ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Sirach Chapter 49 in telugu || Telugu Catholic Bible || సీరా పుత్రుడైన యేసు జ్ఞానగ్రంధము 49వ అధ్యాయము

 1. యోషీయా పేరు నేర్పుతో తయారు చేసిన సాంబ్రాణి నుండి వెలువడు పొగవలె కమ్మగా నుండును. తేనెవలె తీయగా నుండును. ద్రాక్షసారాయపు విందునందలి సంగీతమువలె మధురముగా నుండును

2. అతడు దీక్షతో కృషిచేసి ప్రజల బుద్ధులు మార్చెను. ఘోరాచారమైన విగ్రహారాధనను రూపుమాపెను.

3. ప్రభువునకు నమ్మదగిన బంటయి, విశ్వాసము లేశమైన లేని రోజులలో భక్తిని పెంపొందించెను.

4. దావీదు, హిజ్కియా, యోషీయా తప్ప మిగిలిన రాజులెల్లరును ఘోరపాపములు చేసిరి. మహోన్నతుని ధర్మశాస్త్రమును అశ్రద్ధ చేసిరి. కనుకనే ఆ రాజులెల్లరు అంతరించిరి.

5. ఆ రాజులు అన్యజాతులకు లొంగిపోగా వారి కీర్తిప్రతిష్ఠలు వమ్మయిపోయెను.

6. అన్యులు పవిత్రనగరమును తగులబెట్టగా వీధులు నిర్మానుష్యమయ్యెను. ఈ సంఘటనను యిర్మీయా ముందే ప్రవచించెను.

7. ప్రభువు యిర్మీయాను మాతృగర్భమునుండే ప్రవక్తగా ఎన్నుకొనినను ప్రజలు అతనిని హింసించిరి. పెరికివేయుటకును, నాశనము చేయుటకును, నిర్మూలించుటకును, పునర్నిర్మించుటకును, నాటుటకుగూడ ప్రభువు అతనిని నియమించెను.

8. దేవదూతలతో గూడిన రథముమీద నెలకొనియున్న ప్రభువు మహిమను యెహెజ్కేలు దర్శనమున వీక్షించెను.

9. ప్రభువు తన శత్రువులను తమ వడగండ్ల వానకు అప్పగించెను. కాని ఋజుమార్గమున నడుచువారికి మేలుచేసెను

10. ద్వాదశప్రవక్తల అస్థికలు నూత్నజీవముతో లేచునుగాక! వారు యిస్రాయేలీయులను ఉత్సాహపరచిరి. నమ్మకమును, విశ్వాసమును పుట్టించి జనులను కాపాడిరి.

11. సెరుబ్బాబెలును ఎట్లు సన్నుతింపగలము? అతడు ప్రభువు కుడిహస్తముననొప్పు ముద్రాంగుళీకము వంటివాడు.

12. యెహోసాదాకు పుత్రుడు యెహోషువయు అట్టివాడే వారు ప్రభువు పవిత్రమందిరమును పునర్నిర్మించిరి అది శాశ్వతమైన కీర్తికి నోచుకొనిన ఆలయము.

13. నెహెమ్యా పేరుకూడ గొప్పదే. అతడు శిథిలమైపోయిన నగర ప్రాకారములు పునర్నిర్మించెను. ద్వారములు నిర్మించి వానికి గడెలు పెట్టించెను. నాశనమైపోయిన మన గృహములను కూడా మరల కట్టించెను.

14. ఈ భూమి మీద సృజింపబడినవారిలో హనోకుతో సమానమైనవాడు లేడు. ప్రభువు అతనిని నేలమీదినుండి కొనిపోయెను.

15. లోకములో జన్మించిన వారిలో యోసేపు వంటివాడులేడు. అతడు తన సోదరులకు నాయకుడు, తన ప్రజలకు ఆదరువు. అతని అస్తులకు కూడ కీర్తి అబ్బెను.

16. షేము, సేతు కీర్తిని పొందిరి. కాని ఆదాము కీర్తి ఏ నరునికిని అబ్బలేదు.