ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

యెహోషువ 18

1. యిస్రాయేలీయులందరు షిలో వద్ద ప్రోగై సమావేశపు గుడారమును నెలకొల్పిరి. వారు అప్పటికే తమ నేలనంతటిని స్వాధీనము చేసికొనిరి.

2. అయినను యిస్రాయేలీయులలో ఏడుతెగలవారికి ఇంకను వారసత్వభూమి లభింపలేదు.

3. యెహోషువ వారితో “మన పితరులదేవుడైన యావే మీకు అను గ్రహించిన భూమిని స్వాధీనముచేసికొనకుండ ఇంకను ఎంతకాలము జాగుచేసెదరు?

4. ఒక్కొక్క తెగనుండి ముగ్గురు మనుష్యులను ఎన్నుకొనుడు. వారు ఈ నేల నాలుగుచెరగులు పరిశీలించి దానిని ఎట్లు విభజింపవలెనో నిశ్చయించి నా యొద్దకు వచ్చెదరు.

5. వారు ఈ భూమిని ఏడుభాగములుగా విభజింపవలెను. యూదా తెగవారు దక్షిణ భాగమున, యోసేపు తెగ వారు ఉత్తరభాగమున ఉందురు.

6. మీరు ఈ నేలను పరిశీలించి, ఏడుముక్కలుగా విభజించి నాకు వర్తమానము కొనిరండు. నేను ప్రభువు ఎదుట మీకు వంతుచీట్లు వేసెదను.

7. లేవీయులకు మీతోపాటు భాగము లేదు. యావే యాజకులుగా పనిచేయుటయే వారి వారసత్వము. గాదు, రూబేను, మనష్షే అర్ధ తెగవారు యోర్దానునకు ఆవలి దరిని, తూర్పువైపున తమ వారసత్వభూమిని గైకొనిరి. యావే సేవకుడైన మోషే వారికి ఆ భాగమునిచ్చెను” అనెను.

8. అంతట ఆ మనుష్యులు లేచి పయనమైరి, యెహోషువ వారితో “మీరు వెడలిపోయి ఈ దేశము గుండ నడచి, నేలను పరిశీలించి దాని వివరములను వ్రాసి నా యొద్దకురండు. నేను షిలోవద్దనే యావే ఎదుట మీకు చీట్ల ప్రకారము వంతులు వేసెదను” అని చెప్పెను. 

9. ఆ మనుష్యులు వెడలిపోయి నేల నాలుగు ప్రక్కలు గాలించి అందలి పట్టణములన్నిటిని ఏడు పట్టికలుగా వ్రాసి షిలో వద్ద విడిది చేయుచున్న యెహోషువ చెంతకు కొనివచ్చిరి.

10. అతడు షిలో యందే యావే ఎదుట వంతులువేసి యిస్రాయేలీయులలో ఆయా తెగలవారికి భూములు పంచియిచ్చెను.

11. వంతులు వేయగా చీటి చొప్పున వచ్చిన మొదటి వంతు బెన్యామీను కుటుంబములకు లభించెను. వారి భాగము యూదా, యోసేపు తెగలవారి భాగములకు మధ్యనుండెను.

12. వారి ఉత్తరపు సరిహద్దు యోర్దాను నుండి ప్రారంభమై యెరికో ఉత్తరభాగము మీదుగా పోయి పడమటనున్న పీఠభూములను దాటి బెతావెను అరణ్యమును చేరెను.

13. అక్కడి నుండి దక్షిణముగా పోయి లూసు లేక నేటి బేతేలును చేరెను. అక్కడి నుండి క్రిందికి పోయి దిగువనున్న బేత్-హోరోను దక్షిణమునగల కొండమీది అటారోతు-అడ్డారును సమీపించెను.

14. అక్కడినుండి ఆ సరిహద్దు వంకర తిరిగి పడమరగా దక్షిణమునకు మరలి బేత్-హోరోనుకు దక్షిణమున నున్న కొండ వద్దగల కిర్యత్బాలు చెంత ముగిసెను. ఈ కిర్యత్బాలు నగరమే నేడు యూదీయుల అధీనముననున్న కిర్యత్యారీము పట్టణము. ఇది వారి పడమటి సరిహద్దు.

15-16. ఆ సరిహద్దు దక్షిణమున కిర్యత్యారీము నుండి (గాసీను చేరి,) నెఫ్తోవా సరస్సును దాటి, రేఫాయీము మైదానమునకు ఉత్తరమున బెహెన్నోము లోయకు ఎదుటనున్న కొండ దాపునజేరి, యెబూసీయుల సీమకు దక్షిణముననున్న హిన్నోము లోయజొచ్చి, ఎన్-రోగేలు చేరెను.

17-19. అక్కడి నుండి ఉత్తరముగా వంకదిరిగి ఎన్-షెమేషు చేరి, అదుమ్మీము శిఖరమునకు అభిముఖముగాను గిల్గాదు చేరెను. రూబేను కుమారుడు బోహాను శిల వరకును క్రిందికి దిగి బేత్-హరాబా ఉత్తర అంచున ఉన్న కెటేపు చేరి బేత్-హోగ్లా ఉత్తరాంచున సరిహద్దు చుట్టి, ఉప్పు సముద్రపు ఉత్తర అఖాతమునొద్ద యోర్దానుకు దక్షిణాగ్రమున ఆగిపోయెను. ఇది వారి దక్షిణపు సరిహద్దు. యోర్దానే తూర్పు సరిహద్దు.

20. ఈ ఎల్లలలో గల నేలయే బెన్యామీనీయుల వారసత్వ భూమి.

21-28. వారివారి కుటుంబముల ననుసరించి బెన్యామీను తెగలవారి పట్టణములు ఇవి: యెరికో, బేత్-హోగ్లా, ఏమెక్కేసీసు, బేత్-అరబ్బా,సేమరాయీము, బేతేలు, అవ్వీము, పారా, ఓఫ్రా, కేఫరమ్నోని, ఓఫ్ని, గేబా-ఇవియన్నియు వానివాని పల్లెలతో కూడి పండ్రెండు పట్టణములు. గిబ్యోను, రామా, బేరోత్తు, మీస్పే, కేఫీరా, మోసా, రేకెము, ఇర్పీలు, తరల, సేలా ఏలెపు, యెరూషలేము, గిబియా, కిర్యతు వానివాని పల్లెలతో కలసి ఇవియన్నియు పదునాలుగు పట్టణములు. వారివారి కుటుంబములతో కలసి బెన్యామీను తెగ వారికి లభించిన వారసత్వభూమి యిదియే.