ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

తోబీతు 5వ అధ్యాయము || Telugu catholic bible online

 1. తోబియా తండ్రితో “నేను నీవు చెప్పినదెల్ల చేయుదును.

2. కాని నేను గబాయేలునుండి డబ్బు తెచ్చుకొనుటయెట్లు? నేనతనిని ఎరుగను, అతడు నన్నెరుగడు. అతడు నన్ను నమ్మి నాకు సొమ్ము ఇచ్చుటకు నేను అతనికేమి ఆనవాలు చూపవలెను? అదియునుగాక మాదియాకు ఏత్రోవన పోవలెనోకూడ నాకు తెలియదు” అనెను.

3. అందుకు తోబీతు కుమారునితో “పూర్వము నేనును, గబాయేలును ఒక పత్రముపై సంతకము చేసితిమి. దానిని రెండు ముక్కలుగా చించి, నేనొక ముక్కను తీసికొంటిని. అతని ముక్కను సొమ్ముతో చేర్చియుంచితిని. ఇరువది యేండ్ల నాడు ఈ సొమ్మును అతని వద్ద దాచితిని. కుమారా! ఇప్పుడు నీతోపాటు మాదియాకు అచటినుండి మరల ఇచటకు ప్రయాణము చేయుటకు అంగీకరించు నమ్మకస్తుడు ఒకనిని వెదకి తెచ్చుకొనుము. నీవు తిరిగివచ్చు రోజువరకును అతనికి వేతనము చెల్లింతము. నీవు అతనితో పోయి గబాయేలు వద్దనుండి ఆ సొమ్ము తీసికొనిరావచ్చును” అని చెప్పెను.

4. కనుక తోబియా తనను మాదియాకు తీసికొని పోవు నమ్మకస్తుని వెదకబోయెను. బయటికి వెళ్ళగనే రఫాయేలు దేవదూత అతనికి ప్రత్యక్షమయ్యెను. కాని తోబియాకు అతడు దేవదూతయని తెలియదు.

5. కనుక తోబియా "అయ్యా! మీది ఏ ఊరు?” అని అతనిని అడిగెను. రఫాయేలు "నేను కూడ యిస్రాయేలీయుడనే, పనియేమైన దొరుకునేమో అని ఈ పట్టణమునకు వచ్చితిని" అనెను. “నీకు మాదియాకు దారి తెలియునా?” అని తోబియా ప్రశ్నించెను.

6. అందులకు రఫాయేలు “తెలియకేమి? నేనచటికి చాలసార్లు వెళ్ళితిని. అచటికి పోవుదారులన్నియు నాకు సుపరిచితములే. నేను ఆ దేశమునకు పోయినపుడెల్ల రాగీసు నగరమున వసించు మా బంధువు గబాయేలు ఇంట బసచేసెడివాడను. ఎక్బటానా నుండి రాగీసును చేరుకొనుటకు రెండు నాళ్ళు పట్టును. ఎక్బటానా మైదానములలోనున్నది. రాగీసు కొండలలో ఉన్నది” అని పలికెను.

7. తోబియా “చెలికాడా! నేను మా తండ్రితో ఈ సంగతి చెప్పి వచ్చెదను, నీవు కొంచెము సేపు ఇక్కడనే నిలువుము. నీవు నా వెంట ప్రయాణము చేయవలెను. మేము నీకు వేతనము చెల్లింతుము” అనెను.

8. ఆ మాటలకు రఫాయేలు “సరియే, నీవు కోరినట్లే నేనిచట వేచియుందును. కాని నీవు మాత్రము జాగుచేయవద్దు” అనెను.

9. తోబియా తండ్రి చెంతకు పోయి “నాతో ప్రయాణము చేయుటకు మన జాతివాడొకడు దొరకెను” అని చెప్పెను. తండ్రి “అతనిని ఇచటికి తీసికొని రమ్ము. అతడు ఏ తెగకు, ఏ కుటుంబమునకు చెందిన వాడో తెలిసికొందును. నీకు నమ్మదగిన నేస్తుడు ఔనో కాదో గూడ పరిశీలించి చూతును” అని నుడివెను. కనుక తోబియా బయటికి వెళ్ళి మా తండ్రి నిన్ను చూడగోరుచున్నాడని చెప్పి రఫాయేలును పిలుచుకొని వచ్చెను.

10. రఫాయేలు ఇంటిలోనికి రాగానే తోబీతు అతనికి స్వాగతము చెప్పెను. దేవదూత “నీకు కుశలమేనా?” అని అడిగెను. తోబీతు “బాబూ! నాకు కుశలమెక్కడిది? నేను కన్నులు లేని కబోదిని. చనిపోయిన వారివలె నేనును వెలుగును చూడజాలకున్నాను. నా బ్రతుకు సజీవ సమాధివలె ఉన్నది. నరులు మాట్లాడుట విందునుగాని, వారి రూపమును మాత్రము చూడజాలను” అని అంగలార్చెను. రఫాయేలు "అయ్యా! విచారింపకుము. దేవుడు శీఘ్రముగనే నీకు చూపు దయచేయును” అని చెప్పెను. తోబీతు “నా కుమారుడు తోబియా మాదియా దేశమునకు వెళ్ళవలెను. నీవు అతనికి తోడుగా వెళ్ళి మార్గము చూపించగలవా? మేము నీకు వేతనము చెల్లింతుము” అని అడిగెను. దేవదూత “నేను అతనితో తప్పక వెళ్ళెదను. నేను మాదియాకు చాలమారులు వెళ్ళితిని. ఆ దేశమునందలి కొండలలో, మైదానములలో తిరిగితిని. అందలి దారులన్నియు నాకు తెలియును” అని పలికెను.

11. తోబీతు “నాయనా! నీది ఏతెగ? ఏ కుటుంబము? అని అడిగెను.

12. రఫాయేలు “నా తెగతో నీకేమి అవసరము?” అనెను. తోబీతు “నీవెవరి కుమారుడవో, నీ పేరేదో నేను రూఢిగా తెలిసికోగోరెదను” అనెను.

13. దేవదూత “నా పేరు అసరయా. నేను నీ చుట్టమైన పెదఅననీయా కుమారుడను” అని చెప్పెను.

14. తోబీతు "కుమారా! నీకు స్వాగతము. నేను నీ కుటుంబమును గూర్చి తెలిసికోగోరినందులకు నీవు అన్యధా భావింపవలదు. నీవు మంచి పరపతిగల కుటుంబమునకు చెందినవాడవు. మాకు అయినవాడవు కూడ. పెదషేమయా కుమారులు అననీయా, నాతాను నాకు బాగుగా తెలియును. వారు ప్రభువు ఆజ్ఞలను తు.చ. తప్పకుండ పాటించెడివారు. మేమందరము కలిసే యెరూషలేమునకు యాత్రకు వెళ్ళెడివారము. అచట ప్రభువును సేవించుకొనెడివారలము. నీ బంధువులు మంచివారు. మీ కుటుంబము యోగ్యమైనదే” అని పలికెను.

15. తోబీతు ఇంకను “నేను నీకు పూటకొక్క రూక చొప్పున వేతనము చెల్లింతును. నా కుమారునికి వలె నీకును దారిబత్తెము నిత్తును. నీవు నా తనయునితో కలిసి పయనము చేయుము.

16. కడన జీతమునేగాక మరికొంత సొమ్మునుగూడ ముట్టజెప్పుదును” అని పలికెను. దేవదూత “నేను నీ కుమారునితో పోయెదను. నీవేమీయు భయపడవలదు. మేము అచటికిని, మరల యిచటికిని గూడ సురక్షితముగా ప్రయాణము చేయగలము. మార్గమున ఎట్టి అపాయమును కలుగదు” అని పలికెను.

17. తోబీతు దేవదూతతో “దేవుడు నిన్ను దీవించుగాక!” అనెను. అటుతరువాత అతడు పుత్రుని పిలిచి “కుమారా! ప్రయాణమునకు అవసరమైన వస్తువులనెల్ల సిద్ధము చేసికొని నీ స్నేహితుని వెంటపొమ్ము. ఆకాశమునందలి దేవుడు దారిలో మిమ్ము కాపాడునుగాక! ఆయన మిమ్ములనిరువురిని మరల సురక్షితముగా నా చెంతకు తోడ్కొనివచ్చును గాక! ప్రభువుదూత కూడ మీతో పయనించి మీకు బాసటగా నుండునుగాక!" అని నుడివెను. తోబియా తల్లిదండ్రులను ముద్దాడి మాదియాకు పయనము కట్టెను. తండ్రి అతనితో భద్రముగా ప్రయాణము చేయుమని చెప్పెను.

18. అప్పుడు తోబియా తల్లి అన్నా వెక్కివెక్కి ఏడ్చుచు భర్తతో “నీవు నా బిడ్డను ఇట్లు పంపుదువా? వానిమీద ఆధారపడిగదా మనము జీవించునది? ఇక మనకు దిక్కెవరు?

19. డబ్బు అంత అమూల్యమైనదా? దాని కొరకు మన గారాబు బిడ్డ ప్రాణములనే అపాయముపాలు చేయవచ్చునా?

20. దేవుడు మనకిచ్చిన దానితోనే సరిపెట్టుకొని ఈ బ్రతుకును ఎటులయినను ఈడ్వవచ్చును గదా?” అని వాపోయెను.

21. అందుకు తోబీతు “నీవు విచారింపకుము. మన బిడ్డ సురక్షితముగా పోయి చెక్కుచెదరకుండ తిరిగివచ్చును. వాడు భద్రముగా ఇల్లు చేరుటను నీ కంటితోనే చూతువు. కనుక నీవు వానిమీద బెంగ పెట్టుకొనకుము.

22. యోగ్యుడైన దేవదూత మనబిడ్డతో పోవును. వాడు ప్రయాణమును విజయవంతముగా ముగించుకొని క్షేమముగా తిరిగివచ్చును” అని పలికెను. ఆ మాటలకు అన్నా ఏడుపు చాలించెను.