ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

JOB CHAPTER 42

1. అప్పుడు యోబు ప్రభువుతో ఇట్లనెను:
2. "ప్రభూ! నీవు సర్వశక్తిమంతుడవు. నీవు తలపెట్టిన కార్యములెల్ల చేయగలవు , అని నేను తెలుసుకొంటిని.
3. జ్ఞానహీనమైన పలుకులతో ఆలోచనను నిరర్ధకము చేయువీడెవడు? అలాగు నాకు విజ్ఞానము చాలకున్నను నేను నీ కార్యములను గూర్చి ప్రశ్నించితిని. నాకు అర్థముగాని అంశములగూర్చి సంభాషించితిని. నేను గ్రహింపజాలని మహాద్భుత విషయములగూర్చి . ఇంతతడవు వదరితిని.
4. ఇప్పుడు నేను మాట్లాడగోరుచున్నాను నా మాట ఆలకింపుము. ఒక సంగతి నిన్ను అడిగెదను. దానిని నాకు తెలియజెప్పుము.
5. 'పూర్వము వినికిడి వలన మాత్రమే నేను నిన్నెరిగితిని. కాని ఇప్పుడు నా కన్నులతో నిన్ను చూచితిని.
6. కనుక నేను పలికిన పలుకులకు అసహ్యపడుచున్నాను. దుమ్ము, బూడిదపైన చల్లుకొని పశ్చాత్తాపపడుచున్నాను.”
7. ప్రభువు యోబుతో మాట్లాడి చాలించిన పిదప ఎలీఫసుతో “ఓయి! నాకు నీ పట్లను, నీ యిరువురి మిత్రుల పట్ల ఆగ్రహము కలుగుచున్నది. మీరు నా భక్తుడైన యోబువలె నన్నుగూర్చి యథార్థము చెప్పరైతిరి.
8. కనుక మీరు ఏడు కోడెలను, ఏడు పొట్టేళ్ళను యోబు వద్దకు కొనిపోయి, మీ మేలుకొరకు దహన బలిగా అర్పింపుడు. యోబు మీ కొరకు ప్రార్థన చేయును. నేను అతని వేడుకోలునాలించి మీ అవి వేకమును మన్నింతును. మీరు యోబువలె నన్ను గూర్చి యథార్థము చెప్పరైతిరి” అనెను.
9. తేమాను నగరవాసి అయిన ఎలీఫసు, షూహా దేశీయుడు బిల్టదు, నామా దేశీయుడు సోఫరు ప్రభువు చెప్పినట్లే చేసిరి. ప్రభువు యోబు మనవి నాలకించెను.
10. యోబు తన ముగ్గురు మిత్రులకొరకు ప్రార్థనచేసిన పిదప ప్రభువు అతనిని మరల సంపన్నుని చేసెను. పూర్వముకంటె రెట్టింపుగా సిరిసంపదలు దయచేసెను.
11. యోబు సోదరీ సోదరులు, పూర్వ స్నేహితులు అతనిని సందర్శించుటకు వచ్చి అతనితో విందును ఆరగించిరి. వారు అతనికి సానుభూతి చూపిరి. ప్రభువు అతనిని కడగండ్ల పాలు చేసి నందులకు గాను అతనిని ఓదార్చిరి. వారిలో ప్రతి వాడు యోబుకు కొంత సొమ్మును, బంగారపు ఉంగరమును బహూకరించెను.
12. ప్రభువు యోబు జీవితములో పూర్వముకంటె ఇప్పుడు ఎక్కువగా దీవించెను. అతడు పదునాలుగువేల గొఱ్ఱెలతోను, ఆరువేల ఒంటెలతోను, వేయి కాడిజతల ఎద్దులతోను, వేయి గాడిదలతోను విరాజిల్లెను.
13. అతనికి ఏడుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు కల్గిరి.
14. యోబు పెద్ద కుమార్తె పేరు యెమీమా, రెండవ కూతురు పేరు కేసియా, చిన్నకూతురు పేరు కెరెనప్పుకు.
15. లోకములో యోబు కుమార్తెలంత అందగత్తెలెవరును లేరు. యోబు పుత్రులతో పాటు పుత్రికలకును కూడ తన ఆస్తిలో భాగములు పంచి యిచ్చెను.
16. బాధలనుండి బయట పడిన తరువాత యోబు నూటనలుబది యేండ్లు జీవించెను. తన బిడ్డలను, బిడ్డల బిడ్డలను నాలగుతరముల వరకు చూచెను.
17. అతడు చాల యేండ్లు జీవించి పండువంటి నిండు ప్రాయమున కన్నుమూసెను.