ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Sirach Chapter 38 in telugu || Telugu Catholic Bible || సీరా పుత్రుడైన యేసు జ్ఞానగ్రంధము 38వ అధ్యాయము

 1. నీకు చికిత్స చేసినందుకుగాను వైద్యుని సన్మానింపుము, ప్రభువే అతనిని కలిగించెను.

2. వైద్యుల ద్వారా మహోన్నతుడే వ్యాధిని నయముచేయును. రాజులు ఆ వైద్యులను బహూకరింతురు.

3. వైద్యునికి వైద్యజ్ఞానము గౌరవమును చేకూర్చిపెట్టును. ప్రముఖులైన వారు అతనిని మన్ననతో చూతురు.

4. ప్రభువే భూమినుండి మందులు కలిగించెను. బుద్ధిమంతుడు వానిని వినియోగించుకొనుటకు వెనుకాడడు.

5. పూర్వము ఒక కొయ్యముక్క చేదునీటిని తీపినీటిగా మార్చి తన శక్తిని వెల్లడించెనుగదా!

6. ప్రభువు నరులకు వైద్య విజ్ఞానమును దయచేసెను. అతని అద్భుతములకుగాను నరులు అతనిని సన్నుతింతురు.

7. ఔషధకారుడు మందులను తయారుచేయగా వైద్యుడు ఆ మందులతో నరుల రోగమును కుదిర్చి, వారి బాధలు తొలగించును.

8. ప్రభువు కార్యములకు అంతములేదు. ఆయన లోకములోని నరులు అందరికి ఆరోగ్యము దయచేయును.

9. కుమారా! నీకు జబ్బు చేసినచో అశ్రద్ధ చేయకుము. ప్రభువును వేడుకొనినచో ఆయన ఆరోగ్యమును దయచేయును.

10. నీ తప్పిదములను విడనాడి నిర్దోషివి కమ్ము. నీ హృదయమునుండి కిల్బిషమును నిర్మూలింపుము.

11. దేవుని ముందట సాంబ్రాణి పొగవేసి శ్రేష్ఠమైన ధాన్యబలి నర్పింపుము.

12. అటుపిమ్మట వైద్యుని పిలువుము, ప్రభువే అతనిని కలిగించెను. నీకు అవసరము కలదు గనుక అతనిని నీ చెంతనే ఉంచుకొనుము.

13. ఒక్కొక్కసారి నీ ఆరోగ్యము ఆ వైద్యుని చేతిలో నుండును.

14. అతడు రోగి బాధలను తొలగించి, వ్యాధిని కుదిర్చి ప్రాణము నిలుపుటకు శక్తిని దయ చేయుమని దేవుని ప్రార్ధించును.

15. సృష్టి కర్తకు ద్రోహముగా పాపము చేసిన నరుడు రోగియై వైద్యుని ఆశ్రయించుట న్యాయము.

16. కుమారా! నీవారెవరైన చనిపోయినచో కన్నీరు కార్పుము. నీ సంతాపము తెలుపుటకు బోరున ఏడ్వుము. మృతదేహమును తగిన రీతిగా సిద్ధముచేసి సమాధిచేయుము.

17. శోకముతో గుండెలు పగులునట్లు ఏడ్వుము. నియమిత కాలమువరకు విచారము వెలిబుచ్చుము నీపై దుర్విమర్శలు రాకుండునట్లు ఒకటి రెండునాళ్ళు దుఃఖింపుము. అటు పిమ్మట భేదము విడనాడుము.

18. విచారము వలన నీ ఆరోగ్యము చెడును. నీకు మరణము గూడ సిద్దింపవచ్చును.

19. చచ్చినవారిని పాతి పెట్టుటతోనే సంతాపము ముగియవలెను. విచారమువలన మనసు పాడగును.

20. కనుక నీవు విచారమును విడనాడుము. దుఃఖమును దూరముగా పారద్రోలుము. నీవును చనిపోవలసినవాడవే అని గుర్తింపుము.

21. చచ్చిన వారు తిరిగిరారని గ్రహింపుము. నీ దుఃఖము మృతునికెట్టి మేలును చేయదు. నీకు మాత్రము కీడును చేయును.

22. “మృతునికి పట్టిన దుర్గతియే నీకును పట్టును. నేడు అతని వంతు, రేపు నీ వంతు”.

23. భూస్థాపనము ముగిసిన తరువాత మృతునిగూర్చి తలంపకుము. అతడు పోయిన తరువాత ఇక విచారింపకుము.

24. విరామము వలన ధర్మశాస్త్ర బోధకుని విజ్ఞానము పెరుగును. అన్యకార్యముల నుండి వైదొలగినచో విజ్ఞానము అభివృద్ధి అగును.

25. రైతు మనసంతయు మేడిపట్టి, ఎద్దులను అదలించి, అరక దున్నుటమీదను, తన పశువులను గూర్చి మాట్లాడుట మీదను ఉన్నచో, ఇక అతని జ్ఞానమెట్లు పెరుగును?

26. అతని దృష్టి అంతయు తిన్నగా నాగటిచాలువేయుట మీదనే ఉండును. అతడు రేయి ప్రొద్దు పోయినవరకు తన పశువులను మేపుచుండును.

27. విరామములేక పనిచేయు వివిధ వృత్తుల వారందరును ఇంతియే, ముద్రలలో వినియోగించు అనగా రత్నములను చెక్కువారును ఇంతియే. వారు ఎప్పటికప్పుడు క్రొత్త నమూనాలను వెదకుచుందురు. ఆ ఆకృతులను మూలమునకు సరిపడునట్లు చెక్కుటకు రేయి ప్రొద్దుపోవు వరకు కృషి చేయుదురు.

28. కొలిమికెదుట కూర్చుండు ఇనుపసామాగ్రి పనిచేయువాడును ఇంతియే. అతడు ముతక ఇనుముతో ఏమి చేయుదునా? అని ఆలోచించును. కొలిమి వేడిమికి తట్టుకొని పనిచేయుచుండగా నిప్పు సెగలు అతని ఒడలిని కాల్చివేయును. తాను సాగగొట్టు వస్తువును నిశితముగా పరిశీలించుచుండగా సమ్మెట దెబ్బలవలన అతని చెవులకు చిల్లులుపడును. అతడు తనపనిని త్వరగా ముగింపగోరి ప్రొద్దుపోయినవరకు తన ముందటనున్న వస్తువునకు మెరుగులు దిద్దుచుండును.

29. సారె ఎదుట గూర్చుండి దానిని కాలితో త్రిప్పు కుమ్మరియును ఇంతియే. అతడు తన పని మీదనే మనసున నిలిపి నేను ఎన్నికుండలు చేయుదునా అని ఆలోచించును

30. బంకమట్టిని కాళ్ళతో తొక్కి చేతులతో మలచును. తరువాత కుండకు మెరుగు పూతపూయును. ఆవమును శుభ్రము చేయుటకు ప్రొద్దుపోయినవరకు పనిచేయును.

31. వీరందరును చేతులతో శ్రమచేయువారు. ప్రతి ఒక్కడును తన పనిలో తాను నైపుణ్యమును చూపును.

32. వీరు పని చేయనిచో పట్టణములు నిలువవు. నగరములలో ఎవరు వసింపజాలరు. వాని దరిదాపులకు ఎవరురారు.

33. కాని ఈ చేతి వృత్తులవారు సభలలో పాల్గొనరు. పెద్ద పదవులను చేపట్టరు. న్యాయాధిపతులు కాజాలరు. న్యాయశాస్త్రాంశములను అర్థము చేసికోజాలరు. వారికి చదువు సంధ్యలు, విచక్షణ జ్ఞానము ఉండవు వారు విజ్ఞానసూక్తులను ఉదాహరింపలేరు.

34. కాని వారు తమ చేతి పనితో ఈ లోకమును నిలుపుదురు. వారి రోజువారి పనియే వారి ప్రార్థనలు