ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

న్యాయాధిపతులు 1

1. యెహోషువ చనిపోయిన తరువాత యిస్రాయేలీయులు యావేను సంప్రతించి “కనానీయులతో పోరాడుటకు మాలో మొదట ఎవరిని పొమ్మందువు?” అని అడిగిరి.

2. యావే “యూదీయులు' మొదట యుద్ధమునకు పోవలయును. నేను ఆ దేశమును వారి వశముచేసెదను” అని చెప్పెను.

3. యూదీయులు షిమ్యోనీయులతో “మీరు మా నేల మీదికి వచ్చి మాతో పాటు కనానీయులతో పోరాడుడు. అటు తరువాత మేము మీ నేలమీదికి వచ్చి మీ పక్షమున పోరాడెదము” అనిరి.

4. కనుక షిమ్యోనీయులు యూదీయులతో దండువెడలిరి. కనానీయులమీదికి యూదీయులు పోయినపుడు యావే కనానీయులను, పెరిస్సీయులను వారివశము చేసెను. యూదీయులు బేసెకువద్ద శత్రువులను పదివేలమందిని చంపివేసిరి.

5. అచటనే అదోనిసెదెకు అను రాజును ఎదిరించి అతనితో వచ్చిన కనానీయులను, పెరిస్సీయులను చెల్లాచెదరు చేసిరి.

6. అదోనిసెదెకు యుద్ధము నుండి పారిపోవుచుండగా యూదీయులు అతనిని వెంటాడి పట్టుకొనిరి. అతని కాలు చేతులందలి బొటన వ్రేళ్ళను కోసివేసిరి.

7. అదోనిసెదెకు “నేను డెబ్బదిమంది రాజులకు బొటనవ్రేళ్ళు తీయించితిని. వారు నా భోజనశాలవద్ద పడియుండి నేను విసరివేసిన మెతుకులు తిని బ్రతుకు చున్నారు. నేను వారికి చేసినట్లే దేవుడు నాకును చేసెను” అనెను. యూదీయులు అతనిని యెరూషలేమునకు కొనివచ్చిరి. అతడు అచటనే చనిపోయెను.

8. యూదీయులు యెరూషలేమును ముట్టడించి పట్టుకొనిరి. పౌరులను కత్తివాదరకు ఎరజేసి నగరమును కాల్చివేసిరి,

9. అటుతరువాత యూదీయులు కొండలమీద, లోయలలో, ఎడారియందు వసించు కనానీయులతో యుద్ధము చేయబోయిరి. ఆ పిమ్మట హెబ్రోనున వసించు కనానీయులను ఎదిరించిరి.

10. అంతకు ముందు హెబ్రోనునకు కిర్యతార్బా అని పేరు. వారు షేషయి, అహీమాను, తల్మయీలను ఓడించిరి.

11. అచటినుండి దెబీరుపై దాడివెడలిరి. దెబీరునకు పాత పేరు కిర్యత్సేఫేరు.

12. కాలేబు “కిర్యత్సేఫేరును ముట్టడించి పట్టుకొనిన వీరునికి నా కూతురు అక్సాను ఇచ్చి పెండ్లి చేసెదను” అనెను.

13. కాలేబు చిన్న తమ్ముడగు కనసు కుమారుడు ఒత్నీయేలు నగరమును ముట్టడించి పట్టుకొనెను. కాలేబు అతనికి అక్సాను ఇచ్చి వివాహము చేసెను.

14. ఆమె కాపురమునకు వచ్చినపుడు ఒత్నీయేలు మీ తండ్రిని పొలమిమ్మని అడుగుమని ప్రోత్సహించెను. ఆమె గాడిదనుండి దిగి నిలచుండెను. కాలేబు "తల్లీ! నీకేమి కావలయును?” అని అడిగెను.

15. అక్సా తండ్రితో "నాయనా! నాకు ఒక వరమిమ్ము. నన్ను నేగేబు ఎడారిసీమకు పంపితివి. కనుక నీటి బుగ్గలను కూడ దయచేయుము” అనెను. కాలేబు కుమార్తెకు ఎగువ నీటి బుగ్గలను, దిగువ నీటి బుగ్గలను ఇచ్చివేసెను.

16. మోషే మామ కేనీయుడు గదా! అతని సంతతి వారు యూదీయులతో పాటు ఖర్జూరముల నగరము నుండి వెడలిపోయి ఎడారియందలి అరదు వద్ద అమాలెకీయుల చెంత వసించిరి

17. తరువాత యూదీయులు షిమ్యోనీయులతో దండువెడలి కనానీయుల సేఫాత్తును ముట్టడించి శాపముపాలు చేసిరి. అప్పటి నుండి ఆ నగరమునకు హోర్మా అని పేరు వచ్చెను.

18. యూదీయులు గాజా, అష్కలోను, ఎక్రోను పట్టణ ప్రదేశములను పట్టుకొనిరి.

19. యావే తోడ్పాటువలన యూదీయులు యూదా కొండ సీమలను జయించిరి. కాని మైదానములలో వసించు జనులకు ఇనుపరథములు ఉన్నందువలన వారిని వెళ్ళగొట్టలేకపోయిరి. .

20. మోషే సెలవిచ్చినట్లే యిస్రాయేలీయులు హెబ్రోనును కాలేబునకు ఇచ్చిరి. అతడు అనాకు కుమారులు మువ్వురను అచటినుండి తరిమివేసెను.

21. కాని బెన్యామీనీయులు యెరూషలేమున వసించు యెబూసీయులను వెడలగొట్టలేక పోయిరి. వారు నేడును బెన్యామీనీయులతో పాటు యెరూషలేముననే వసించుచున్నారు.

22. యోసేపు వంశీయులు బేతేలు నగరము మీదికి యుద్ధమునకు పోయిరి. యావే వారికి తోడ్పడెను.

23. వారు బేతేలునకు వేగులవారిని పంపిరి. పూర్వము ఆ నగరము పేరు లూసు.

24. వేగుల వాండ్రు పురమునుండి వచ్చు నరునొకనిని చూచి “మాకు నగరము ప్రవేశించు మార్గము తెలియజేసెదవేని నిన్ను చంపక వదలివేసెదము” అనిరి.

25. అతడు వారికి త్రోవ చూపెను. వేగులు పట్టణమున ప్రవేశించి వీరులనందరిని కత్తివాదరకెరచేసిరి. త్రోవచూపిన నరుని, అతని కుటుంబమును మాత్రము వదలిరి.

26. ఆ నరుడు హిత్తీయుల మండలమునకు వెడలి పోయి అచ్చట ఒక నగరము నిర్మించి దానికి లూసు అని పేరు పెట్టెను. నేటికిని దాని పేరు అదియే.

27. మనష్షే వంశీయులు బేత్-షోయాను, తానాకు, దోరు, యిబ్లెయాము, మెగిద్ధో పట్టణములను వాని ప్రాంత గ్రామములను వశపరచుకోలేదు. ఆ ప్రాంతములందు కనానీయుల ప్రాభవము చెల్లుచుండెను.

28. కాని యిస్రాయేలీయులు బలవంతులైన పిదప, కనానీయులను తరిమివేయక పోయినను వారిచే వెట్టి చాకిరిచేయించుకొనిరి.

29. ఎఫ్రాయీము వంశీయులు కనానీయులను గేసేరు నుండి తరిమివేయలేదు. గేసేరులో కనానీయులు వారి మధ్యన నివసించిరి.

30. సెబూలూను వంశీయులు కిత్రోను, నహలోను పట్టణవాసులను వెళ్ళగొట్టలేదు. కనానీయులు సెబూలూను వంశీయుల మధ్య జీవించిరి. కాని వారికి వెట్టిచాకిరి చేసిరి.

31. ఆషేరు వంశీయులు అక్కో, సీదోను, అహ్లాబు, అక్సీబు, ఎల్బా, ఆఫెకు, రహొబు నగరవాసులను పారద్రోలలేదు.

32. ఆషేరు వంశీయులు ఆ ప్రాంతములందు వసించు కనానీయులను వెడలగొట్టక వారిమధ్య నివసించిరి.

33. నఫ్తాలి వంశీయులు బేత్పైమేషు, బేతనాతు పౌరులను వెళ్ళ గొట్టలేదు. కాని ఆ పౌరులచే వెట్టిచాకిరి చేయించు కొనిరి.

34. అమోరీయులు దాను వంశీయులను కొండలలోనికి తరిమికొట్టి క్రింద మైదానమునకు రానీయకుండ అడ్డుపడిరి.

35. అమోరీయులు హరేసు, అయ్యాలోను నందలి హోరేసు కొండలోను, షాల్బీము మండలములలో వసింప గట్టి పట్టుపట్టియుండగా, యోసేపు కుటుంబమువారు వృద్ది చెంది అమోరీయులను అణగదొక్కిరి. వారిచే వెట్టిచాకిరి చేయించుకొనిరి.

36. అమోరీయుల పొలిమేర అక్రాబిమ్ కొండనుండి సేలా కొండమీది భాగముల వరకు వ్యాపించియుండెను.