాకా సరిహద్దుల వరకుగల అర్గోబు మండలమునంతటిని మనష్షే వంశజుడైన యాయీరు స్వాధీనము చేసికొనెను. అతడు అచటి నగరములన్నిటికి తన పేరు పెట్టెను. కనుక నేటికిని అవి యాయీరునగరములు అనియే పిలువబడుచున్నవి.

15. మనష్షే తెగవాడైన మాకీరునకు నేను గిలాదును ఒసగితిని.

16. రూబేను, గాదు తెగలకు గిలాదు నుండి అర్నోను నదివరకు విస్తరించియున్న దేశమును ఇచ్చితిని. ఈ నది మధ్యభాగమే వారికి దక్షిణపు సరిహద్దు. ఉత్తరపు సరిహద్దు యబ్బోకు నదివరకును, అమ్మోనీయుల పడమటి సరిహద్దు వరకును ఉన్నది.

17. పశ్చిమమున యోర్దానునది వారికి సరిహద్దు. మరియు వారి నేల ఉత్తరమున కిన్నెరతు మొదలుకొని తూర్పుదిక్కున పిస్గా కొండచరియల దిగువగా దక్షిణమున మృతసముద్రము వరకు ఉన్న అరాబా ప్రదేశమున వ్యాపించియుండెను.

18. ఆ సమయమున నేను మీతో ఇట్లు చెప్పితిని. 'యోర్దానుకు తూర్పునగల ఈ దేశమును ప్రభువు మీకు స్వాధీనము చేసెను. మీలో యుద్ధము చేయగలవారందరును ఆయుధములు చేపట్టి తోటి యిస్రాయేలీయుల కంటెను ముందుగాపోయి నదిని దాటుడు.

19. మీ భార్యలు, పిల్లలు, మందలు మాత్రము నేను మీకొసగిన నగరములలోనే ఉండ వచ్చును. మీకు చాలమందలున్నవని నేనెరుగుదును.

20. ప్రభువు యోర్దానునకు పశ్చిమముననున్న దేశమును మీ తోటియిస్రాయేలీయులకు ఇచ్చెను. మీరు ఈ ప్రదేశమున ఉన్నట్లే వారుకూడ ఆ నేలను ఆక్రమించుకొని అచట సుఖముగా స్థిరపడువరకు మీరు వారికి సహాయము చేయవలయును. ఆ పిమ్మట నేను మీకిచ్చిన ఈ దేశమునకు మీరు తిరిగి రావచ్చును.'

21. తదనంతరము నేను యెహోషువతో “ప్రభువు ఆ ఇద్దరు రాజులకు ఏమిచేసెనో నీవు కన్నులార చూచితివి గదా! మీరు వెళ్ళుచున్న దేశముల రాజులకుగూడ ఆయన అదేగతి పట్టించును.

22. కనుక మీరు ఆ రాజులకు భయపడవలదు. మీ ప్రభువు మీ పక్షమున వారితో పోరాడును' అని చెప్పితిని.

23-24. అంతట నేను యావేతో 'ప్రభూ! నీ మహత్తును, బలమును ఈ దాసునకు తెలియజేయ బూనితివి. నీవు చేసిన మహాకార్యములు, అద్భుతములు చేయగల దేవుడు భూమ్యాకాశములందు ఒక్కడును లేడు.

25. ప్రభూ! నన్ను యోర్దాను దాటి సారవంతమైన ఆవలినేలను కన్నులార చూడనిమ్ము. పర్వతములతో అలరారు ఆ సుందరదేశమును ఆ లెబానోను కొండలను తనివితీరచూడనిమ్ము' అని మొరపెట్టుకొంటిని.

26. కాని మీ మూలముగా ప్రభువు నామీద మండిపడి నా మొరవినడయ్యెను. ఆయన 'ఓయి! నీ వేడికోలు ఇకచాలు! ఈ సంగతి నా యెదుట మరలఎత్తవద్దు.

27. నీవు పిస్గా కొండనెక్కి పడమరవైపు, ఉత్తరము వైపు, దక్షిణమువైపు, తూర్పువైపును పరికింపుము. ఆ దేశమును జాగ్రత్తగా పరిశీలించి చూడుము. నీవు మాత్రము యోర్ధాను దాటిపోజాలవు.

28. నీవు యెహోషువకు ఉపదేశము చేయుము. అతనికి ప్రోత్సాహము కలిగించి బలపరుపుము. ప్రజలను నడిపించు కొనిపోయి నీవు చూచిన ఈ నేలను వారిచే ఆక్రమింప చేయువాడు అతడే' అని పలికెను.

29. అపుడు మనము బేత్పేయోరు నగరమెదుట లోయలో దిగియుంటిమి.