ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ద్వితియోపదేశకాండము 17

1. మీ మందలలోని ఎద్దులు, గొఱ్ఱెలలో అవలక్షణములు ఉన్నవానిని ప్రభువునకు బలిగా సమర్పింపకుడు. అట్టి పనిని ప్రభువు సహింపడు.
2. ప్రభువు మీకు ఈయనున్న నగరములలో ఒక స్త్రీగాని, పురుషుడుగాని యావే నిబంధనకు వ్యతిరేకముగా పాపము చేసెననుకొనుడు.
3. ఆ వ్యక్తి ప్రభువు ఆజ్ఞ మీరి అన్యదైవములనో సూర్యచంద్ర నక్షత్రాదులనో కొలిచెననుకొనుడు.
4. ఆ వార్తలు మీ చెవిని బడెననుకొనుడు. మీరు జాగ్రత్తగా విచారణము జరిపింపగా అట్టి దుష్కార్యము జరిగిన మాట నిజమే యని రుజువయ్యెననుకొనుడు.
5. అప్పుడు మీరు ఆ వ్యక్తిని నగరము వెలుపలికి కొనిపోయి రాళ్ళతో కొట్టి చంపవలసినదే.
6. కాని అట్టివానిని చంపవలయునన్న ఇద్దరు లేక ముగ్గురు సాక్ష్యము చెప్పవలయును. ఒక్కని సాక్ష్యము చెల్లదు.
7. దోషిని చంపునపుడు సాక్షులే మొదట రాళ్ళురువ్వు వలయును. తరువాత జనులెల్లరు రాళ్ళురువ్వి ఆ వ్యక్తిని వధింతురు. ఈ రీతిగా ఆ దుష్కార్యమును మీ మధ్యనుండి తుదముట్టింపుడు.
8. మీ స్థానిక న్యాయాధిపతులు తీర్పు చెప్ప జాలని కష్టతరమైన అభియోగములు - హత్య, ఆస్తి హక్కు దౌర్జన్యము - మొదలైనవి ఏవైన వచ్చినవను కొనుడు. అప్పుడు మీరు ప్రభువు ఎంచుకొనిన ఆరాధనస్థలమునకు పొండు.
9. అచటి లేవీయ యాజకులకు, ఆ సమయమున అచట అధికారములో నున్న న్యాయాధిపతికి మీ తగవు వినిపింపుడు. వారే మీ వివాదమును తగినరీతిగా పరిష్కరింతురు.
10. కాని యావే ఎన్నుకొనిన ఆ స్థలమున వారు చెప్పిన తీర్పును మీరు తు.చ. తప్పక పాటింపవలయును.
11. వారి పరిష్కారమును గోరంతయైనను మార్చకుండ శిరసావహింపవలయును.
12. ప్రభువు ఎంచుకొనిన ఆరాధనస్థలమున లేవీయ యాజకులు, అధికారములో నున్న న్యాయాధిపతి చెప్పిన తీర్పును ఎవడైన మూర్ఖత్వ ముతో విననిచో వానికి మరణశిక్ష విధింపుడు.
13. ఆ సంగతివిని జనులెల్లరు భయపడి మరల అట్టి సాహసకార్యమునకు పూనుకొనరు.
14. ప్రభువు మీకు ఈయనున్న దేశమును ఆక్రమించుకొని అచట స్థిరపడిన పిమ్మట, చుట్టుపట్ల నున్న ఇతర జాతులవలె మీరును ఒక రాజును ఎన్నుకోగోరెదరేని,
15. యావే నియమించినవానినే మీ ఏలికగా అంగీకరింపుడు. అతడు మీ ప్రజలలోని వాడై యుండవలయును. అన్యజాతివాడు కాకూడదు. 
16. ఆ రాజు తన అశ్వబలమును అధికము చేయరాదు. జనులను ఐగుప్తునకు పంపి గుఱ్ఱములను రప్పింపరాదు. మీరు ఐగుప్తున మరల అడుగుపెట్ట రాదని ప్రభువు శాసించెను.
17. ఇంకను రాజునకు పెక్కుమంది భార్యలు ఉండరాదు. వారు ప్రభువునుండి అతని హృదయమును వైదొలగింతురు. మరియు అతడు వెండిబంగారములను విస్తారముగా కూడ బెట్టరాదు.
18. అతడు రాజై పరిపాలనము చేయనారంభించినపుడు లేవీయ యాజకులవద్దనున్న శాసనముల గ్రంథములనుండి తనకొరకు ఒక ప్రతిని వ్రాసుకొనవలయును.
19. ఆ ప్రతిని ఎల్లపుడు తన దగ్గర ఉంచుకోవలయును. ప్రతిరోజు దానిని పారాయణము చేయవలయును. అతడు అందలి శాసనములన్నియు పాటించినచో ప్రభువుపట్ల భయభక్తులతో మెలిగినవాడగును.
20. రాజు ఇట్లు చేసెనేని తాను తోటి యిస్రాయేలీయులకంటె అధికుడనన్న భావముతో విఱ్ఱవీగడు. ప్రభువు ఆజ్ఞలను అశ్రద్ధచేయడు. వాటి నుండి ప్రక్కకు మరలడు. అప్పుడు అతడును, అతని వంశజులును దీర్ఘకాలము యిస్రాయేలీయులను పరిపాలింతురు.