ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Sirach Chapter 50 in telugu || Telugu Catholic Bible || సీరా పుత్రుడైన యేసు జ్ఞానగ్రంధము 50వ అధ్యాయము

 1. ఓనీయా కుమారుడును ప్రధాన యాజకుడైన సీమోను దేవాలయమును మరమ్మతు చేయించి దృఢపరచెను.

2. ఎత్తున నున్న రెండువరుసల ప్రాకారమునకు పునాదులు వేసినదియు అతడే. దేవాలయముచుట్టు బురుజులు కట్టించినదియు అతడే.

3. అతడు యాజకుడుగానున్న కాలమున సొలోమోను కంచుతొట్టియంతటి జలాశయమును త్రవ్విరి.

4. అతడు శత్రువుల ముట్టడినుండి ప్రజలను కాపాడగోరి నగరమును సురక్షితము చేసెను.

5. దేవాలయ అంతర్భాగపు తెరనుండి వెలుపలికి వచ్చినపుడు సీమోను మహామహిమతో వెలుగొందెడివాడు.

6. మబ్బులగుండ మెరయు ఉదయకాల నక్షత్రమువలెను, పూర్ణచంద్ర బింబమువలెను,

7. మహోన్నతుని దేవాలయము మీద ప్రకాశించు సూర్యబింబమువలెను, మేఘములమీద కాంతితో మెరయు రంగులధనుస్సువలెను,

8. వసంతకాలపు గులాబీలవలెను, జలధారచెంత వికసించు లిల్లీ పూలవలెను, వేసవిలో లెబానోనున ఎదుగు దేవదారువలెను,

9. ధూపకలశమునుండి వెలువడు సాంబ్రాణి పొగవలెను, పోతపోసి తీసిన బంగారముతో చేయబడి నానావిధ రత్నములతో పొదుగబడిన పానపాత్ర వలెను,

10. ఫలములతో నిండిన ఓలివువృక్షమువలెను, మేఘములవరకు ఎదిగిన దేవదారు తరువువలెను సీమోను ప్రకాశించెను.

11. సీమోను ప్రశస్తమైన ఆరాధనవస్త్రములను ధరించి వైభవముతో పవిత్రమైన పీఠముమీదికి ఎక్కినపుడు దేవాలయ ఆవరణమంతయు తేజస్సుతో నిండిపోయెడిది.

12. సహాయ అర్చకులు తన చుట్టును బృందముతీరి ఉండగా, అతడు పీఠముకొనన నిలుచుండి, యాజకులు అర్పించు బలి అర్పణములను స్వీకరించునపుడు, చుట్టును ఖర్జూర వృక్షములు కమ్ముకొని ఉండగా వాని మధ్యనున్న లెబానోను దేవదారు మొక్కవలె చూపట్టెను.

13. అహరోను అనుయాయులైన యాజకులు ప్రశస్త వస్త్రములు ధరించి దేవునికి అర్పింపవలసిన బలిఅర్పణములు చేతబూని యిస్రాయేలు సమాజము ముందట నిలుచుండెడివారు.

14. సీమోను మహోన్నతుడైన దేవునికి బలినర్పించి పీఠము మీది ఆరాధనమును ముగించిన పిదప

15. సంతర్పణ పాత్రము తీసికొని సువాసనలొలుకు ద్రాక్షాసారాయమును మహోన్నతుడును, మహారాజునునైన దేవునికి అర్పణగా పీఠముపాదున కుమ్మరించెడివాడు.

16. అప్పుడు అహరోను కుమారులు పెద్దగా నాదముచేసి పోతపోసి తీసిన వెండితో చేయబడిన బూరలను ఊదెడివారు. వారు చేసిన మహానాధమును ప్రభువు ఆలించెడివాడు.

17. వెంటనే జనులెల్లరు శిరస్సును నేలమీదికి వంచి సర్వశక్తిమంతుడును, మహోన్నతుడునైన ప్రభువును ఆరాధించెడివారు.

18. అంతట గాయకబృందము మధుర సంగీతముతో ప్రభుని స్తుతించి కీర్తించెడిది.

19. ఆరాధన ముగియువరకు ప్రజలెల్లరు కరుణాళువును, మహోన్నతుడనైన ప్రభువునకు మొర పెట్టి విన్నపములు చేసెడివారు.

20. అప్పుడు సీమోను పీఠము మీదినుండి దిగివచ్చి యిస్రాయేలు సమాజముపై చేతులు చాచి, ప్రభువు దివ్యనామమును ఉచ్చరించి, ప్రజలను దీవించెడివాడు.

21. ప్రజలు మరల ఆరాధనపూర్వకముగా శిరమువంచి మహోన్నతుని దీవెనలను స్వీకరించెడివారు.

22. సమస్తమును సృజించిన ప్రభువును కొనియాడుడు. సర్వత్ర మహాకార్యములుచేసిన దేవుని కీర్తింపుడు. ఆయన మనము పుట్టినప్పటినుండియు మనలను హెచ్చించి కరుణతో ఆదరించెను.

23. ప్రభువు మనకు ఆనందము దయచేయుగాక! మన యిస్రాయేలీయులకు సదా శాంతిని ప్రసాదించుగాక!

24. ఆయన మనలను ఎల్లవేళల కరుణతో పోషించుగాక! ఆపదలో మనలను కాపాడుగాక!

25. నేను అసహ్యించుకొను జాతులు రెండు కలవు. మూడవది అసలు జాతియే కాదు.

26. సేయీరు కొండపై నుండువారు, ఫిలిస్తీయులు, మూర్ఖులైన షెకెము నివాసులు.

27. యెరూషలేము నివాసి సీరా ఎలియెజెరు . పుత్రుడను యేసు నామధేయుడనైన నేను విజ్ఞానమును, వివేకమును పొందుపరచుటకు గాను ఈ గ్రంథమును లిఖించితిని. విజ్ఞానము నా హృదయమునుండి జాలువారినది.

28. ఈ ఉపదేశమును చేకొనువాడు ధన్యుడు. దీనిని స్వీకరించువాడు జ్ఞాని అగును.

29. ఈ ఉపదేశమును పాటించువాడు  ఎట్టి సంఘటననైనను తట్టుకొనగలడు అతడు దేవుని వెలుగులో నడచును.