ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

యోవేలు

 1. పెతూవేలు కుమారుడైన యోవేలునకు ప్రభువు దర్శనవాణి తెలియజేసిన సందేశమిది:

2. వృద్దులారా వినుడు!  మీ తరమునగాని, మీ తండ్రుల తరమున గాని ఇట్టి కార్యమెన్నడైనను జరిగినదా?

3. మీరు మీ బిడ్డలకు దీనిని తెలియజేయుడు. మీ బిడ్డలు వారి బిడ్డలకును, వారు తమ తరువాతి తరములవారికిని దీనిని వివరింతురు.

4. మిడుతలు పెద్దవి, చిన్నవి దండు మీద దండు వచ్చెను. ఒక దండు వదలి వేసినది మరియొక దండు మ్రింగివేసెను.

5. త్రాగుబోతులారా! మీరు నిద్రమేల్కొని శోకింపుడు. మధుపాన ప్రియులారా! విలపింపుడు. మీకిక క్రొత్త ద్రాక్షారసము లభింపదు.

6. మిడుతలదండు వచ్చి మన దేశముపై పడినది. ఆ ప్రాణులు బలమైనవి, లెక్కల కందనివి. వాని పండ్లు సింగము కోరలవలె కరకైనవి.

7. అవి మన ద్రాక్షలను నాశనము చేసెను. మన అంజూరములను కొరికివేసెను. ఆ చెట్ల కొమ్మల బెరడును తినివేయగా అవి తెల్లబడెను.

8. వధువు తాను పరిణయమాడనున్న యువకుడు మరణింపగా శోకించినట్లు మీరును శోకింపుడు.

9. దేవాలయమున అర్పించుటకు ధాన్యమును, ద్రాక్షరసమును లేవు. ప్రభువునకు అర్పించుటకేమియు లేవు గాన యాజకులు విలపించుచున్నారు.

10. పొలములు పాడైనవి. ధాన్యము నాశనమగుటచే భూమి దుఃఖించుచున్నది. ద్రాక్షలెండిపోయినవి, ఓలివుచెట్లు వాడిపోయినవి.

11. కర్షకులారా! రోదింపుడు. ద్రాక్షలు పెంచు రైతులారా! అక్రందన చేయుడు. యవ, గోధుమపంటలు అన్నియు పాడైనవి.

12. ద్రాక్షలు, అంజూరములు మాడిపోయినవి. దానిమ్మలు, ఖర్జూరములు, ఆపిలుచెట్లు మొదలుగాగల పొలములోని చెట్లన్నియు ఎండిపోయినవి. నరుల సంతోషము అంతరించినది.

13. యాజకులారా! గోనె తాల్చి విలపింపుడు. బలిపీఠములపై అర్చనచేయువారలారా! శోకింపుడు. దేవాలయములోనికి పోయి రేయెల్ల ఏడ్వుడు. దేవాలయమున మీ దేవునికి అర్పించుటకు ధాన్యము గాని, ద్రాక్షాసారాయముగాని లేదు.

14. జనులు ఉపవాసము ఉండవలెనని ప్రకటింపుడు. ప్రజలను సమావేశపరపుడు. యూదా నాయకులను, ప్రజలనెల్లరిని మీ దేవుడైన ప్రభువు మందిరమున ప్రోగుచేసి అతడికి మొరపెట్టుడు.

15. ప్రభుదినము సమీపించినది. అతడు నాశనమును కొనివచ్చు దినమాసన్నమైనది. అది భయంకరమైన దినము.

16. మనము చూచుచుండగనే మన పంటలు నాశనమైనవి. మన దేవుని మందిరమునుండి ఆనందోత్సాహములు మరుగైనవి.

17. ఎండిన నేలలో విత్తనములు కందిపోయినవి. గాదెలలో నిల్వచేయుటకు ధాన్యములేదు. కావున ఖాళీ గాదెలు పాడైపోయినవి.

18. బీళ్ళలో గడ్డిలేదు. కనుక పశువులు దీనముగా అరచుచున్నవి. గొఱ్ఱెలమందలు బాధపడుచున్నవి.

19. ప్రభూ! మంటలు కాల్చివేసినట్లుగా గడ్డిబీడులెండిపోయినవి. పొలములోని చెట్లు మాడిపోయినవి. కావున నేను నీకు మొర పెట్టెదను.

20. అగ్ని చేత గడ్డి బీడులు కాలిపోయినవి. ఏరులు ఎండిపోయినవి గాన వన్యమృగములు కూడ నీకు మొరపెట్టుచున్నవి. 

 1. దేవుని పవిత్రపర్వతమైన సియోను మీద బాకాను ఊది హెచ్చరిక చేయుడు. ప్రభుదినము త్వరలోనే వచ్చును గాన యూదా ప్రజలారా! మీరు గడగడ వణకుడు.

2. అది అంధకార బంధురము, విషాదపూరితమునైన రోజు ఈ మేఘావృతము, తమోమయమునైన దినము. కొండలపై గాఢాంధకారము క్రమ్మును. బలమైన మహాసైన్యమువలె మిడుతలదండు కదలి వచ్చుచున్నది. అట్టి దండు పూర్వమెన్నడును కనిపించి ఎరుగదు. ఇక కనిపింపబోదు.

3. ఆ శలభముల ముందు వెనుకల అగ్ని ప్రజ్వరిల్లుచున్నది. అవి రాకముందు భూమి ఏదెను తోటవలె కళకళలాడుచుండెను. కాని అవి పోయిన పిదప నేల ఎడారి అగును. అవి దేనిని వదలిపెట్టుట లేదు.

4. ఆ శలభములు అశ్వములవలె నున్నవి. యుద్ధాశ్వములవలె పరుగిడుచున్నవి.

5. అవి పర్వతములపైన ఎగురుచు రథధ్వానము చేయుచున్నవి. ఎండుగడ్డి కాలినట్లుగా పుటపుటమను నాదము చేయుచున్నవి. యుద్ధమునకు సన్నద్ధమైన సైన్యమువలె బారులు తీరుచున్నవి.

6. అవి దగ్గరకు రాగానే ఎల్లరును భీతి చెందుదురు. ఎల్లరి మోములు వెలవెలపోవును.

7. అవి రణవీరులవలె వచ్చి, మీద పడుచున్నవి. శూరులవలె గోడలు ఎక్కుచున్నవి. ప్రక్కకు ఏమాత్రమును తొలగక ఒకదాని కొకటి అడ్డురాక ప్రతి శలభమును తిన్నగా ముందునకు సాగిపోవుచున్నది.

8. అవి ఒకదానిమీద ఒకటి తొక్కులాడక అన్నియు చక్కగా పోవుచున్నవి. ఆయుధములు మీదపడినను అవి త్రోవ విడువవు.

9. నగరము మీదికి ఉరుకుచున్నవి. గోడలమీదుగా దూకుచున్నవి. ఇండ్లమీదికి ప్రాకి దొంగలవలె కిటికీల గుండ లోపల జొరబడుచున్నవి.

10. ఆ మిడుతలు సమీపించుచుండగా నేల దద్దరిల్లుచున్నది, ఆకాశము కంపించుచున్నది. సూర్యచంద్రులకు చీకట్లు క్రమ్ముచున్నవి. నక్షత్రములు కాంతిని కోల్పోవుచున్నవి.

11. ప్రభువు గర్జన రూపమున తన సైన్యమునకు ఆజ్ఞలిచ్చుచున్నాడు. ఆయన ఆజ్ఞలు పాటించు సైన్యములు అనంతములు, మహాశక్తిమంతములు. ప్రభువుదినము మహత్తరమైనది, భీకరమైనది. దానిని తట్టుకోగలవాడు ఎవడు?

12. ప్రభువు ఇట్లనుచున్నాడు: “ఇప్పుడైనను మీరు పూర్ణహృదయముతో నా చెంతకు మరలిరండు. ఉపవాసముతోను, సంతాపముతోను, ఏడ్పులతోను నా వద్దకు తిరిగిరండు.

13. మీ బట్టలు చించుకొనుటచాలదు. మీ గుండెలను వ్రయ్యలు చేసికొనుడు. మీరు ప్రభువు చెంతకు తిరిగిరండు. ఆయన కరుణామయుడు, దయాపరుడు సులభముగా కోపపడువాడుకాడు. అనంతమైన ప్రేమకలవాడు తాను నిశ్చయించుకొన్నట్లు శిక్షింపక మన్నించి వదలివేయువాడు.

14. ఒకవేళ మీ ప్రభువైన దేవుడు మనసు మార్చుకొని మీకు పంటలు అనెడు దీవెననీయవచ్చును. అప్పుడు మీరు ఆయనకు ధాన్యము, ద్రాక్షాసారాయమును అర్పింపవచ్చును.

15. సియోను కొండపై బాకానూదుడు. ఉపవాసము చేయవలెనని ప్రజలకాజ్ఞనిండు. వారిని సమావేశపరపుడు.

16. పవిత్రసభకు జనులను ప్రోగుచేయుడు. వృద్ధులను, పిల్లలను, చంటిబిడ్డలనుకూడ కొనిరండు. నూత్నముగా పెండ్లియాడిన దంపతులు కూడ తమ గృహములను వీడిరావలెను.

17. ప్రభువునకు ఊడిగముచేయు యాజకులు బలిపీఠమునకును, మంటపమునకును మధ్య శోకించుచు, 'ప్రభూ! నీ ప్రజలపై దయచూపుము. అన్య జాతులు మీ దేవుడెక్కడున్నాడని పలుకుచు మమ్ము చిన్నచూపు చూచి గేలిచేయకుందురుగాక!' అని ప్రార్థింపవలెను. ప్రభువు ప్రజల మనవిని ఆలించుట

18. అపుడు ప్రభువు తన దేశముపై ఆదరము చూపెను. తన ప్రజలను కరుణించెను.

19. ఆయన వారితో ఇట్లనెను: “నేను మీకు సంతృప్తి కలుగునట్లుగా ధాన్యము ద్రాక్షాసారాయము, ఓలివుతైలము నిత్తును. అన్య జాతులు మిమ్మిక తృణీకరింపజాలవు.

20. నేను ఉత్తరమునుండి మీమీదికెత్తి వచ్చిన మిడుతల దండును పారద్రోలుదును. వానిలో కొన్నిటిని ఎడారిలోనికి తోలివేయుదును.  ఆ దండులోని ముందటి భాగమును మృత సముద్రములోనికిని, వెనుకటిభాగమును మధ్యధరా సముద్రములోనికిని తోలుదును. ఆ మిడుతలు చచ్చి కంపుకొట్టును. అవి మీకు చేసిన కార్యమునకుగాను నేను వానిని నాశనము చేయుదును.

21. పొలములారా! మీరు భయపడకుడు. ప్రభువు మీకు చేసిన గొప్ప కార్యమునకుగాను మీరు సంతసముతో ఆనందింపుడు.

22. పశువులారా! మీరు భయపడకుడు. గడ్డి బీళ్ళు పచ్చబడినవి. చెట్లు పండ్లు కాయుచున్నవి. ద్రాక్షలు, అంజూరములు సమృద్ధిగా ఫలించుచున్నవి.

23. సియోను ప్రజలారా! ప్రభువు మీకు చేసిన కార్యమునకుగాను మీరు సంతసముతో ఆనందింపుడు. ఆయన మీకు వలసినంతగా శిశిరఋతువు వర్షము నిచ్చెను. పూర్వమువలెననే శీతకాలవర్షమును, వసంతకాల వర్షమును దయచేసెను.

24. మీ కళ్ళములు ధాన్యముతో నిండును. మీ గానుగలచెంతనున్న తొట్లు ద్రాక్షారసముతోను, ఓలివుతైలముతోను నిండిపోవును.

25. మిడుతలదండు మీ పైరులను తినివేసిన కాలమున మీరుకోల్పోయిన పంటను నేను మీకు మరల ఇత్తును. ఆ దండును మీ పైకి పంపినది నేనే.

26. ఇప్పుడు మీరు సమృద్ధిగా భుజించి సంతృప్తి చెందుదురు. మీకు మహోపకారములు చేసిన ప్రభువును మీరు స్తుతించి కీర్తింతురు. నా జనులను ఇకమీదట ఎవరును తృణీకరింపజాలరు.

27. యిస్రాయేలీయులారా! అప్పుడు మీరు నేను మీ మధ్యనున్నాననియు ప్రభుడనైన నేను మీ దేవుడననియు నేను తప్ప మరొక దైవములేడనియు గుర్తింతురు. నా జనులను ఇకమీదట ఎవరును తృణీకరింపజాలరు.

28. అటుపిమ్మట నేను నా ఆత్మను ఎల్లరిపై కుమ్మరింతును. మీ పుత్రులు, పుత్రికలు నా సందేశమును చెప్పుదురు. మీ ముదుసలులు కలలుకందురు. మీ యువకులు దర్శనములు గాంతురు.

29. ఆ కాలమున నేను సేవకులగు స్త్రీపురుషుల మీదను నా ఆత్మను క్రుమ్మరింతును.

30. ఆ దినముగూర్చి భూమిమీదను ఆకాశమునను గుర్తులు చూపుదును, అపుడు నెత్తురు, నిప్పు, ధూమకంభములు కనిపించును.

31. భీకరమైన ప్రభువు మహాదినము సమీపించినపుడు సూర్యుడు చీకట్లు క్రమ్మును. చంద్రుడు నెత్తురువలె ఎఱ్ఱబడును.

32. కాని ప్రభువు తనను శరుణువేడిన వారినందరిని కాపాడును. సియోనుపై కొందరు అపాయమును తప్పించుకొందురనియు, యెరూషలేమున తానెన్నుకొనిన శేషజనులు మిగులుదురనియు ప్రభువే సెలవిచ్చెను. 

1. ప్రభువిట్లనుచున్నాడు: ఆ కాలమున యూదా యెరూషలేములకు మరల సౌభాగ్యమును ఒసగుదును.

2. నేను జాతులన్నిటిని ప్రోగుచేసి యెహోషాఫాత్తులోయకు' కొనివత్తును. వారు నా సొంత ప్రజలకు చేసిన కీడునకుగాను నేను వారికచట తీర్పు తీర్తును. వారు యిస్రాయేలీయులను జాతులమధ్య చెల్లాచెదురుచేసి నాదేశమును తమలోతాము పంచుకొనిరి.

3. వారు బందీలైన నా ప్రజల కొరకు ఓట్లు వేసికొనిరి. వేశ్యలపొందు కొరకు బాలకులను అమ్మివేసిరి. మద్యమును కొని త్రాగుటకుగాను బాలికలను విక్రయించిరి.

4. తూరు, సీదోను, ఫిలిస్తీయా దేశములారా! మీతో నాకు పనియేమి? మీరు నాకు ప్రతీకారము చేయనెంచుచున్నారా? నేను చేసినదానికి మీరు నాకు ప్రతీకారము చేయుదురా? మీరు నాకేమైనా చేయుదురా?

5. మీరు నా వెండి బంగారములనుకొనిపోతిరి. అమూల్యమైన నా నిధులను మీ దేవళములలోనికి తీసికొని పోతిరి.

6. యూదా, యెరూషలేము జనులను వారి దేశమునుండి దూరముగా కొనిపోయి గ్రీకువారికి అమ్మివేసితిరి.

7. నేను మీరు అమ్మివేసిన తావులనుండి వారిని మరల కొనివత్తును. మీరు వారికి చేసిన కీడులనే నేను మీకును చేయుదును.

8. నేను మీ కుమారులను, కుమార్తెలను యూదావాసులకు అమ్మింతును. వారు వారిని దూరమున వసించు షెబా జాతికి అమ్మివేయు దురు. ఇది ప్రభుడనైన నా వాక్కు”.

9. అన్యజాతులకు ఇట్లు ప్రకటన చేయుడు: “మీరు యుద్ధమునకు సన్నద్దులు కండు. మీ యోధులను పిలువుడు. మీ సైనికులను ప్రోగుచేసికొని పోరునకు నడువుడు.

10. మీ నాగటి కర్రలతో కత్తులను చేసికొనుడు. మీ కొడవళ్ళతో ఈటెలను చేసికొనుడు. దుర్భలుడు కూడ “నేను యోధుడను' అనుకొనవలెను

11. ఇరుగుపొరుగు జాతుల ప్రజలారా! మీరు శీఘ్రమే రండు, లోయలో ప్రోగుకండు. ప్రభూ! ఆ ప్రజలమీద పడుటకు నీ సైన్యమును పంపుము.

12. జాతులు సిద్ధమై యెహోషాపాత్తు లోయకు రావలెను. ఇరుగుపొరుగు జాతుల జనులకు తీర్పుచెప్పుటకు ప్రభుడనైన నేను ధర్మపీఠమును అధిష్ఠింతును.

13. ఆ జనులు మిగుల దుష్టులు గాన, పండినపంటనువలె వారిని కొడవళ్ళతో కోసివేయుడు. గాటిలోని ద్రాక్షలవలె వారిని తొక్కివేయుడు. తొట్లు రసముతో నిండిపోవును.

14. యెహోషాఫాత్తు లోయలో ప్రజలు గుంపులు గుంపులుగా ప్రోగైరి. అచట తీర్పురోజు ఆసన్నమైనది.

15. సూర్యచంద్రులను చీకట్లు క్రమ్మును. తారలు కాంతిని కోల్పోవును.

16. ప్రభువు సియోనునుండి గర్జించుచున్నాడు. యెరూషలేమునుండి ఆయన కంఠధ్వని వినిపించుచున్నది. భూమ్యాకాశములు కంపించుచున్నవి. కాని ప్రభువు తన ప్రజలకు ఆశ్రయమగును. యిస్రాయేలీయులకు రక్షణదుర్గమగును.

17. యిస్రాయేలీయులారా! అపుడు మీరు నేను మీ దేవుడనని ప్రభుడనని గుర్తింతురు. నేను నా పవిత్ర నగరమైన సియోనున వసింతును. యెరూషలేము పవిత్ర నగరమగును. అన్యజాతులు దానిని జయింపజాలవు.

18. ఆ కాలము వచ్చినపుడు పర్వతములు ద్రాక్షతోటలతో నిండియుండును. కొండలు పశువులతో నిండియుండును. యూదానదులన్నియు నీటితో నిండియుండును. దేవుని మందిరమునుండి, ఒకయేరు పారి షిత్తీములోయను తడుపును.

19. ఐగుప్తు పాడువడును. ఎదోము ఎడారి అగును. ఆ దేశముల ప్రజలు యూదా మీదికి దాడిచేసి, నిర్దోషుల నెత్తురు నొలికించిరి.

20-21. నేను హతులైన వారి తరపున పగతీర్చుకొందును. దోషులను శిక్షింపకవదలను. కాని యూదాలో ప్రజలు సదా వసింతురు. యెరూషలేమున తరతరముల వరకు నరులు నివసింతురు. ప్రభుడనగు నేను సియోనున వాసము చేయుదును”.