ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సమూవేలు రెండవ గ్రంధము 6వ అధ్యాయము || Catholic Bible in Telugu

 1. దావీదు యిస్రాయేలీయులనుండి ముప్పది వేలమంది వీరులను ఎన్నుకొనెను.

2. వారిని వెంటనిడుకొని కెరూబుదూతలమధ్య నివసించు, సైన్యములకు అధిపతియగు యావే పేర వెలయు మందసమును కొనివచ్చుటకై యూదానందలి బాలాకు పయనమై పోయెను.

3. వారు మందసమును క్రొత్త బండి మీదికెక్కించి కొండమీది అబీనాదాబు ఇంటినుండి తరలించుకొని వచ్చిరి.

4. అబీనాదాబు పుత్రులగు ఉస్సా, అహ్యో బండి తోలించుచుండిరి. ఉస్సా బండి ప్రక్కన, అహ్యో బండిముందట నడచుచుండిరి.

5. వాద్యకారులు సితారా, మృదంగము, తంబుర, స్వరమండలము, తాళములను వాయించుచుండగా దావీదు, యిస్రాయేలీయులు తన్మయులై యావే ముందట నాట్యమాడిరి.

6. వారు నాకోను కళ్ళము వద్దకు వచ్చిరి. అచట ఎడ్లు బండిని గతుకులలోనికి ఈడ్చుటచే మందసముజారి క్రిందపడబోయెను. కనుక ఉస్సా చేయిచాచి దానిని పట్టుకొనెను.

7. కాని యావే ఉగ్రుడై ఉస్సా నేరము సహింపక, ఉన్నవానిని ఉన్నట్లు శిక్షించెను. అతడు మందసము ప్రక్కన కూలి ప్రాణము విడిచెను.

8. ఆ రీతిగా యావే ఉస్సా మీద పడినందుకు దావీదు ఆ తావునకు పేరెస్ ఉస్సా ' అని పేరు పెట్టెను. నేటికిని ఆ తావు అదే పేరుతో పిలువబడుచున్నది.

9. నాడు దావీదు యావేకు భయపడి, దైవమందసమును ఇంటికి కొనిపోవుట మేలాయని అనుమానపడెను.

10. కనుక అతడు మందసమును దావీదుపురమునకు కొనిపోవుట చాలించి గిత్తీయుడైన ఓబేదెదోము ఇంటికి చేర్చెను.

11. అతని ఇంట మందసము మూడుమాసములు ఉండెను. యావే ఓబేదెదోమును, అతని కుటుంమును చల్లనిచూపు చూచెను.

12. మందసము మూలముగా యావే ఓబేదెదోము కుటంబమును, అతని ఆస్తిపాస్తులను వృద్ధిచేసెనని దావీదు వినెను. అతడు సంతసముతో మందసమును తన నగరికి కొనివచ్చెను.

13. మందసమును మోయువారు ఆరేసి అడుగులు వేసినపిదప దావీదు కోడెను, బలసిన పొట్టేలును బలిఅర్పించెను.

14. రాజు, యాజకులు ధరించు నారబట్టతాల్చి యావే ముందు తన్మయుడై నాట్యమాడెను.

15. అతడును, యిస్రాయేలీయులును కొమ్మునూదుచు, పెద్ద పెట్టున నాదములు చేయుచు, యావే మందసమును కొనివచ్చిరి.

16. మందసము నగరము ప్రవేశించుచుండగా సౌలు కూతురు మీకాలు కిటికీనుండి చూచెను. దావీదు మందసము ముందు గంతులు వేయుచు నాట్యమాడు చుండెను. మీకాలు దావీదును గాంచి ఏవగించుకొని అతనిని చిన్నచూపుచూచెను.

17. జనులు మందసమును కొనివచ్చి, దావీదు ముందుగనే సిద్ధముచేసిన గుడారున ప్రతిష్ఠించిరి. రాజు దహనబలులు, సమాధానబలులు సమర్పించెను.

18. బలులు ఒసగిన పిమ్మట సైన్యములకు అధిపతియైన యావే పేర ప్రజలను దీవించెను.

19. స్త్రీలు, పురుషులనక యిస్రాయేలీయులందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రొట్టెను, కొంత మాంసమును, ఎండిన ద్రాక్షపండ్లను పంచి పెట్టెను. అంతట అందరు తమతమ ఇండ్లకు వెళ్ళి పోయిరి.

20. దావీదు తన కుటుంబమును కూడ దీవింప వచ్చెను. సౌలు కూతురు మీకాలు అతనికి ఎదురుపడి “నేడు యిస్రాయేలు రాజు బట్టలు వూడిన కూడ పనికత్తెల ఎదుట పిచ్చివానివలె నాట్యమాడి ఎంత గౌరవము తెచ్చుకొనెను!” అని ఎత్తిపొడిచెను.

21. అతడు “నేను యావే ఎదుట నాట్యమాడితిని. ప్రభువు నీ తండ్రిని, అతని కుటుంబమును కాదని తన ప్రజలైన యిస్రాయేలీయులకు నన్ను నాయకునిగా నియమించెను. ఆ ప్రభువు ఎదుట నేను నాట్యము చేయవలదా?

22. నేనింతకంటె ఎక్కువగా అగౌరవము పాలయ్యెదనుగాక! నీ కంటికింకను చులుకన అయ్యెదనుగాక! కాని నీవు పేర్కొనిన ఆ పనికత్తెలు మాత్రము నన్ను మన్నన చేయకపోరు” అనెను.

23. సౌలు కూతురు మీకాలునకు మాత్రము చనిపోవువరకును సంతానము కలుగలేదు.

Copyright © 2025 Telugu Catholic Bible All Rights Reserved | Website Designed by HyderHub Web Services