ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

యూదితు 5వ అధ్యాయము || Telugu catholic bible online

1. అస్సిరియా సైన్యాధిపతి హోలోఫెర్నెసు యిస్రాయేలీయులు యుద్ధమునకు సన్నద్దులు అగుచున్నారని వినెను. వారు కొండలలోని కనుమలను మూసివేసిరనియు, పర్వతశిఖరములను సురక్షితము చేసిరనియు, మైదానములలో అడ్డంకులు పెట్టిరనియు విని ఉగ్రుడయ్యెను.

2. అతడు మోవాబు దొరలను, అమ్మోనీయుల సైన్యాధిపతులను, సముద్రతీరమునుండి వచ్చిన సంస్థానాధిపతులను మంత్రాలోచనకు పిలిపించెను.

3. “మీరెల్లరు కనానుమండలమున వసింతురు గదా! బలమునకు కారణమేమి? వారిని పరిపాలించుచు వారి సైన్యములను నడిపించురాజెవడు?

4. ఈ పశ్చిమ జాతులలో వీరు మాత్రమే నన్ను సందర్శింపకుండుటకును, శరణువేడకుండుటకును కారణమేమి?” అని అతడు వారిని ప్రశ్నించెను.

5. అపుడు అమ్మోనీయుల నాయకుడు అకియోరు ఇట్లు చెప్పెను: "అయ్యా! నీ దాసుడు విన్నవించుకొను సంగతులను ఆలింపవేడెదను. నీ శిబిరమునకు చేరువలో వసించు ఈ పర్వతవాసుల గూర్చిన వివరములనెల్ల విన్పించెదను. నీ దాసుడు అబద్దములు చెప్పువాడు కాదు.

6. ఈ ప్రజలు తొలుత కల్దీయులు.

7. వారు తమ పితరుల మార్గమును విడనాడి ఆకాశాధిపతియైన దేవుని సేవింపదొడగిరి.

8. తమ పితరులు కొలిచిన దైవములకు మ్రొక్కరైరి. కనుక కల్దీయులు మెసపొటామియాకు పారిపోయి అచట చాలకాలము వసించిరి.

9. దైవాజ్ఞపై ఆ తావును విడనాడి కనాను మండలమునకు వచ్చి అచట స్థిరపడిరి. అచట వెండి బంగారములను, మందలను సంపాదించుకొని సంపన్నులైరి.

10. అటు తరువాత కనాను మండలమున కరవురాగా ఐగుప్తునకు వలసవెళ్ళి, తిండి దొరికినంత కాలమును అచటనే ఉండిరి. ఆ దేశమున వారు లెక్కలకందని రీతిగా పెరిగిపోయిరి.

11. కాని ఐగుప్తు రాజు వారిని పీడించి పిప్పిచేసెను. వారిని బానిసలుగా చేసివారిచే ఇటుకలు చేయించుకొనెను.

12. ఆ జనులు తమ దేవునికి మొరపెట్టగా అతడు ఐగుప్తును అరిష్టముల పాలుచేసెను. కనుక ఐగుప్తీయులు వారిని తమ దేశమునుండి వెళ్ళగొట్టిరి.

13-14. దేవుడు ఈ ప్రజల కొరకు సముద్రము ఇంకిపోవునట్లు చేసెను. వీరిని సీనాయి, కాదేషు బార్నెయాల మీదుగా నడిపించుకొని వచ్చెను. ఆ ప్రయాణమున వీరు ఎడారిలోని జాతుల నెల్ల జయించిరి.

15. అటు తరువాత అమోరీయుల మండలమును ఆక్రమించుకొనిరి. హెష్బోను ప్రజలను నాశనము చేసిరి. యోర్దానునదిని దాటి ఈ కొండ భూములను స్వాధీనము చేసికొనిరి.

16. ఇచట వసించు చున్న కనానీయులును, పెరిస్సీయులును, యెబూసీయులును, షెకేమీయులును, గిర్గాషీయులను వెడల గొట్టిరి. వీరు ఈ ప్రదేశముననే చాలకాలమునుండి వసించుచున్నారు.

17. ఈ ప్రజలు కొలుచు దేవుడు పాపమును ఎంత మాత్రము సహింపనివాడు. వీరు ఆయన ఆజ్ఞలను మీరి పాపము చేయనంతకాలము తామరతంపరగా వృద్ధిచెందిరి.

18. కాని ఆయనకు అవిధేయులై పాపము కట్టుకొనగనే శిక్షను అనుభవించిరి. కొందరు యుద్ధములలో హతులైరి. మిగిలిన వారు దూరదేశములకు ప్రవాసులుగా వెళ్ళిరి. వారి దేవాలయము నేలమట్టమయ్యెను. శత్రువులు వారి నగరములను స్వాధీనము చేసికొనిరి.

19. కాని వారు మరల తమ దేవుని ఆశ్రయించిరి. కనుక పూర్వము తాము చెల్లా చెదరైయున్న ప్రవాసదేశముల నుండి ఈ ప్రదేశమునకు తిరిగి రాగలిగిరి. తమ దేవళమునకు నిలయమైన యెరూషలేము నగరమును మరల ఆక్రమించుకొనిరి. తాము ప్రవాసమునకు వెళ్ళినప్పటినుండి నిర్మానుష్య ముగా నున్న ఈ కొండనేలలను మరల స్వాధీనము చేసికొనిరి.

20. అయ్యా! ఇప్పుడు ఈ ప్రజలు తమ దేవుని ఆజ్ఞమీరి పాపము కట్టుకొనిరని మనకు రూఢిగా తెలిసెనేని మనము వీరిమీద దాడిచేసి వీరిని జయింపవచ్చును.

21. కాని ఈ జనులట్టి పాపము దేనిని చేసియుండరేని ప్రభువుల వారు వీరిని ఎదిరించుట శ్రేయస్కరము కాదు. వీరు కొలుచు ప్రభువు వీరిని తప్పక రక్షించును. లోకమునెదుట మనము నగుబాట్లు తెచ్చుకొందుము.”

22. అకియోరు తన ఉపన్యాసము ముగింపగనే శిబిరమున గుమిగూడియున్న వారందరు అతనిమీద విరుచుకొనిపడిరి. వయోవృద్ధులైన హోలోఫెర్నెసు సైన్యాధిపతులు, మోవాబీయులు, సముద్రతీరము నుండి వచ్చినవారు అకియోరును ముక్కముక్కలుగా చీల్చివేయవలెను అనిరి.

23. వారు “మనము ఈ యిస్రాయేలీయులకు జంకనేల? వారు దుర్బలులు, మనల నెదిరించుటకు వారికి బలమైన సైన్యముగూడ లేదు.

24. కనుక అయ్యా! మనము పోయి వారిమీద పడుదము. నీ మహాసైన్యము వారిని కబళించివేయును” అని పలికిరి.