ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ద్వితియోపదేశకాండము 10

1. ప్రభువు నాతో “నీవు మొదటిసారి వలె మరల రెండు రాతిపలకలు చెక్కుకొని కొండయెక్కి నా వద్దకురమ్ము. ఆ పలకలు ఉంచుటకు ఒక కొయ్య పెట్టెను తయారు చేయుము.
2. నీవు పగులగొట్టిన ఆ మొదటి పలకలమీద వ్రాసిన మాటలు నేను మరల వీనిమీద వ్రాయుదును. నీవు వీనిని కొయ్య పెట్టెలో పెట్టవలెను” అని చెప్పెను.
3. కనుక నేను తుమ్మ కొయ్యతో మందసమును చేసితిని. మునుపటివలె రెండు రాతిపలకలను చెక్కుకొని కొండ మీదికి తీసికొనిపోతిని.
4. పూర్వరీతిగనే ప్రభువు ఆ పలకలమీద పది ఆజ్ఞలను వ్రాసెను. మీరు కొండచెంత సమావేశమైనప్పుడు ఆయన పర్వతము మీద మంట నడుమ నుండి మీకు ఆదేశించిన ఆజ్ఞలు ఇవియే. అంతట ప్రభువు ఆ పలకలను నాకొసగెను.
5. అటు పిమ్మట నేను కొండ దిగివచ్చి యావే ఆజ్ఞాపించినట్లే ఆ రాతి పలకలను చెక్కపెట్టెలో పదిల పరచితిని. నేటివరకును అవి దానియందే ఉన్నవి.
6. అటు తరువాత యిస్రాయేలీయులు యాకాను ప్రజలదైన బేరోతునుండి మోసేరా చేరిరి. అచట అహరోను చనిపోగా పాతిపెట్టిరి. అహరోను కుమారుడు ఎలియెజెరు తండ్రికి బదులుగా యాజకుడయ్యెను.
7. అచటినుండి వారు గూధ్గోదా చేరుకొనిరి. ఆ తావు నుండి నీటివనరులు గల యోత్బాతానునకు వెళ్ళిరి.
8. ఆ సమయమున నిబంధన మందసమును మోయుట కును, యాజకులుగా సేవచేయుటకును, దేవుని పేర ప్రజలను దీవించుటకును ప్రభువు లేవీ తెగవారిని నియమించెను. నేటికీ వారు ఈ కార్యములు చేయుచునే యున్నారు.
9. ఈ కారణమున ఇతర తెగలకు వలె లేవీ తెగకు భూమి లభింపదయ్యెను. మీ ప్రభువైన దేవుడు సెలవిచ్చినట్లే, యాజకులై యావేకు పరిచర్య చేయుటయే వారి ఆస్తి.
10. ఆ రీతిగా నేను మొదటిసారివలె మరల నలుబది పగళ్ళు, నలుబది రాత్రులు కొండమీద గడపితిని. ప్రభువు రెండవసారికూడ నా మొర ఆలకించి మిమ్ము నాశనము చేయడయ్యెను.
11. ఆ మీదట ఆయన నన్ను మిమ్మును నడిపించుకొని పొమ్మని చెప్పెను. మనము వెళ్ళి తాను పితరులకు వాగ్దానము చేసిన నేలను స్వాధీనము చేసికోవలెనని ఆదేశించెను.
12. కనుక యిస్రాయేలీయులారా! ఇప్పుడు ప్రభువు మీ నుండి కోరుకొనునదేమి? ఆ ప్రభువునెడల భయభక్తులు చూపుచు ఆయన ఆజ్ఞలనెల్ల పాటించు టయు, పూర్ణహృదయముతోను పూర్ణాత్మతోను ఆయనను ప్రేమించి సేవించుటయు,
13. మీ మేలు కోరి నేను ఈనాడు మీకు ఆదేశించు ప్రభువు ఆజ్ఞలను విధులనెల్ల పాటించుటయు- అంతియేగదా!
14. ఆకాశమహాకాశములు ఆ ప్రభునవి. ఈ భూమియు, దీనిమీదగల సమస్తవస్తువులును ఆయనవి.
15. అట్టివాడు కూడ మీ పితరులను గాఢముగా ప్రేమించెను. వారి తరువాత సకల ప్రజలను కాదని వారిసంతతియైన మిమ్మే ఎన్నుకొనెను. నేటివరకును మీరు ఆయన ప్రజలై ఉన్నారు.
16. కావున మీరు హృదయశుద్ధినిపొంది మీ తలబిరుసుతనమును విడనాడుడు.
17. యావే దేవాదిదేవుడు, ప్రభువులకెల్ల ప్రభువు. ఆయన మహాదేవుడు, మహాబలవంతుడు, మహాభయంకరుడు. ఆయన పక్షపాతము చూపడు, లంచము పుచ్చుకొనడు.
18. ఆ దయామయుడు అనాథశిశువులకు, విధవలకు న్యాయము జరిగించును. పరదేశులను ఆదరించి వారికి అన్నవస్త్రములను దయచేయువాడు.
19. కనుక మీరు పరదేశులను ప్రేమింపుడు. మీరు ఐగుప్తున పరదేశులుగా ఉంటిరి గదా!
20. మీరు యావేపట్ల భయభక్తులతో మెలగుడు. ఆయనను సేవింపుడు. ఆయనను నమ్ముడు. ఆయన పేరిటనే బాసచేయుడు.
21. ఆ ప్రభువునే మీరు కీర్తింపవలయును, ఆయనే మీ దేవుడు. మీరు కన్నులార చూచిన ఈ మహత్తరములైన అద్భుత కార్యములనెల్ల కావించినవాడు ఆయనయే.
22. మీ పితరులు ఐగుప్తునకు వెళ్ళినపుడు కేవలము డెబ్బది మంది మాత్రమే. కాని నేడు ఆయన మిమ్ము ఆకాశ నక్షత్రములవలె విస్తరిల్లజేసెను.