ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

తోబీతు 8వ అధ్యాయము || Telugu catholic bible online

 1. వారు అన్నపానీయములు సేవించి ముగించిన పిదప రేయి నిదురపోవు సమయమయ్యెను. అప్పుడు సారా తల్లితండ్రులు తోబియాను శోభనపు గదిలోనికి తీసికొనిపోయిరి.

2. అతడు రఫాయేలు సలహాను జ్ఞప్తికి తెచ్చుకొని తన సంచిలోనుండి చేపగుండెను, కాలేయమును వెలుపలికి తీసి వానిలో కొంత భాగమును మండుచున్న సాంబ్రాణి మీద వేసెను.

3. భూతము ఆ వాసనను భరింపజాలక ఐగుప్తుదేశము ఎగువ భాగమునకు పారిపోయెను. రఫాయేలు భూతము వెంటపడి తరిమెను. ఆ దేశమున దానిని పట్టుకొని దాని కాలుసేతులు బంధించెను.

4. సారా తల్లిదండ్రులు గదితలుపులు మూయగా తోబియా పడుక మీదినుండి లేచి సారాతో “నీవు లేచి నిలుచుండుము. ప్రభువు మనమీద కరుణబూని మనలను కాపాడుటకు ఇరువురము ప్రార్ధన చేయుదుము” అని చెప్పెను.

5. సారా లేచి నిలుచుండగా ఇరువురు ప్రభువు తమను రక్షింపవలెనని మనవిచేయసాగిరి. తోబియా ఇట్లు జపించెను: “మా పితరుల దేవుడవైన ప్రభూ! నీకు స్తుతి కలుగునుగాక! నీ దివ్య నామమునకు కలకాలము కీర్తి కలుగును గాక! ఆకాశము, నీవు చేసిన సృష్టి అంతయు సదా నిన్ను కొనియాడునుగాక!

6. నీవు ఆదామును సృజించితివి, అతనికి భార్యగాను, ఆదరువుగాను, తోడుగాను ఉండుటకై ఏవను చేసితివి. వారి నుండే మానవజాతి ఉద్భవించెను. 'నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు. అతనికి సాటియైన తోడునుగూడ చేసెదను' అని నీవు నిశ్చయించుకొంటివి.

7. నేను కామతృప్తి కొరకు కాక దైవాజ్ఞకు లొంగి ఈ సారాను స్వీకరించితిని. నీవు మమ్ము కరుణతో జూచి, ముసలిప్రాయము వరకు మేమిరువురము తోడూనీడగా జీవించునట్లు దయచేయుము.”

8. ప్రార్థన ముగిసిన తరువాత వధూవరులిరువురును 'ఆమెన్' అని జవాబు చెప్పిరి.

9. ఆ రేయి యిరువురు కలిసి శయనించిరి. ఆ రాత్రి రగూవేలు సేవకులను తీసికొనిపోయి సమాధి త్రవ్వించెను.

10. అతడు “బహుశ తోబియా కూడ మృత్యువువాత బడియుండును, ఇరుగు పొరుగు వారు మమ్ము హేళన చేయుదురు కాబోలు” అని అనుకొనెను.

11. సమాధిని త్రవ్వి ముగించినపిదప అతడు ఇంటిలోనికి పోయి భార్యను పిలిచి,

12. “ఒక పని పిల్లను శోభనపు గదిలోనికి పంపి తోబియా బ్రతికియున్నాడో లేదో తెలిసికొనిరమ్మని చెప్పుము. అతడు చనిపోయెనేని ఎవరికి తెలియకుండ వెంటనే పాతిపెట్టుదుము” అని చెప్పెను.

13. కావున వారు పనికత్తెను పిలిచి దీపము వెలిగించిరి. గది తలుపు తెరచి ఆమెను లోపలికి పంపిరి. ఆమె లోపలికి వెళ్ళి చూడగా వధూవరులిద్దరు గాఢనిద్రలో మునిగియుండిరి.

14. కనుక పనికత్తె వెలుపలికి వచ్చి అతడు చనిపోలేదు. బాగుగానే యున్నాడని చెప్పెను.

15. అప్పుడు రగూవేలు ఆకాశాధిపతిన దేవుని ఇట్లు స్తుతించెను: “ప్రభూ! నీవు స్తుతిచేయదగినవాడవు. నీ ప్రజలు నిన్ను సదా కీర్తింతురుగాక! నిర్మల హృదయముతోనే వారు నిన్ను స్తుతింతురుగాక!

16. నీవు నన్ను సంతోషచిత్తుని చేసితివి. కనుక నేను నిన్ను వినుతింతును. నేను మాకు కష్టములు వాటిల్లునని వెరచితిని. కాని నీ కృపవలన అట్లు జరుగలేదు. నీవు మాపట్ల ఎనలేని నెనరు చూపితివి.

17. ఈ ఏకైక పుత్రుని ఈ ఏకైక పుత్రికను నీవు కరుణతో మన్నించితివి కనుక నీకు ఇవే మా మ్రొక్కులు. ప్రభూ! ఈ దంపతులకు నీ కృపను, నీ రక్షణను దయచేయుము. ఆనందము అనురాగములతో జీవించునట్లు నీవు వీరిని దీవింపుము.”

18. అంతట రగూవేలు తెల్లవారకమునుపే సేవకులచేత సమాధి పూడ్పించెను.

19. అతడు భార్యతో రొట్టెలను సమృద్ధిగా కాల్చుమని చెప్పెను. తాను మందలయొద్దకు బోయి రెండు కోడెదూడలను, నాలుగు పొట్టేళ్ళను తోలుకొని వచ్చెను. వానిని కోసి వివాహోత్సవమునకుగాను విందు సిద్ధము చేయుడని సేవకులను ఆజ్ఞాపించెను.

20. తోబియాను పిలిచి “నీవు రెండువారముల పాటు మాయింటినుండి కదలకూడదు. కనుక ఇచటనే ఉండుము. మనము ఇరువురము కలిసే అన్నపానీయములు సేవింతము. అమ్మాయి యిన్ని కడగండ్ల పాలయిన తరువాత ఇప్పుడు నీవు ఆమెను సంతోషపెట్టవలెను కదా!

21. రెండువారములు గడచిన తరువాత నీవు నా సొత్తులో సగము తీసికొని సురక్షితముగా నీ తండ్రి చెంతకు వెళ్ళవచ్చును. మీ అత్త, నేను గతించిన తరువాత మిగిలిన సగము నీకే దక్కును. నీపట్ల మాకు గల అనురాగము గూర్చి నీవు ఏ మాత్రమును శంకింపవలదు. ఇంత వరకు సారాకు మేమెట్లు తల్లిదండ్రులమైతిమో ఇకమీదట నీకును అట్లే తల్లిదండ్రులమగుదుము. కనుక నీవేమి సందేహింపవలదు” అని చెప్పెను.