ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

యోనా

 1. ప్రభువువాణి అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై అతనితో,

2. “నీవు ఆ పెద్దనగరమైన నీనెవెకు వెళ్ళి దానిని మందలింపుము. ఆ నగర ప్రజల దౌష్ట్యము నా దృష్టికి ఘోరమాయెనని చెప్పుము” అని పలికెను.

3. కాని యోనా ప్రభువు చెంతనుండి తప్పించుకొని పోయి తర్షీషు చేరుకోనెంచెను. అతడు యెప్పేకు వెళ్ళగా అచట ఒక ఓడ తర్షీషునకు వెళ్ళుటకు సిద్ధముగా నుండెను. అతడు సొమ్ము చెల్లించి ఆ నావలో ఎక్కెను. ప్రయాణీకులతో పాటు తర్షీషు చేరుకొని, ప్రభువు చెంతనుండి తప్పించుకోవచ్చునని అతని తలంపు.

4. కాని ప్రభువు సముద్రముపై గొప్ప తుఫానును రేపెను. ఆ పెనుగాలి తాకిడికి ఓడ బద్దలగునట్లు ఉండెను.

5. నావికులు భయపడి ఒక్కొక్కడు తనతన దేవునికి ప్రార్థన చేసిరి. ఓడ బరువు తగ్గించుటకు దానిలోని సరకులను సముద్రమున పడవేసిరి. యోనా మాత్రము ఓడ క్రింది భాగమునకు పోయి పడుకొని మైమరచి నిద్రించుచుండెను.

6. ఓడ అధిపతి అతనిని చూచి "ఓయి! నీవు నిద్రించుచున్నావేమి? లేచి నీ దేవునికి ప్రార్థన చేయుము. బహుశ, నీ దేవుడు నీ మొరనాలించి మనలను గుర్తుకు తెచ్చుకొని మన ప్రాణములు కాపాడవచ్చును” అనెను.

7. నావికులు మనము చీట్లువేసి ఈ దురదృష్టమునకు కారకులెవరో తెలిసికొందము అనుకొనిరి. వారు చీట్లు వేయగా యోనా పేరు వచ్చెను.

8. కావున వారతనిని చూచి “ఓయి! ఈ దురదృష్టము మా మీదికి ఎవరివలన వచ్చినదో చెప్పుము. నీవు ఇచటేమి చేయు చున్నావు? ఎచటినుండి వచ్చుచున్నావు? నీ దేశమేది? జాతియేది?" అని ప్రశ్నించిరి.

9. అతడు "నేను హీబ్రూజాతివాడను. సముద్రమునకును, భూమికిని సృష్టికర్తయై ఆకాశమందుండు దేవుడైన ప్రభునియందు భయభక్తులు గలవాడను” అని చెప్పెను.

10. అతడు దేవుని సన్నిధినుండి పారిపోవుచున్నాడని నావికులు గ్రహించిరి. అతడే వారికా సంగతి చెప్పెను. కనుక వారు మిక్కిలి భయపడి 'నీవెంత పని చేసితివి?' అనిరి.

11. క్షణక్షణము తుఫాను పెరిగిపోవుచుండెను. “సముద్రము మామీదకి రాకుండ శాంతించుటకుగాను మేము నిన్నేమి చేయవలయునో చెప్పుము” అనిరి.

12. యోనా “మీరు నన్ను సముద్రమున పడవేసినచో అది శాంతించును. నా మూలముననే ఈ పెను తుఫాను పట్టుకొనినది” అని అనెను.

13. అయినను నావికులు ఓడను ఒడ్డుకు చేర్పగోరి కష్టముతో తెడ్లువేసిరి. కాని తుఫాను ఇంకను అధికమగుచుండుటచే వారి ప్రయత్నము నెగ్గలేదు.

14. కనుక వారు ప్రభువునుద్దేశించి "ప్రభూ! మేమితని ప్రాణములు తీసినందులకుగాను నీవు మమ్ము నాశనము చేయవలదు. మేము నిర్దోషిని చంపితిమని మామీద నేరము మోపవలదు. నీవు నీ యిష్టము వచ్చిన రీతిని ఈ కార్యము చేసితివి. ఇది నీ చెయిదము” అని ప్రార్థించిరి.

15. ఆ పిమ్మట యోనాను ఎత్తి సముద్రములో పడవేసిరి. అది వెంటనే శాంతించెను.

16. ఆ సంఘటననుగాంచి సైనికులు ప్రభువును తలంచుకొని మిక్కిలి భయపడిరి. ప్రభువునకు బలినర్పించి మొక్కుబడులు చేసికొనిరి.

17. ప్రభువు నియమించిన ప్రకారము ఒక పెద్ద చేప యోనాను మ్రింగివేసెను. అతడు మూడు దినములు చేప కడుపులోనుండెను. 

 1. చేప కడుపులోనుండి యోనా తన దేవుడైన ప్రభువునకు ఇట్లు ప్రార్థన చేసెను:

2. "ప్రభూ! నా ఆపదలో నేను నీకు మొరపెట్టగా నీవు నా గోడు వింటివి. నేను పాతాళలోకమునుండి నీకు కేకలువేయగా, నీవు నా వేడుకోలును అంగీకరించితివి.

3. నీవు నన్ను కడలిలోనికి విసరివేసితివి. సముద్ర గర్భమున పడవేసితివి. ప్రవాహములు నన్ను చుట్టుముట్టెను. నీ మహాతరంగములు నా మీదికి పొర్లివచ్చెను.

4. నీవు నన్ను నీ సమక్షమునుండి బహిష్కరించితివనియు, నీ పవిత్రమందిరమును నేను మరల కంటితో చూడననియు, నేను తలంచితిని.

5. జలములు నా గొంతువరకు వచ్చి నన్ను ముంచివేసెను. సముద్రము నన్ను మ్రింగివేసెను. నాచు నా తలకు చుట్టుకొనెను.

6. నేను పర్వత మూలముల వరకు మునిగిపోతిని. నిత్యము తలుపులు మూసియుండెడి లోకము లోనికి వెళ్ళిపోయితిని. అయినను ప్రభూ! నీవు నన్ను పాతాళమునుండి సజీవునిగా బయటికి కొనివచ్చితివి.

7. ప్రభూ! నా ప్రాణములు ఎగిరిపోవుచుండగా నేను నిన్ను స్మరించుకొంటిని. నా మొర నీ పవిత్రమందిరమున నిన్ను చేరెను.

8. నిరర్థకములైన విగ్రహములను కొల్చువారు నీయెడల భక్తితో మెలగజాలరు.

9. కాని నేను నీ స్తుతులు పాడి నీకు బలిని అర్పింతును. నా మ్రొక్కుబడులు చెల్లించుకొందును. ప్రభువునుండియే రక్షణము లభించును”,

10. అంతట ప్రభువు చేపను ఆజ్ఞాపింపగా, అది యోనాను ఒడ్డున వెళ్ళగక్కెను. 

1. ప్రభువువాణి రెండవమారు యోనాకు ప్రత్యక్షమై,

2. “నీవు ఆ పెద్ద నగరమైన నీనెవెకు వెళ్ళి నేను నీతో చెప్పిన సందేశమును ఆ నగర ప్రజలకు బోధింపుము" అని చెప్పెను.

3. యోనా ప్రభువు ఆజ్ఞ శిరసావహించి నీనెవెకు వెళ్ళెను. ఆ పట్టణము చాల పెద్దది. దానిని దాటిపోవుటకు మూడునాళ్ళు పట్టును.

4. అతడు నగరమున ప్రవేశించి ఒక్కరోజు ప్రయాణముచేసి “నలువది దినములు ముగియగానే నీనెవె నాశనమగును” అని ప్రకటించెను.

5. నీనెవె పౌరులు దేవునిమాట నమ్మిరి. వారు ప్రజలెల్లరును ఉపవాసము చేయవలెనని ప్రకటించిరి. అధికులనుండి అల్పులవరకు అందరును గోనె ధరించిరి.

6. ఆ వార్త విని నీనెవె రాజు సింహాసనము దిగి తన ఉడుపులు తొలగించి గోనెతాల్చి బూడిదపై కూర్చుండెను.

7. అతడు నీనెవె నగరమందంతట ఇట్లు చాటించెను: “ఇది రాజు, అతని అధికారులు జారీచేసినఆజ్ఞ. నరులు గాని, పశువులుగాని, ఎడ్లమందలు గాని, గొఱ్ఱెల మందలుగాని ఏమియు తినరాదు. ఎవరును ఏమియు తినరాదు, త్రాగరాదు.

8. నరులు, పశువులు కూడ గోనె తాల్పవలెను. ఎల్లరును నిండుమనస్సుతో మొరపెట్టవలెను. అందరును తమ దుష్టవర్తనము మార్చుకొని తమ దుష్కార్యములను విరమించుకోవలెను.

9. ఒకవేళ దేవుడు మనస్సు మార్చుకొని, జాలిచెంది తన కోపోగ్రతను ఉపసంహరించుకోవచ్చును. మనము చావు తప్పించుకోవచ్చును.”

10. దేవుడు ఆ ప్రజలు చేసిన కార్యములు చూచెను. వారు తమ దుష్కార్యములను విడనాడిరని తెలిసికొనెను. వారిమీద జాలిచెంది పూర్వము తాను నుడివినట్లు వారిని శిక్షింపడయ్యెను. 

 1. ఇది అంతయు చూచి యోనా మిగుల మనస్సు నొచ్చుకొని ఆగ్రహము చెందెను.

2. అతడిట్లు ప్రార్థించెను: “ప్రభూ! నేను మా ఇంటి వద్దనున్నపుడే నీవిట్లు చేయుదువని చెప్పలేదా? కావుననే నేను తప్పించుకొని తర్షీషునకు వెళ్ళిపోయితిని. నీవు దయ, నెనరుగల దేవుడవు. సులభముగా కోపించువాడవు కావు. మిక్కిలి కరుణగలవాడవు. నీ మనసు మార్చుకొని జనులను శిక్షింపక వదలివేయుదువు.

3. ప్రభూ! ఇప్పుడు నీవు నా ప్రాణములు తీసికొనుము. నేను బ్రతికియుండుట కంటె చచ్చుటయే మేలు.”

4. అందుకు ప్రభువు అతనితో “నీవు ఇట్లు కోపించుట తగునా?” అని అనెను.

5. యోనా నగరమునుండి వెడలిపోయి తూర్పు ప్రక్కకు వెళ్ళి అచట కూర్చుండెను. అచట ఒక పందిరి వేసికొని దాని నీడలో కూర్చుండి నగరమునకు ఏమి జరుగునో చూతమని వేచియుండెను.

6. యోనా తలకు నీడనిచ్చి అతనికి ఉపశాంతిని దయచేయుటకు దేవుడైన ప్రభువు అతని చెంత ఒక సొరపాదు పెరుగునట్లు చేసెను. యోనా దానిని చూచి మిగుల సంతోషించెను.

7. కాని మరునాటి వేకువనే దేవుడు ఒక పురుగును ఏర్పరుపగా, అది ఆ పాదును తొలచగా అది చచ్చెను.

8. సూర్యుడుదయించిన పిదప దేవుడు తూర్పునుండి వేడిగాలి తోలించెను. సూర్య తాపమునకు తాళజాలక యోనా సొమ్మసిల్లి పడిపోవునట్లుండెను. అతడు ప్రాణములు విడువగోరెను. “నేను బ్రతుకుట కంటెచచ్చుటయే మేలు" అని పలికెను.

9. దేవుడు యోనాతో “నీవు ఆ సొరపాదు పోయినందుకు ఇంతగా కోపించుటతగునా?” అని అనెను. అతడు “నేను కోపించుట న్యాయమే, నేను చనిపోవునంతగా కోపింతును” అని బదులు చెప్పెను.

10. అప్పుడు ప్రభువు అతనితో “ఈ సొరపాదు ఒక రేయి పెరిగి ఒక రేయి చచ్చినది. నీవు దానికొరకు ఎట్టి కష్టమును చేయలేదు. దానిని పెంచనూలేదు. అయినను అది పోయినందులకు ఇంతగా చింతించు చున్నావే,

11. అయితే అభము శుభము తెలియని వారు లక్ష ఇరువది వేల కంటె ఎక్కువ మందియే ఉన్నారు. ఇంకను పెక్కుపశువులును కలవు, మరి నేను ఆ పెద్దనగరమైన నీనెవె మీద జాలి చూప వలదా?” అనెను.