ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Sirach Chapter 44 in telugu || Telugu Catholic Bible || సీరా పుత్రుడైన యేసు జ్ఞానగ్రంధము 44వ అధ్యాయము

 1. ఇక సుప్రసిద్ధులను సన్నుతింతము. వారు మనకెల్లరికి పూర్వవంశకర్తలు.

2. ప్రభువు వారిని మహిమాన్వితులను చేసెను. వారిద్వారా సృష్ట్యాదినుండి ఆయన కీర్తి వెల్లడైనది.

3. వారిలో కొందరు రాజ్యములేలి బలాఢ్యులుగా గణుతికెక్కిరి. కొందరు జ్ఞాననిధులైన ఉపదేశకులై ప్రవచనములు పలికిరి.

4. కొందరు నేతలై, ప్రజలను నడిపించిరి. న్యాయచట్టములను తయారుచేసి యిచ్చిరి. విజ్ఞానముతో బోధలు చేసిరి.

5. కొందరు వీరగాథలు పాటలుగా వ్రాసిరి.

6. కొందరు ధనవంతులును, బలవంతులునై ఇంటిపట్టుననే ప్రశాంతముగా కాలము గడపిరి.

7. వీరెల్లరును తమ జీవితకాలమున సుప్రసిద్ధులై ఉండిరి. తాము బ్రతికియున్న దినములందు కీర్తితో శోభిల్లిరి.

8. కొందరి పేరు ఇప్పటికిని నిలిచియున్నది. జనులు ఇప్పటికిని వారిని కొనియాడుచున్నారు.

9. కాని కొందరి పేరు నిలువలేదు. వారు నేలమీద జీవింపని వారివలె విస్మృతికి గురియైరి. అసలు పుట్టని వారివలె జనులు వారిని మరచిపోయిరి. వారి సంతతియు అట్లే అయ్యెను.

10. కాని ఈ క్రింది పంక్తిలోనివారు మేటి భక్తులు. వారి పుణ్యకార్యములను జనులు విస్మరింపలేదు.

11. వారికీర్తి వారి సంతానమునందు నిలిచియే ఉన్నది  అది ఆ పుణ్యపురుషులు వదలిపోయిన వారసత్వము

12. ఆ ధర్మాత్ముల సంతానము నిబంధనమును పాటించును. ఆ ధన్యాత్ముల చలువవలన ఆ సంతానమునకు కలిగిన సంతానమును అట్లే చేయును.

13. ఆ మహాత్ముల కుటుంబములు కలకాలము నిలుచును. వారి యశస్సు ఏ నాటికిని క్షీణింపదు.

14. వారు సమాధిలో విశ్రాంతి నొందుచున్నారు. వారి పేరు శాశ్వతముగా నిలుచును.

15. అన్యజాతి ప్రజలు వారి విజ్ఞానమును కీర్తింతురు. యిస్రాయేలు ప్రజలు వారిని కొనియాడుదురు.

16. హనోకు ప్రభువునకు ప్రీతిని కలిగింపగా ప్రభువు అతడిని పరమండలమునకు కొనిపోయెను. అతడు భావితరముల వారికి పశ్చాత్తాపప్రేరకుడుగా నుండెను.

17. నోవా పరిపూర్ణ భక్తుడు.  అతడి వలన జలప్రళయానంతరము నూతన నరజాతి ఉద్భవించినది. అతడి వలననే జలప్రళయము ముగిసిన పిదప భూమిమీద నరజాతి శేషము మిగిలినది.

18. జలప్రళయము వలన ప్రాణులు మరల నశింపవని తెలుపుచు ప్రభువు అతడితో శాశ్వతమైన నిబంధనము చేసికొనెను.

19. బహుజాతులకు సుప్రసిద్ధుడైన పితామహుడు అబ్రహాము. అతని యశస్సు అనన్య సామాన్యమైనది.

20. అతడు మహోన్నతుని ధర్మశాస్త్రమును పాటించి ఆ ప్రభువుతో నిబంధనమును చేసికొనెను. ఆ నిబంధనపుగురుతు అతని దేహముమీద కన్పించెను. అతడు ప్రభువు పంపిన శోధనలకు తట్టుకొని నిలిచెను.

21. కనుక అతని వంశజుల వలన లోకమునకు దీవెనలు అబ్బుననియు, అతని వంశజులు భూరేణువులవలె విస్తరిల్లుదురనియు, వారు ఇతర జాతులకంటె ఎక్కువగా గౌరవింపబడుదురనియు, వారి దేశము సముద్రమునుండి సముద్రము వరకు, యూఫ్రటీసు నదినుండి నేల అంచుల వరకు వ్యాపించుననియు, ప్రభువతనికి రూఢిగా ప్రమాణము చేసెను.

22. అబ్రహాము మీదగల ఆదరముచే అతని సంతతివలన లోకమునకు దీవెనలు అబ్బుననెడి ప్రమాణమును ప్రభువు ఈసాకునకు గూడ విన్పించెను.

23. అతడు యాకోబునకు గూడ ప్రమాణము చేసి అతనికి కూడ దీవెనలు ఒసగెను. తాను వారసత్వముగా ఇచ్చెదనన్న నేలను అతని కొసగెను. ఆ నేలను పండ్రెండు భాగములుచేసి పండ్రెండు తెగలకు పంచియిచ్చెను.