ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

న్యాయాధిపతులు 2

1. యావేదూత గిల్గాలునుండి బోకీమునకు వచ్చి యిస్రాయేలీయులతో “నేను మిమ్ము ఐగుప్తు నుండి నడిపించుకొని వచ్చితిని. మీ పితరులకు వాగ్దానము చేసిన మీ దేశమునకు మిమ్ము చేర్చితిని. నేను మీతో చేసికొనిన నిబంధనమును మీరను అని మాట ఇచ్చితిని.

2. మీ మట్టుకు మీరు ఈ దేశీయులతో నిబంధనము చేసికోగూడదనియు వారి బలిపీఠములను కూలద్రోయవలెననియు ఆజ్ఞాపించితిని. కాని మీరు నా మాట పెడచెవిని పెట్టితిరి. ఇట్లు చేయనేల?

3. ఇక నా నిర్ణయమును ఆలింపుడు. నేను ఈ దేశీయులను మీ యొద్ద నుండి వెళ్ళగొట్టను. వారు మిమ్ము పీడించి పిప్పిచేయుదురు. ఈ దేశీయులు పూజించు దేవతల ఉరులలో మీరు చిక్కుకొందురు” అనెను.

4. యావేదూత ఇట్లు పలుకగా విని యిస్రాయేలీయులు పెద్దపెట్టున విలపించిరి.

5. ఆ తావునకు బోకీము' అని పేరు పెట్టి అచట యావేకు బలులు అర్పించిరి.

6. అంతట యెహోషువ జనులను పంపివేయగా వారు వెడలిపోయి యెవరి వారసత్వ భూమిని వారు స్వాధీనము చేసికొనిరి.

7. యెహోషువ బ్రతికియున్న న్నినాళ్ళు యిస్రాయేలీయులు యావేను కొలిచిరి. యెహోషువ సమకాలికులును, యావే చేసిన మహాకార్యములను కన్నులార చూచిన పెద్దలును బ్రతికియున్నంత కాలము యిస్రాయేలీయులు యావేను సేవించిరి.

8. నూను కుమారుడును యావే దాసుడునగు యెహోషువ నూటపదియేండ్లు జీవించి కన్నుమూసెను.

9. అతనిని గాషు పర్వతమునకు ఉత్తరముగా నున్న ఎఫ్రాయీము కొండసీమలో తిమ్నాత్-సెరా చెంత అతని వారసత్వ భూమియందే పాతి పెట్టిరి. యెహోషువ తరము వారందరు కాలముచేసిరి.

10. అటుతరువాత యావేను గాని, ఆ ప్రభువు యిస్రాయేలీయులకు చేసిన అద్భుత కార్య ములను గాని తెలుసుకోజాలని మరియొక తరముల వారు వృద్ధిచెందిరి.

11. యిస్రాయేలీయులు దుష్టకార్యములు చేసి యావేకు కోపము రప్పించిరి. బాలు దేవతలను పూజించిరి.

12. తమ్ము ఐగుప్తునుండి నడిపించుకొని వచ్చిన పితరుల దేవుడు యావేను విడనాడి, చుట్టు ప్రక్కలనున్న అన్యజాతుల దైవములకు మ్రొక్కి ఆ ప్రభువు కోపమును రెచ్చగొట్టిరి.

13. యావేను విడనాడి బాలు, అష్టారోతు దేవతలను సేవించిరి.

14. యావే మహోగ్రుడై తన ప్రజలను దోపిడిగాండ్ర వశముచేయగా వారు యిస్రాయేలీయులను దోచుకొనిరి. చుట్టుపట్లనున్న శత్రువులవశము చేయగా వారు యిస్రాయేలీయులను అణగదొక్కిరి.

15. యావే తాను ముందుగా వక్కాణించినట్లే ప్రతి యుద్ధము నందును యిస్రాయేలీయులకు వ్యతిరేకముగా నిలచి వారిని ముప్పుతిప్పలు పెట్టెను. అందుచే వారు మిగుల వగచిరి.

16. యావే యిస్రాయేలీయుల మీద న్యాయాధి పతులను నియమించి దోపిడిగాండ పీడనుండి వారిని కాపాడెను.

17. అయినను ఆ ప్రజలు న్యాయాధిపతులను లెక్కచేయక అన్యజాతుల దైవములను ఆరాధించిరి. పూర్వము యావే ఆజ్ఞలకు బద్దులైన పితరులు నడచిన మార్గమునుండి వైదొలగిరి. వారు పూర్వుల సాంప్రదాయములను పాటింపలేదు.

18. యావే యిస్రాయేలీయుల మీద న్యాయాధిపతులను నియమించినపుడు తానును ఆ న్యాయాధిపతికి బాసటయైయుండి అతడు జీవించినంతకాలము ప్రజలను శత్రువుల నుండి కాపాడెను. ఎందుకనగా శత్రువుల రాపిడికి తాళలేక ప్రజలు మొరపెట్టగా యావే వారిని కరుణించెను.

19. కాని ఆ న్యాయాధిపతి చనిపోవగనే ప్రజలు మరల దుష్టకార్యములకు పూనుకొని ముందటితరము వారికంటెను అధికముగా భ్రష్టవర్తనులైపోయిరి. అన్యదైవములకు కైంకర్యము చేసిరి. ఆ రీతిగా యిస్రాయేలీయులు చాలకాలమువరకు తమ చెడు పనులను మాననులేదు, మొండిపట్టును విడనాడనులేదు.

20. కనుక ప్రభువు మహోగ్రుడై “ఈ ప్రజలు మునుపు నేను వీరి పితరులతో చేసిన నిబంధనమును పాటించుటలేదు. నా ఆజ్ఞలను వీరు లెక్కచేయుట లేదు.

21. యెహోషువ చనిపోయినప్పటినుండి ఈ నేలపై మిగిలియున్న అన్యజాతులను ఇక వీరి చెంత నుండి తరిమివేయను” అనుకొనెను.

22. యిస్రాయేలీయులు తమ పితరుల వలె యావే మార్గమును అనుసరింతురో లేదో పరీక్షచేసి తెలిసికొనుటకే ప్రభువు అన్యజాతులను అచ్చట నిలువనిచ్చెను.

23. కనుక నాడు యావే అన్యజాతులను వెంటనే వెళ్ళగొట్టలేదు, వారిని యెహోషువ వశము చేయలేదు.